మల్లప్ప గుట్ట పైకి పోటెత్తిన జనం..

by Disha Web Desk 20 |
మల్లప్ప గుట్ట పైకి పోటెత్తిన జనం..
X

దిశ, తలకొండపల్లి : శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులందరూ శైవక్షేత్రాలకు వెళ్లి దర్శనం చేసుకోవడం చూస్తుంటాం. కానీ రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండలానికి చెందిన మల్లప్పగుట్ట పై వెలసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనానికి తరలివచ్చిన జనాన్ని చూసి ఆలయ నిర్వాహకులు, పోలీసులు సైతం కంగుతున్నారు. గతంలో ఎన్నడూ ఊహించని రీతిలో ఇంత పెద్ద మొత్తంలో జనాలు రావడం ఇదే మొదటిసారి అని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఎత్తయిన గుట్టలపై వెలసిన ఆ మల్లన్న దర్శనానికి గతంలో కాలినడకన మాత్రమే గుట్టపైకి చేరుకుంటే శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని వార్ల దర్శన భాగ్యం కలిగేది.

గత సంవత్సరం సుమారు కిలోమీటర్ మేర గుట్టపైకి చేరుకోవడానికి రెండు వైపుల నుండి 75 లక్షల రూపాయలతో సీసీ రహదారిని గుట్టపైకి నిర్మించడంతో మోటార్ సైకిల్స్, వాహనాలు కూడా గుట్టపైకి నేరుగా చేరుకునే విధంగా వెసులుబాటు కల్పించారు. హైదరాబాదు నల్లగొండ జిల్లాల నుండి వచ్చే భక్తుల కోసం హైదరాబాదు నుండి శ్రీశైలం వెళ్లే రహదారి మధ్యలో కర్కల్పాడ్ గ్రామం నుండి ఒక రహదారి, షాద్నగర్, జడ్చర్ల, మిడ్జిల్, తలకొండపల్లి నుండి వచ్చే భక్తుల కోసం మామిడి తోట క్రింద భాగం నుండి పైకి చేరుకునే విధంగా సీసీ రహదారులను ఏర్పాటు చేశారు.

ఘనంగా కడువ మహోత్సవం..

బ్రహ్మోత్సవాల సందర్భంగా మల్లికార్జున స్వామి గుట్టపైకి ప్రతిసంవత్సరం కల్యాణోత్సవం మరుసటి రోజు యాదవ సోదరులు చుక్కాపూర్, చెన్నారం, ఎడవల్లి, విటాయిపల్లి, మంగళపల్లి, ఆమనగల్లు ప్రాంతాల నుండి భక్తిశ్రద్ధలతో కడువను గుట్టపైకి తీసుకురావడం ఆనవాయితీగా కొనసాగుతుంది. చుక్కాపూర్ గ్రామం నుండి యాదవ సోదరులు పోతురాజుల విన్యాసాలతో చూడముచ్చటగా భారీఎత్తున ఊరేగింపుతో గుట్టపైకి కడవను తీసుకెళ్లారు. చెన్నారం గ్రామసమీపంలో కడవను గుట్టపైకి తీసుకెళుతున్న సందర్భంగా శనివారం రాత్రి జాతీయ బీసీకమిషన్ సభ్యులు ఆచారి అక్కడికి చేరుకొని కడవ తీసుకెళ్లే భక్తులకు అభివాదం తెలిపారు. రానున్న రోజుల్లో మల్లప్ప గుట్ట రంగారెడ్డి జిల్లాలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుందని ఆచారి ఆశాభావం వ్యక్తం చేశారు.

గుట్టపైకి వాహనాలను అనుమతించని పోలీసులు

ఆదివారం ఉదయం 9 గంటల ప్రాంతంలోనే జనం ఒక్కసారిగా గుట్ట పైకి బార్లు తీరడంతో జనసమూహాన్ని గమనించిన పోలీసులు ఎస్సై వెంకటేష్ వాహనాలను గుట్టపైకి వెళ్లకుండా నిరాకరించారు. కేవలం వీఐపీలకు మాత్రమే గుట్ట పైకి చేరుకునే విధంగా అనుమతులను మంజూరు చేశారు.

కిలోమీటర్ మేరా వాహనాలతో ట్రాఫిక్ జామ్

గుట్ట పరిసర ప్రాంతాలలో కారు నిలపడానికి కూడా కనీసం జాగా లేకపోవడంతో వాహన చోదకులు ఎక్కడపడితే అక్కడ వాహనాలను ఆపినడుచుకుంటూ గుట్ట పైకి వెళ్లి దర్శనం చేసుకున్నారు. ఒకసారిగా ఆ భక్తులు గుట్ట పైకి పోతెత్తడంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. సుమారు కిలోమీటర్ మేరా మూడు గంటల పాటు ట్రాఫిక్ జామ్ కావడంతో, ట్రాఫిక్ ను క్లియర్ చేయడం పోలీసులకు కత్తి మీద సాముల మారింది. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి సరిపడా ఇబ్బంది లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనీసం అక్కడక్కడ పోలీసులు ఉన్నా కూడా వారిని ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ఎస్సై ఫోన్ చేస్తే ఫోన్ కూడా సిగ్నల్స్ కరెక్టుగా రాకపోవడంతో పక్క పోలీసులకు సమాచారం ఇవ్వడానికి నాన్న ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

గుట్ట కింది భాగంలో రైతులు చాలామంది వేరుశెనగ,పల్లి పంటలను సాగు చేయడంతో వాహనాలు నిలపడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఇటీవల గుట్టపైన నిర్వాహకులు సుమారు పది లక్షల రూపాయలతో రెండు ఎకరాల మేర వాహనాలు నిలపడానికి దేవాలయం ముందు భాగంలో గుట్టలను, రాళ్లను తొలగించి చదును చేసిన గుట్టపైకి తండోపతండాలుగా తరలివచ్చే భక్తులకు నిలుచుండడానికె స్థలము లేకుండా ఇసుకేస్తే రాలనంత జనాలు గుట్ట పైకి చేరుకున్నారు.

అన్నదానం పరబ్రహ్మ స్వరూపం

చెన్నారం గ్రామానికి సమీపంలో వెలిసిన మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ఆదివారం చుక్కాపూర్ గ్రామానికి చెందిన జక్కు శ్యామలమ్మ నారాయణరెడ్డి దంపతులు, వారి కుమారులు సుమారు పదివేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని తలకొండపల్లి మండల పరిషత్ ఉపాధ్యక్షులు మేక శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై అన్నదాన కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. అనంతరం ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఈ దాతలు దేవాలయ ప్రాంగణంలో నీళ్ల దానం చేసేవారు. కానీ ఇటీవల గత 4 సంవత్సరాలుగా మధ్యాహ్నం ఒంటిగంట నుండి సాయంత్రం ఐదు గంటల వరకు దైవ దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమం ఉచితంగా ఏర్పాటు చేయడం ఎంతో శుభ సూచకం అని, అన్నం పరబ్రహ్మ స్వరూపమని ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

ఆ భగవంతుడు వారి కుటుంబానికి ఎల్లవేళలా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని శ్రీనివాస్ రెడ్డి భగవంతున్ని కోరారు. తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ కూడా దారి పొడవునా గుట్టపైకు చేరుకునే భక్తుల సౌకర్యార్థం నీళ్ల దానాన్ని కూడా ఏర్పాటు చేసి భక్తులకు ప్రతిఒక్కరికి దాహార్తిని తీర్చేవిధంగా వాటర్ ప్యాకెట్లను ఉచితంగా అందించారు. గుట్టపైకి చేరుకునే భక్తుల కోసం దాతలు మరికొంతమంది ముందుకు వచ్చి తోచిన సాయం అందించాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చుక్కాపూర్ సర్పంచ్ కిష్టమ్మ, ఉపసర్పంచ్ జక్కు శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ యాదయ్య, సింగిల్ విండో డైరెక్టర్ యాదయ్య గౌడ్, ఆలయ ప్రెసిడెంట్ పాండయ్య, కార్యదర్శి మల్లారెడ్డి, చింతలపల్లి శేఖర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, బుచ్చిరెడ్డి, మల్లయ్య నాయక్, అశోక్, జగత్ రెడ్డి, తిరుపతి రెడ్డి, వెంకట్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story

Most Viewed