2018 తరువాత మొదలైన అసలు కథ.. సగటున ఒక్కొక్కరికి లక్షన్నర జీతం

by Disha Web Desk 2 |
2018 తరువాత మొదలైన అసలు కథ.. సగటున ఒక్కొక్కరికి లక్షన్నర జీతం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రీ–అపాయింట్, ఎక్స్ టెన్షన్ పేరుతో పని చేస్తున్న రిటైర్డ్ అధికారుల సంఖ్యను చూసి ప్రభుత్వం షాక్‌కు గురైంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,049 మంది ఆఫీసర్లు పనిచేస్తున్నట్టు లెక్క తేలింది. అంత పెద్ద సంఖ్యలో రిటైర్డ్ అధికారులు ఉన్నట్టు ఇంతకాలం రహస్యంగా ఉంచారు. ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారు? ఎవరికి ఎంత జీతం చెల్లిస్తున్నారు? అనే విషయాలను కూడా రహస్యంగా ఉంచారు. కానీ రెండు రోజుల క్రితం రిటైర్డ్ అధికారుల వివరాలు అర్జెంట్‌గా పంపాలని సీఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు. దీంతో 32 శాఖలు, 120 హెచ్ఓడీల నుంచి అందిన వివరాలు చూసి సీనియర్ అధికారులు సైతం ఖంగుతిన్నారు.


కేటీఆర్ చూసిన శాఖల్లోనే అత్యధికం..

గత ప్రభుత్వంలో కేటీఆర్ మున్సిపల్ శాఖ బాధ్యతలు చూశారు. ఆ శాఖలోనే అత్యధికంగా 178 మంది రిటైర్డ్ అధికారులు రీ– అపాయింట్, ఎక్స్ టెన్షన్ పేరుతో పనిచేస్తున్నట్టు లెక్క తేలింది. వీరంతా పలు మున్సిపల్ కార్పొరేషన్లు, హెచ్ఎండీఏ, మున్సిపల్ కమిషనరేట్, వాటర్ వర్క్స్‌లో కీలక హోదాలో పనిచేస్తున్నారు. తమ మాట వినేవారికి మాత్రమే అప్పటి ప్రభుత్వం రీ–అపాయింట్ చేసిందినే విమర్శలు ఉన్నాయి. మున్సిపల్ శాఖ తరువాత రెండో స్థానంలో సివిల్ సప్లయీస్ లో 88 మంది పనిచేస్తుండగా, హయ్యర్ ఎడ్యుకేషన్‌లో 77 మంది, ఇరిగేషన్ లో 74 మంది, ఆర్ అండ్ బీలో 63 మంది వర్క్ చేస్తున్నట్టు రిపోర్టులు వచ్చాయి. మిగతా శాఖల్లో కూడా పదుల సంఖ్యలో ఆఫీసర్లను రీ–అపాయింట్ చేసినట్టు లెక్క తేలింది.

ఐదేండ్లలో వెయ్యి కోట్ల భారం

రీ అపాయింట్, సర్వీస్ ఎక్స్ టెన్షన్ పేరుతో ప్రభుత్వంపై పడిన అదనపు భారంపై ప్రభుత్వం లెక్కలు తీస్తున్నట్టు తెలిసింది. బీఆర్ఎస్ రెండోసారి అధికారంలో ఉన్న కాలాన్ని (2019– 2023) ప్రామాణికంగా పెట్టుకుని జీతభత్యాల వివరాలను ఆరా తీస్తున్నట్టు సమాచారం. రిటైర్డ్ అయ్యే నాటికి ఉన్న జీతాన్ని రీ అపాయింట్ తరువాత కూడా చెల్లిస్తున్నారు. కారు, అటెండర్ సౌకర్యాలను కూడా కల్పించారు. 1049 మందికి సగటున రూ.1.5 లక్షల జీతం చెల్లించినా.. ప్రతి నెల రూ. 16 కోట్ల భారం పడిందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ఐదేండ్లలో దాదాపు రూ. 1000 కోట్లు కేవలం రిటైర్డ్ అధికారుల జీత భత్యాల కోసం ఖర్చు చేసినట్టు ప్రభుత్వ వర్గాల్లో టాక్ ఉంది.

నచ్చిన వారు, బంధువులకే..

బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో రీ–అపాయింట్స్ లేవు. ఇరిగేషన్, ఆర్ అండ్ బీలో ఇద్దరు, ముగ్గురు ఆఫీసర్లు మాత్రమే ఉండేవారు. కానీ 2018 తరువాత అసలు కథ మొదలైందని ప్రచారం జరుగుతున్నది. తమకు నచ్చిన అధికారులు, బంధువులు ఉద్యోగ విరమణ అయిన వెంటనే అప్పటి ప్రభుత్వంలో కీలక హోదాలో ఉన్న వ్యక్తులు, మంత్రులు తమ పలుకుబడిని ఉపయోగించి, రీ–అపాయింట్ పేరుతో అదే హోదాలో కొనసాగించారనే ఆరోపణలు ఉన్నాయి.

Next Story

Most Viewed