ఆ ఊరును చులకనగా చూస్తున్న పాలకులు... ఎందుకు?

by Dishanational1 |
ఆ ఊరును చులకనగా చూస్తున్న పాలకులు... ఎందుకు?
X

దిశ, తాండూరు రూరల్: మారుమూల గ్రామాలు సైతం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఆ గ్రామ పంచాయతీ సమస్యల కోరల్లో చిక్కుకుని అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. తాండూరు పట్టణానికి 18 కిలోమీటర్ల దూరం ఉంది. మండలంలోని ఉద్ధాండాపూర్ పంచాయతీలో సుమారు 1,400 మందికి పైగా జనాభా ఉంది. కనీసం సీసీ రోడ్లు, డ్రైనేజీ, వీధిలైట్లు సమస్యలు వంటివి కోకొల్లలుగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గ్రామం అభివృద్ధి చెందుతాయని ఆశించిన ఆశ నిరాశగానే మిగిలి ఉంది. నాలుగేళ్లలో పాలకులకు ఒక్క రూపాయి నిధులు కూడా ఈ గ్రామానికి మంజూరు కాకపోవడంతోనే అభివృద్ధికి నోచుకోలేదు. కొద్దిపాటి వర్షమొచ్చినా బురదమయై అంతర్గత రోడ్లపై నీరు ప్రవహించడంతో చిన్నపాటి కుంటలను తలపిస్తున్నాయి. మట్టిరోడ్లు కావడంతో వీధులు అధ్వానంగా తయారయ్యాయి. కనీసం మురుగుకాల్వలు కూడా లేకపోవడంతో ఇండ్లలోనే నీరంతా రోడ్లపైకి వస్తుంది.


గుంతల్లో నీరు చేరడం వల్ల దోమలు వృద్ధి చెందుతున్నాయి. వీధుల్లో పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తే పట్టించుకున్న పాపాన పోవడంలేదు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి గ్రామంలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. 4 ఏళ్ల నుండి చిల్లీ గవ్వ లేదు. ఏమాత్రం నిధులు మంజూరు కాకపోవడంతో అభివద్ధి పనులకు వెనకడుగు వేస్తున్నారు. పంచాయతీ ఖాతాలో రూ. 75 వేయి ఉన్న నిధులతో కరెంటు బిల్లులు చెల్లించేందుకు, కార్మికులకు వేదాలు, ట్రాక్టర్ మెంటనేస్, ఇతర అవసరాలకు వినియోగించుకున్నారు. పంచాయతీలో ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. ఎంపీ, జడ్పీ చైర్ పర్సన్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎన్ఆర్ఈజీఎస్ ల నుంచి నాలుగేళ్లలో చిల్లీ గవ్వ నిధులు రాలేదు. సర్పంచిగా ఎన్నికైన నుండి పనులు కూడా చేపట్టారు. నిధులపై మాట్లాడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్లు భావిస్తారని సర్పంచ్ మౌనంగా ఉంటున్నారు. మంచినీటి పథకాలకు సంబంధించి మోటార్ల రిపేరు వంటి పనులు చేపట్టి బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో ప్రస్తుతం ఎలాంటి అభివద్ధి పనులు జరగడం లేదు. సర్పంచ్ నిధులు లేక ఖాళీగా ఉన్నారు.

ఓట్ల కోసం కిలో మీటర్ల దూరం కాలి నడకన, వాగులు వంకలు దాటి వెళ్లి మారుమూల ప్రాంతాల గ్రామాల ప్రజలను ఓట్లు అడిగే నేతలు అదే గ్రామ ప్రజలకు సమస్యలు వస్తే మాత్రం కనీసం పట్టించుకోవడం లేదు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, జిల్లా జడ్పీ చైర్ పర్సన్ సునీతా రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి ల ఎన్ఆర్ఈజీఎస్ నుంచి కూడా చిల్లీ గవ్వ నిధులను మంజూరు చేయకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధికి నిదర్శనమని గొప్పలు చెప్పుకుని పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు.

సీసీ రోడ్లు నిర్మించాలి: నర్సింలు, ఉద్ధాండాపూర్ గ్రామం

గ్రామంలో అంతర్గ రోడ్లు, డ్రైనేజీ లేకపోవడంతో పారిశుద్ధ్యం లోపిస్తుంది. వర్షాకాలంలో ఇంటి నుంచి కాలు బయటపెట్టలేకపోతున్నా. చాలా ఇబ్బందిగా మారింది. ఎన్నికల సమయంలో గ్రామానికి వచ్చిన నాయకులు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీలిచ్చారు. ఇప్పటివరకు ఒక రోడ్డు గానీ డ్రైనేజీ గానీ నిర్మించలేదు.

పార్టీని న‌మ్ముకుంటే అప్పుల పాలు చేశారు: కౌసల్య ఉద్దాండాపూర్ సర్పంచ్

సొంత పార్టీ పాలకుల నుంచే చేదు అనుభవం ఎదురైంది. డ్రైనేజీ నిర్మాణ ప‌నుల‌ను సొంత ఖ‌ర్చుల‌తో చేస్తే తమకు ఇప్పటిదాకా సరైన బిల్లులే మంజూరు కాలేద‌ని, పార్టీని న‌మ్ముకుని తాము అప్పుల్లో కూరుకుపోయామ‌ని తీవ్ర ఆవేద‌న వ్యక్తం చేశారు. నిధులపై మాట్లాడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్లు భావిస్తారని మౌనంగా ఉన్నామంటున్నారు.


Next Story

Most Viewed