రూ. 2వేల నోటు రద్దుకు 2020 నుంచే కసరత్తు!

by Disha Web Desk 12 |
రూ. 2వేల నోటు రద్దుకు 2020 నుంచే కసరత్తు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: 2,000 నోట్ల రద్దు .. ఇది అకస్మాత్తుగా వచ్చిన ప్రకటనలా కనిపిస్తున్నా.. వాస్తవానికి 2019-20 ఆర్థిక సంవత్సరం చివరి నుంచే స్పష్టమైన సంకేతాలు వెలువడడం మొదలైంది. ఎందుకంటే ఆ ఏడాదిలో ఒక్కటంటే ఒక్క రూ. 2,000 నోటును కూడా ఆర్బీఐ ప్రింట్ చేయలేదు. అంతకుముందు 2016-17లో రూ. 354.29 కోట్లు, 2017-18లో రూ. 11.15 కోట్లు, 2018-19లో రూ. 4.66 కోట్లు విలువైన రూ. 2000 నోట్లను ప్రింట్ చేసి రిలీజ్ చేశారు. 2021 ప్రారంభం నుంచి రూ. 2000 నోటు ఏటీఎంలలో కనిపించకుండా పోయింది. దీంతో ప్రభుత్వం నుంచి మళ్లీ ఏదో పెద్ద ప్రకటన వస్తుందనే ప్రచారం జరిగింది. అయితే ఆ విషయంపై అప్పట్లో ఆర్బీఐ క్లారిటీ ఇవ్వలేదు. ప్రకటన చేయలేదు. కానీ ఆ నోట్ల ప్రింటింగ్ ను ఆపేశామని ఒక సమాచార హక్కుచట్టం పిటిషన్‌కు స్పందనగా వెల్లడించింది.

రూ. 2000 నోట్ల స్థానంలో కొత్త రూ. 50, రూ. 200 నోట్ల ముద్రణను క్రమంగా పెంచినట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఏటీఎంలలో ఒక్కో వ్యాల్యూ కలిగిన నోటును పెట్టడానికి ఒక్కో స్లాట్ ఉంటుంది. రూ. 2 వేల నోటును పెట్టడానికి కూడా ఒక స్లాట్ ఉండేది. అయితే దాన్ని 2020 ఆరంభం నుంచే విడతల వారీగా ఏటీఎంల నుంచి తీసేశారని.. దాని స్థానంలో కొత్త రూ. 100 నోట్ల స్లాట్ లు పెట్టారని అప్పట్లో ప్రచారం జరిగింది. రెండు వేల నోట్లను ఇకపై ఏటీఎంలలో లోడ్‌ చేయవద్దని అప్పట్లోనే బ్యాంకు అధికారులకు ఆదేశాలు అందాయని ప్రముఖ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి.

రద్దుకు కారణాలేమిటి?

పెద్ద నోట్ల వల్ల బ్లాక్‌మనీ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే వాదన ఎప్పటి నుంచో ఉన్నది. దీంతోపాటు నకిలీ కరెన్సీ పెరుగుతుందన్న ఆందోళన వినిపించింది. ఎక్కువ విలువ కలిగిన నోట్ల వల్ల డబ్బును దాచుకోవడం, ముఖ్యంగా బ్లాక్‌కు మళ్లించడం సులభమవుతుంది. లాకర్లలో పెద్ద మొత్తంలో డబ్బును దాచుకోవచ్చు. అలా చేయడం వల్ల మార్కెట్‌లో క్యాష్‌ ఫ్లో తగ్గిపోతుంది. దీన్ని అడ్డుకోవడానికే ప్రభుత్వం 2వేల నోట్ల రద్దు దిశగా నిర్ణయం తీసుకొని ఉండొచ్చని బ్యాంకింగ్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సహజంగానే పెద్ద నోట్లన్నీ ఆగిపోయి వాటి స్థానంలో చిన్ననోట్ల చలామణి పెరుగుతుంది.

దీనివల్ల బ్లాక్‌మనీతో పాటు, క్యాష్‌ఫ్లో సమస్య కూడా పరిష్కారమవుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ‘వంద రూపాయల నకిలీ నోటు ముద్రణకు, రూ. 2వేల నోటు ముద్రణకు ఖర్చులో కొద్దిపాటి తేడా మాత్రమే ఉంటుంది. కానీ నోట్ల విలువలో భారీ తేడా ఉంటుంది. అలాంటప్పుడు దొంగ నోట్ల తయారీదారుల ఆప్షన్‌ సహజంగా పెద్ద నోటే అవుతుంది. ఇప్పుడు రూ.2వేల నోటు రద్దు కానుండటంతో నకిలీ నోట్ల ముఠాలకు చెక్ పడినట్టు అవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

107 రెట్లు పెరిగిన నకిలీ నోట్లు..

2015లో రిజర్వు బ్యాంకు మహాత్మా గాంధీ సిరీస్‌-2005లో కొత్త నంబరింగ్‌ సిస్టంతో కూడిన అన్ని డినామినేషన్ల నూతన కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టింది. వీటిలోని సెక్యూరిటీ ఫీచర్లు చాలా స్పష్టంగా కనిపించేవి. దీంతో అసలు నోట్లకు, నకిలీ నోట్లకు మధ్య ఉన్న తేడాలను సాధారణ ప్రజలు సైతం సులభంగా గుర్తించగలిగేవారు. కానీ, పెద్ద నోట్లను రద్దు చేసి రూ.2 వేల నోట్లను ప్రవేశపెట్టిన తర్వాత నకిలీ నోట్ల చలామణి ఏకంగా 107 రెట్లు పెరిగింది. 2016లో దేశవ్యాప్తంగా 2,272 నకిలీ రూ.2 వేల నోట్లు పట్టుబడ్డాయని, 2020లో వీటి సంఖ్య ఏకంగా దాదాపు 2.45 లక్షలకు చేరినట్టు నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్‌లో వెల్లడించింది.

తప్పులను ఆలస్యంగా అర్థం చేసుకున్నారు: అఖిలేష్ యాదవ్,

చాలామంది తమ తప్పులను ఆలస్యంగా అర్థం చేసుకున్నారు. రూ. 2000 నోటు విషయంలోనూ అదే జరిగింది. ఆ నిర్ణయానికి నేడు దేశ ఆర్థిక వ్యవస్థ, ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు. ఏకపక్షంగా పాలన సాగితే ఇలాగే ఉంటుంది.

నాటి తుగ్లక్ ఉత్తర్వు బాటలోనే ఈ నిర్ణయం: జైరాం రమేశ్

మనం స్వయం ప్రకటిత ప్రపంచ గురువును చూస్తున్నాం. గతంలో ఆయన తుగ్లక్ డిక్రీ ఇచ్చి పెద్ద నోట్లు రద్దు చేశారు. అదే కోవలో ఇప్పుడు రూ.2000 నోట్లను ఉపసంహరించుకునే నిర్ణయం ప్రకటించారు.

మళ్లీ రూ. 1000 నోటు తెస్తారేమో: పి. చిదంబరం

2016 నవంబర్‌లో మేం చెప్పింది నిజమని ఇప్పుడు రుజువైంది. 500, 1000 నోట్లను తీసేసి రూ.2000 నోటును మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ నోటును తీసి మళ్లీ రూ. 1000 నోటును తీసుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రూ. 2000 నోటు ఎప్పుడు క్లీన్ నోటు కాదు. చాలా మంది ఈ నోటు ను ఉపయోగించడం లేదు. ప్రజలు ఈ నోటును నల్లధనం కోసమే ఉపయోగిస్తున్నారు.

Read more:

రూ.2 వేల నోట్లు మేము తీసుకోం.. నిమిషాల వ్యవధిలోనే హైదరాబాద్‌లో నిలిచిన ట్రాన్స్‌క్షన్స్..!

రూ.2 వేల నోట్ల రద్దు.. ఇదే అసలు కారణమా?




Next Story

Most Viewed