హరీష్​ స్వాతి ముత్యం.. KCR ​ఆణిముత్యం: మామ అల్లుళ్లపై రేవంత్ రెడ్డి సెటైర్లు

by Disha Web Desk 19 |
హరీష్​ స్వాతి ముత్యం.. KCR ​ఆణిముత్యం: మామ అల్లుళ్లపై రేవంత్ రెడ్డి సెటైర్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: “హరీష్​ స్వాతి ముత్యం.. కేసీఆర్​ఆణిముత్యం” అని ఎవరికి వారు అనుకుంటే సరిపోదని, పబ్లిక్ నుంచి మంచి పేరు రావాలని టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌ను విమర్శించారు. కేసీఆర్‌ను డీ కొట్టేందుకు మిగతా పార్టీల్లో ఉండే అసంతృప్తి నేతలంతా కాంగ్రెస్‌లోకి రావాలని, పార్టీ మీకు గుర్తింపు ఇచ్చేలా చర్యలు తీసుకుంటుందన్నారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. హరీష్​రావు కేవలం పొడుగు ఉంటే సరిపోదని, మెదడు కూడా ఉండాలన్నారు. అది కూడా మోకాళ్లలోనో? అరికాళ్లలోనో? ఉంటే ఉపయోగం ఉండదని రేవంత్ ఎద్దేవా చేశారు.

ప్రజలకు ఏం భరోసా ఇచ్చారని రేవంత్ ప్రశ్నించారు. అన్ని వర్గాల పబ్లిక్​ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే గెలుపు అన్నారు. సెక్యూరిటీ లేకుండా హరీష్, కేటీఆర్​ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లగలరా? అంటూ ఫైర్​అయ్యారు. క్షేమంగా తిరిగి రాగలిగితే హరీష్, కేటీఆర్‌లు చెప్పేవి నిజం అని నమ్ముతానని రేవంత్ స్పష్టం చేశారు. కేసీఆర్ చేసే మోసాలను ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని, లేకపోతే భవిష్యత్​తరాలు నష్టపోతాయని రేవంత్ ప్రజలకు సూచించారు.

నిరుద్యోగ ఖాళీలపై సీఎం శాసనసభలో చెప్పింది అబద్దమా? గంటా చక్రపాణి గవర్నర్‌కు ఇచ్చిన నివేదిక అబద్దమా? అంటూ రేవంత్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బిస్వాల్ కమిటీ చెప్పినట్టు ఇప్పటి వరకు 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని లెక్కలు చెబుతున్నా.. సర్కార్​వాటిని నింపడం లేదన్నారు. నిరుద్యోగుల ఉసురు తప్పకుండా తగులుతుందని రేవంత్ కేసీఆర్ ప్రభుత్వానికి శాపం పెట్టారు. మరోవైపు ఓఆర్ఆర్ కేటీఆర్ ధన దాహానికి బలైందన్నారు. కల్వకుంట్ల కుటుంబం దారిదోపిడీ దొంగతనానికి పాల్పడిందన్నారు. బేస్ ప్రైస్ లేకుండా ఓఆర్ఆర్ టెండర్లు పిలవడంపై మేం ప్రశ్నించాం అని పేర్కొన్నారు.

టెండర్​దక్కించుకున్న సంస్థ 30 రోజుల్లోగా 10శాతం,120 రోజుల్లోగా పూర్తి డబ్బు సంస్థ చెల్లించాలని నిబంధన ఉంది. ఐఆర్‌బీ కూడా దీనికి ఒప్పుకున్నదన్నారు. కానీ ఏప్రిల్ 27, 2023 లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ జరగగా.. ఇప్పటికే ముప్పై రోజుల గడువు ముగిసిందన్నారు. దీంతో నియమ నిబంధనలు ఉల్లంఘించిన ఐఆర్‌బీ సంస్థ టెండర్‌ను రద్దు చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. లిక్కర్ దందా విషయంలో టెండర్ నిబంధనలు సరళీకృతం చేసి ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేసినట్లు రేవంత్ సంచలనమైన ఆరోపణలు చేశారు.

కేసీఆర్ కుటుంబం లిక్కర్ దందాలో రూ. 100 కోట్ల స్కాం చేసిందన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లానే.. ఓఆర్‌ఆర్ కూడా పెద్ద స్కామ్​అన్నారు. తాను చెప్పేది, దీనిపై పూర్తి బాధ్యత అరవింద్ కుమార్‌పై ఉన్నదని, త్వరలోనే ఉచలు లెక్కపెట్టే పరిస్థితి వస్తుందన్నారు. కాంగ్రెస్‌ను గెలవకుండా చేసేందుకు ఎన్ని కుట్రలకు పాల్పడినా.. బీజేపీ, బీఆర్ఎస్‌లను ప్రజలు ఇక నమ్మే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్, మోదీ అవిభక్త కవలని మండిపడ్డారు. బీఆర్ఎస్‌కు మైనారిటీ ఓట్లను కూడా తాకట్టు పెట్టారన్నారు. ఎంఐఎం అధ్యక్షుడు ఏం చేస్తుండో అర్థం కాదన్నారు.



Next Story

Most Viewed