చర్చలు సక్సెస్.. మంత్రి హామీతో సమ్మె విరమించిన రేషన్ డీలర్లు

by Disha Web Desk 2 |
చర్చలు సక్సెస్.. మంత్రి హామీతో సమ్మె విరమించిన రేషన్ డీలర్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: సమస్యలపై మంత్రి గంగుల కమలాకర్ ఇచ్చిన హామీ మేరకు సమ్మెను విరమిస్తున్నట్లు మంత్రి సమక్షంలో రేషన్ డీలర్ల జేఏసీ ప్రతినిధులు ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌‌పై సంపూర్ణ నమ్మకం ఉందని సీఎం తమ సమస్యలను పరిష్కరిస్తారని ఆశతో సమ్మెను విరమిస్తున్నట్లు వారు ప్రకటించారు. వచ్చే నెల 5వ తేదీ నుంచి రేషన్‌ డీలర్ల సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో బీఆర్ అంబేడ్కర్‌ సచివాలయంలో సోమవారం పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్‌ తెలంగాణ రేషన్‌ డీలర్ల ఐక్యకార్యాచరణ కమిటీ(జేఏసీ)తో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో జేఏసీ ఇచ్చిన 22 డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేద ప్రజలకు నిత్యావసర సరుకులను సకాలంలో అందించవలసిన కనీస బాధ్యత, కర్తవ్యం తెలంగాణ ప్రభుత్వానికి ఎంతైతే ఉందో రేషన్‌ డీలర్లపై కూడా అంతే ఉందని అన్నారు.

పేద ప్రజలకు నిత్యావసర సరుకులు అందించడం ఒక సామాజిక బాధ్యత అనే విషయాన్ని డీలర్లు మరవద్దని ఈ బాధ్యతను విస్మరించి రేషన్‌ బియ్యం పంపిణీకి ఆటంకం కలిగించేలా రేషన్‌ డీలర్లు సమ్మెకు పిలుపునివ్వడం బాధాకరమన్నారు. రేషన్‌ డీలర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. మొత్తం 22 సమస్యలపై 20 సమస్యల పరిష్కారానికి సానుకూలంగా ఉన్నామని ఇందుకు సంబంధించి వారం రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని, గౌరవ వేతనం, కమీషన్‌ పెంపు ఈ రెండు సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో శాసనసభ్యులు వినయ్‌ భాస్కర్‌, పద్మాదేవేందర్‌ రెడ్డి, సివిల్ సప్లై కమిషనర్‌ వీ.అనిల్‌కుమార్‌, జేఏసీ చైర్మన్‌ నాయికోటి రాజు, వైస్‌ ఛైర్మన్‌ బంతుల రమేష్‌బాబు, కన్వీనర్‌ దుమ్మాటి రవీందర్‌, కో`కన్వీనర్‌ గడ్డం మల్లికార్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

Also Read..

తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట: మంత్రి శ్రీనివాస్ గౌడ్

Next Story

Most Viewed