ప్రధాని నరేంద్ర మోడీకి టీఆర్ఎస్ ఎమ్మెల్యే సవాల్

by Web Desk |
ప్రధాని నరేంద్ర మోడీకి టీఆర్ఎస్ ఎమ్మెల్యే సవాల్
X

దిశ, ఆమనగల్లు(మాడ్గుల): నిత్యం రైతుల క్షేమం కోరుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకాన్ని దేశం మొత్తం అమలు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి టీఆర్ఎస్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సవాల్ విసిరారు. తెలంగాణలో అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను ఇతర రాష్టాలు కూడా అమలు చేయాలని చూస్తున్నాయని ఎమ్మెల్యే అన్నారు. మంగళవారం మాడ్గుల మండల రైతుసమన్వయ సమితి అధ్యక్షులుగా నియమితులైన పగడాల రవితేజ ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఎదురులేని శక్తిగా మారిందని, ప్రతిపక్షాలకు రాష్ట్రంలో స్థానం లేదని ఎద్దేవా చేశారు. అనంతరం రైతుసమన్వయ సమితి నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. రైతులకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉండాలని సూచించారు. అనంతరం రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రవితేజ మాట్లాడుతూ.. రైతు క్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శంకర్ నాయక్, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ తోట గిరియాదవ్, డైరెక్టర్లు, పాక్స్ చైర్మన్‌లు గంప వెంకటేష్, తిరుమల రెడ్డి, స్థానిక సర్పంచ్ జంగయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.



Next Story