Junior doctors: జూనియర్ డాక్టర్ల పెండింగ్ స్టైఫండ్, అరియర్స్ విడుదల

by Ramesh Naini |

రాష్ట్రంలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలో ఉన్న జూనియర్ డాక్టర్లందరికీ పెండింగ్‌లో ఉన్న స్టైఫండ్‌లు, అరియర్స్ పూర్తిగా విడుదల చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (టీ-జూడా) కృతజ్ఞతలు తెలిపింది.

Junior doctors: జూనియర్ డాక్టర్ల పెండింగ్ స్టైఫండ్, అరియర్స్ విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలో ఉన్న జూనియర్ డాక్టర్లందరికీ పెండింగ్‌లో ఉన్న స్టైఫండ్‌లు, అరియర్స్ పూర్తిగా విడుదల చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (టీ-జూడా) కృతజ్ఞతలు తెలిపింది. పెండింగ్ స్టైఫండ్స్ అన్నింటిని ప్రభుత్వం శుక్రవారం సమీక్షించి ఆమోదించగా, అరియర్స్ సైతం రెగ్యులర్ స్టైఫండ్‌తో పాటు జూనియర్ డాక్టర్ల ఖాతాల్లో జమ చేయబడ్డాయని టీజూడా అధ్యక్షుడు డాక్టర్ ఐజాక్ న్యూటన్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. దాదాపు రూ.19 కోట్లు విలువైన పెండింగ్ అరియర్స్ విడుదల అయినట్లు వెల్లడించారు. ఇందులో 2023, 2024 పోస్ట్‌ గ్రాడ్యుయేట్ బ్యాచ్‌లకు చెందిన జూనియర్ డాక్టర్లు కూడా ఉన్నారని వారు వివరించారు. అరియర్స్ కు అర్హత ఉన్న సీనియర్ రెసిడెంట్లకు కూడా జమ చేయబడిందన్నారు. జనవరి 2025 నుంచి జూన్ 2025 వరకు గల కాలానికి, జి.ఓ. నం. 90 ప్రకారం స్టైఫండ్ సవరణల ఆధారంగా పోస్ట్‌గ్రాడ్యుయేట్ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్లు, 2019, 2020 బ్యాచ్‌ల హౌస్ సర్జన్లు, సూపర్ స్పెషాలిటీ పోస్ట్‌గ్రాడ్యుయేట్లకు అరియర్స్ ఖాతాలో జమ అయినట్లు తెలిపారు.

రెగ్యులర్ స్టైఫండ్ సైతం..

రెగ్యులర్ స్టైఫండ్లు కూడా చెల్లించబడ్డాయన్నారు. జూన్ 2025 నుంచి పలుమార్లు తాము ఈ అంశాన్ని మంత్రి దామోదర్ రాజనర్సింహ దృష్టికి తీసుకు పోయినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ నిధుల విడుదలతో సమస్య పూర్తిగా పరిష్కారమైందని డా. ఐజాక్ న్యూటన్, డా. అజయ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. 2021 బ్యాచ్‌కు చెందిన, ఎండీ పూర్తి చేసి ప్రస్తుతం సీనియర్ రెసిడెంట్లుగా సేవలందిస్తున్న పోస్ట్‌ గ్రాడ్యుయేట్ డాక్టర్లు తమకు రావలసిన అరియర్స్ పొందారని.. 2022 బ్యాచ్‌కు చెందిన, ఇటీవల ఎండీ పూర్తి చేసి సీనియర్ రెసిడెన్సీలో చేరిన పోస్ట్‌గ్రాడ్యుయేట్ డాక్టర్లు కూడా తమ అరియర్లు పొందారని వారు వెల్లడించారు. హౌస్ సర్జన్లు, సూపర్ స్పెషాలిటీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు కూడా తమ పెండింగ్ బకాయిలను పొందారని తెలిపారు. పెండింగ్ బిల్లులను తక్షణం సమీక్షించి చెల్లింపులు జరిగేలా చేసిన ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనర్సింహ, హెల్త్ స్పెషల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చోంగ్తుకి, డీఎంఈ డా. ఎ. నరేంద్ర కుమార్ కు ఈ సందర్భంగా టీ-జూడా కృతజ్ఞతలు తెలియజేసింది.

Next Story