ప్రమాదకరంగా మారుతున్న సెల్లార్ల నిర్మాణం

by Disha Web Desk 20 |
ప్రమాదకరంగా మారుతున్న సెల్లార్ల నిర్మాణం
X

దిశ, బడంగ్​పేట్​ : సెల్లార్ల తవ్వకాలపై జీహెచ్​ఎంసీలో ఇప్పటికే నిషేధం విధించిన విషయం విధితమే. అయితే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్​పేట్​ మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలో అనుమతులు లేకుండా నిర్మాణాలు, నిబంధనలకు విరుద్దంగా సెల్లార్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించే వారిపై నోటీసులు జారీ చేయడమే కాకుండా క్రిమినల్​ కేసులు నమోదు చేస్తామని ఉన్నతాధికారులు జారీ చేసిన హెచ్చరికలను బేఖాతరు చేస్తున్నారు. అధికారుల నిఘాలోపం, అవినీతి, పర్యవేక్షణ లేమి కారణంగా అక్రమ సెల్లార్ల నిర్మాణాలు పెట్రేగిపోతున్నాయి.

కింది స్థాయి సిబ్బందే ముడుపులు తీసుకొని అక్రమంగా సెల్లార్​ల నిర్మాణాలు చేపడుతున్నా చూసీచూడనట్లు వ్యవహరిస్తునట్లు సర్వత్రా విమర్షలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలో రెండు అంతకుమించి అంతస్థుల నిర్మాణాలు చేపడుతున్న సమయంలో సెల్లార్​ నిర్మాణం కోసం మున్సిపల్​ అనుమతులు విధిగా తీసుకోవాలి. సెల్లార్​ నిర్మాణం చేపట్టాలంటే గృహనిర్మాణాలయితే 900 గజాల స్థలం, కమర్షియల్​గా ఐతే 500 గజాల స్థలం తప్పనిసరిగా ఉండాలి. అదికూడా స్థలం మట్టిని పరిశీలించి రిపోర్ట్స్​, అగ్నిమాపక అనుమతులు, భవన నిర్మాణం అయిన తర్వాత ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే ఆ భవనం చుట్టూర అగ్నిమాపక వాహనం తిరిగే విధంగా ఉండాలి.

అంతే కాకుండా ప్రధాన రహదారి, రహదారి గుండా నూతనంగా నిర్మించే నిర్మాణాల్లో కమర్షియల్ అయితే 10 ఫీట్లు, గృహ నిర్మాణాలు అయితే 5 ఫీట్లు సెట్​ బ్యాక్​ పద్దతిలో నిర్మించుకోవాలి. సెల్లార్​ తవ్వి వదిలేసిన ప్రాంతాలలో పరిసరాల్లోని నిర్మాణాలు పటిష్ఠంగా ఉన్నదీ, లేనిదీ పరిశీలించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతో పాటు సెల్లార్​ గుంతను నిర్మాణ వ్యర్థాలతో నింపేయాలి.

అయితే ఈ నిబంధనలు మాకు వర్తించవు అన్నట్టుగా బడంగ్​పేట్​ మున్సిపల్​ కార్పొరేషన్​ కార్యాలయం పక్కనే ఉన్న ప్రధాన రహదారిలో 60 నుంచి 200 గజాల స్థలాలలో కూడా నిబంధనలకు విరుద్దంగా కమర్షియల్​ కాంప్లెక్స్​లలో యధేచ్చగా సెల్లార్​ నిర్మాణాలు చేపడుతున్నారు. గత టీపీఎస్​ అధికారికి ముడుపులు సమర్పించి తక్కవ స్థలంలోనే సెల్లార్ల నిర్మాణం జరుపుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల కంటితుడుపు చర్యలవల్ల కొన్ని వందల సంఖ్యలో తక్కువ స్థలంలో నిబంధనలకు విరుద్దంగా సెల్లార్ల నిర్మాణాలు పెట్రేగిపోతున్నాయి.

రోమా ఎన్​క్లేవ్​లో మునిగిన సెల్లార్​.. ప్రమాదకరంగా భవనం

బడంగ్​పేట్​ కార్పొరేషన్​ పరిధిలోని రోమా ఎన్​క్లేవ్​లో నూతనంగా నిర్మిస్తున్న ఓ భవనంలో సెల్లార్​ను నిర్మించారు. బావి ఉన్న ప్రదేశంలో ఆ భవనం నిర్మించడం కారణంగా ఆ సెల్లార్​ నిండా నీటితో మునిగిపోయిందని స్థానికులు అప్పట్లో అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు పట్టించుకోలేదన్న విమర్షలు వెల్లువెత్తుతున్నాయి. వర్షాకాలం ముగిసేంత వరకు సెల్లార్ల తవ్వకాలు చేపట్టరాదని నిబంధనలు ఉన్నప్పటికీ దర్జాగా సెల్లార్ల నిర్మాణాలు చేపడుతున్నారు.

ఇప్పటికే సెల్లార్లు తవ్వి పనులు పురోగతిలో ఉన్నవారు తగిన భద్రతా చర్యలు తీసుకోవాల్సి ఉంది. అలాంటి చర్యలు ఏమీ తీసుకోకుండానే పనులు కొనసాగిస్తుండడం విశేషం. ఆ భవన నిర్మాణ యజమాని మాత్రం బావిలో సెల్లార్​ నిర్మించలేదని, మరి సెల్లార్​లో నీళ్ళు ఎక్కడివని ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పక పోవడం గమనార్హం. ఇప్పటికయినా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నిబంధనలకు విరుద్దంగా చేపడుతున్న అక్రమ సెల్లార్ల నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


Next Story