నిధులు మంజూరైన.. రోడ్డు నిర్మాణం ఏది?

by Jakkula.Mamatha |

రోడ్డంతా ధ్వంసమై మొత్తం పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి నిత్యం ప్రమాదాలకు అడ్డాగా మారిన రోడ్డుకు నిధులు మంజూరై సంవత్సరం గడిచిన నిర్మాణానికి నోచుకోలేదు.

నిధులు మంజూరైన.. రోడ్డు నిర్మాణం ఏది?
X

దిశ,ఇబ్రహీంపట్నం: రోడ్డంతా ధ్వంసమై మొత్తం పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి నిత్యం ప్రమాదాలకు అడ్డాగా మారిన రోడ్డుకు నిధులు మంజూరై సంవత్సరం గడిచిన నిర్మాణానికి నోచుకోలేదు. నిత్యం గుంతల రోడ్డుపై ప్రమాదాలు జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం, రాయపోల్ గ్రామం నుంచి పోల్కంపల్లి వరకు వెళ్లే రోడ్డంతా ధ్వంసమై గుంతలతో ప్రమాదాలకు నిలయంగా మారింది. కాగా గతంలో 'దిశ'లో వచ్చిన కథనాలకు స్పందించిన ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి రోడ్డు నిర్మాణానికి సంవత్సరం క్రితం రూ. 56 లక్షల రూపాయలు మంజూరు చేసి టెండర్ల ద్వారా కాంట్రాక్టర్ కు ఇచ్చారు. కాగా కాంట్రాక్టర్ పనులను ప్రారంభించి నిలిపివేశాడు.

ఈ రోడ్డు మార్గం రాయపోల్ నుంచి పోల్కంపల్లి వయా అనాజ్ పూర్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్ విజయవాడ హైవేను కలుపుతుంది. ఇది ఇలా ఉండగా ఇబ్రహీంపట్నం, మంచాల మండలలోని పలు గ్రామాలకు చెందిన వందలాది మంది జీవనోపాధికి ప్రతిరోజు ఈ రోడ్డునే ఆశ్రయిస్తున్నారు. అలాగే ఈ రోడ్డు మార్గంలో ఇబ్రహీంపట్నం నుంచి యాదగిరిగుట్ట, చౌటుప్పల్, దండుమైలారం బస్సులు వెళ్తాయి. కాగా ఈ రోడ్డు ధ్వంసమై పూర్తిగా గుంతలమయంతో దాదాపు 2 కిలో మీటర్లు ఉంటుంది.

దీని వలన ఈ రోడ్డు వెంట ప్రయాణం చేసేటప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు మండిపడుతున్నారు. కాగా ఈ రోడ్డు నిర్మాణానికి సంవత్సరం క్రితమే రూ. 56 లక్షలు మంజురైనా ఇప్పటికి నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో ప్రాణాలు పోయిన పట్టించుకోరా? అని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవతో రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాలని వెంటనే కాంట్రాక్టర్ కు ఆదేశాలు ఇచ్చి నూతన రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలని గ్రామస్తులు కోరారు.

రోడ్డుపై ప్రయాణం నరకంగా ఉంది: రాయపోల్ గ్రామస్తుడు

రోడ్డంతా పూర్తిగా ధ్వంసమై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. దీంతో రోడ్డుపై ప్రయాణం నరకంగా ఉంది. ప్రతిరోజు ఈ రోడ్డుపై ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే రోడ్డు పనులు ప్రారంభించాలని రాయపోల్ గ్రామస్తుడు గువ్వల సుధాకర్ కోరారు.

కాంట్రాక్టర్ వైఫల్యం వల్ల రోడ్డు నిర్మాణం ఆగింది.

టెండర్ ద్వారా కాంట్రాక్ట్ పొందిన కాంట్రాక్టర్ సంవత్సరం నుంచి రోడ్డు నిర్మాణం పనులు చేపట్టక కాలయాపన చేస్తున్నారు. కాంట్రాక్టర్‌కు ఇప్పటికే చాలాసార్లు నోటీసులు ఇచ్చాం. కాంట్రాక్టర్ వైఫల్యం వల్ల రోడ్డు నిర్మాణం ఆగింది. కాబట్టి కాంట్రాక్టర్ అగ్రిమెంట్ తొలగించి, మళ్లీ టెండర్ ద్వారా మరో కాంట్రాక్టర్ కు బదిలీ చేసి రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తాం. పంచాయతీరాజ్ ఏఈ సిద్ధార్థ తెలిపారు.

Next Story