ఒకే విడతలో దళిత బంధు ఉత్త కథనే..! : ప్రసాద్ కుమార్

by Disha Web Desk 11 |
ఒకే విడతలో దళిత బంధు ఉత్త కథనే..! :  ప్రసాద్ కుమార్
X

దిశ, ప్రతినిధి వికారాబాద్ : చావైనా.. బతుకైనా వికారాబాద్ ప్రజలతోనే, చనిపోయే వరకు మీకు సేవ చేస్తూ వికారాబాద్ నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడతానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం వికారాబాద్ పట్టణంలోని మధు కాలనీ, రాజీవ్ నగర్ కాలనీ, రిక్షా కాలనీ, రామయ్యకుడా, ఎమ్ఐజీ, అంబేద్కర్ నగర్, ఇందిరా నగర్, గరీబ్ నగర్, కన్య లాల్ బాగ్, శివరాం నగర్ కాలనీలలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన చావైనా బ్రతుకైనా మీతోనే ఉంటానని, రెండు సార్లు ఓడిపోయిన నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండని చేతులెత్తి వేడుకున్నారు.

వికారాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా నేను చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తుంది తప్ప ప్రస్తుత ఎమ్మెల్యే చారాణా పని కూడా చేయలేదన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో వికారాబాద్ జిల్లా, ముఖ్యంగా వికారాబాద్ నియోజకవర్గం తీవ్రంగా నష్టపోయింది. అసలు వికారాబాద్ జిల్లా ఒకటి ఉంది అనే విషయాన్నే ముఖ్యమంత్రి కేసీఆర్ మర్చిపోయాడు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ఇక్కడికి వచ్చి ఏదో ఒక బూటకపు హామీ ఇచ్చి వెళ్లడం తప్ప కేసీఆర్ ఈ ప్రాంతానికి చేసింది ఏమీ లేదన్నారు.

ఒకే విడతలో దళిత బంధు ఉత్త కథనే..

వికారాబాద్ ప్రజలకు ఎన్నికల సమయంలో ఏదో నెరవేరని చిల్లర హామీలు ఇస్తే చాలు ఓట్లు వేసి గెలిపిస్తారని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. గత రెండు ఎన్నికల సమయంలో కూడా ఇదే జరిగింది. వచ్చిన ప్రతిసారి వికారాబాద్ అనంతగిరి ని టూరిజం హబ్ చేస్తానని, వికారాబాద్ ను అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని హామీ ఇచ్చి వెళ్లడం సాధారణం అయ్యింది. పదేళ్ల తర్వాత వచ్చిన 3వ సారి కూడా మల్లి అదే హామీ ఇస్తే ప్రజలు నమ్ముతారా..? ఒక్కసారి ఆలోచించాలి. ఈసారి వికారాబాద్ ప్రజలు పాత అబద్దాలు నమ్మేలా లేరని గ్రహించిన కేసీఆర్, ఎస్సీ నియోజకవర్గం అయిన వికారాబాద్ లో దళితులు ఎక్కువగా ఉన్నారనే ఉద్దేశంతో ఒకే విడతలో నియోజకవర్గంలోని ప్రతి దళితుడికి దళిత బంధు అని బూటకపు అబద్దం చెప్పి వెళ్లారు.

ఒకే విడతలో దళిత బంధు అసాధ్యం, తెలంగాణాలో 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ కు ఇది ఎలా సాధ్యం అవుతుంది. పైగా పైలెట్ ప్రాజెక్టు అంటే ఒకేచోట ప్రారంభిస్తారు. ఇప్పటికే హుజురాబాద్ లో పైలెట్ ప్రాజెక్ట్ అని చెప్పి దళిత బంధు ప్రారంభించారు. ఇప్పుడు కేవలం విడతల వారీగా అన్ని నియోజకవర్గాలకు సమానంగా దళిత బందు ఇవ్వాలి కానీ ఒకసారి ఇవ్వడం కుదరదు. ఈ విషయం వికారాబాద్ దళిత సోదరులకు తెలియదని కేసీఆర్ మరోసారి మోసం చేయాలని చూస్తున్నాడు కానీ ఇక్కడి ప్రజలు మోసపోయే పరిస్థితిలో లేరని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.

2 ఎకరాల నుంచి 300 ఎకరాలకు ఎమ్మెల్యే ఆనంద్ ఎలా ఎదిగారు..?

కేవలం 2 ఎకరాల ప్రభుత్వ భూమి మాత్రమే ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ నేడు 300 ఎకరాల భూములు ఎలా సంపాదించాడో ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే అని రోజునుండి దోచుకోవడం దాచుకోవడం తప్ప అభివృద్ధి వైపు తొంగి చూడలేదని విమర్శించారు. ఎమ్మెల్యే ఆనంద్ ఎక్కడ చూసిన ఓట్లు విలువచేసే ప్లాట్ లు, భూములు సంపాదించుకున్నాడన్నారు. ఇలాంటి వ్యక్తిని మళ్లీ గెలిపిస్తే వికారాబాద్ మొత్తాన్ని అమ్ముకుంటాడని, కాబట్టి ప్రజలు బాగా అలోచించి మీకు ఎప్పుడు అండగా ఉండే కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ల పల్లి మంజుల రమేష్, పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, నాయకులు విశ్వనాథం సత్యనారాయణ, హసీబ్, పల్లవి శివానందం, మల్లేష్, రామేశ్వర్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story

Most Viewed