టీఆర్‌టీ నోటిఫికేషన్‌ విడుదల.. ఆ అంశంలో నిరుద్యోగులు ఫైర్

by Disha Web Desk 4 |
టీఆర్‌టీ నోటిఫికేషన్‌ విడుదల.. ఆ అంశంలో నిరుద్యోగులు ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. 5089 స్కూల్‌ అసిస్టెంట్‌, సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌, లాంగ్వేజ్‌ పండిట్స్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌ పోస్టుల ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 20వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్‌ 21వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించింది. ఆన్ లైన్‌లో మాత్రమే అప్లికేషన్లు స్వీకరించనున్నారు. నవంబర్‌ 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌ పద్దతిన పరీక్ష నిర్వహించనున్నారు.

మొత్తం 5089 పోస్టులు ఉండగా అందులో స్కూల్‌ అసిస్టెంట్‌ 1739, లాంగ్వేజ్ పండిట్‌ 611, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ 164, సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ 2575 చొప్పున పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు రూ.1000 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 18 నుంచి 44 ఏండ్ల వయస్సు కలిగిన వారు ఈ పరీక్షకు అర్హులుగా పాఠశాల విద్యాశాఖ స్పష్టంచేసింది. బీఈడీ, డీఈడీ, బీపీఈడీలో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇతర వివరాలకు https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ సందర్శించాలని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం పట్టణాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.

టీఆర్టీ నోటిఫికేషన్‌ను ఈనెల 6వ తేదీన విడుదలు చేశారు. కానీ దీనిపై ఎలాంటి సమాచారం అభ్యర్థులకు ఇవ్వలేదు. గోప్యంగా నోటిఫికేషన్ రిలీజ్ చేయడంపై నిరుద్యోగులు విద్యాశాఖ అధికారుల తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. కనీసం వెబ్‌సైట్‌లో కూడా పెట్టలేదని వారు వాపోతున్నారు. కేజీబీవీ పోస్టులు భర్తీ చేసినట్లుగానే ఈ పోస్టులను కూడా గుట్టుగా భర్తీ చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి కేసీఆర్ 13500 పోస్టులు భర్తీచేస్తామని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.

కానీ 5089 పోస్టులు మాత్రమే భర్తీ చేయడంపై నిరుద్యోగులు నిరసనలకు దిగారు. అన్ని ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మిగిలిన పోస్టుల భర్తీ ఇప్పట్లో సాధ్యం కాదని, అన్ని భర్తీ చేయాలని ఆందోళనలు చేశారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. నిరుద్యోగులపై లాఠీ ఝుళిపించింది. తీరా 5089 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినా గోప్యంగా ఉంచడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


Next Story