TSPSC పేపర్ లీకేజీ కేసు.. సిట్ అదుపులో షాద్ నగర్ యువకుడు!

by Disha Web Desk 19 |
TSPSC పేపర్ లీకేజీ కేసు.. సిట్ అదుపులో షాద్ నగర్ యువకుడు!
X

దిశ, షాద్ నగర్: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌కు లింకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ షాద్ నగర్ పరిధిలోని నేరళ్ళచెరువు గ్రామానికి చెందిన ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం..

లింకు ఎలా అంటే..

మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం పంచాంగల్ తండకు చెందిన డాక్య సల్కర్, పేట గ్రామానికి చెందిన తిరుపతయ్య, రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధి నేరళ్ళచెరువు గ్రామనికి చెందిన రాజేంద్ర కుమార్ గతంలో గండేడ్ మండలంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో పని చేసినప్పుడు మిత్రులు. అయితే టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన ఏఈ పరీక్షల కోసం రాజేంద్రకుమార్ హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్ నగర్‌లో కోచింగ్ తీసుకున్నాడు.

కాగా, ఏఈ పరీక్షకు సరిగ్గా మూడు రోజులు ముందు హైదరాబాద్‌లో తిరుపతయ్య కలవగా.. తాను ఏఈ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నట్లు రాజశేఖర్ చెప్పాడు. దీంతో తిరుపతయ్య పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రేణుక భర్త డాక్య వద్ద ప్రశ్న పత్రం తీసుకొని రాజేంద్ర కుమార్‌కి ఇచ్చాడు. ఇందుకు రూ.10 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు.

ముందుగా తిరుపతయ్యకు రూ. 5 లక్షల చెల్లించిన రాజేంద్ర కుమార్.. మిగతా డబ్బులను పరీక్ష ఫలితాలు వెలువడిన తర్వాత ఇస్తానని చెప్పినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో రాజేంద్ర కుమార్‌ను సిట్ అధికారుల బృందం రాత్రి అదుపులోకి తీసుకొని హైదరాబాదుకు తరలించినట్లు సమాచారం. అయితే.. రాజేంద్రకుమార్ అప్పు చేసి మరి తిరుపతయ్యకు డబ్బులు ముట్ట చెప్పినట్లు తెలిసింది.

Next Story

Most Viewed