గుంటల్లో రిజిస్ట్రేషన్.. గజాల్లో అమ్మకం

by Disha Web Desk 9 |
గుంటల్లో రిజిస్ట్రేషన్.. గజాల్లో అమ్మకం
X

దిశ, రంగారెడ్డి బ్యూరో, చేవెళ్ల: తెలంగాణ రాష్ట్రంలో అధికారులు, రియల్​ వ్యాపారులు ఒక్కటై రెవెన్యూ నిబంధనలకు పాతరేస్తున్నారు. జేబులు నిండితే ఏ పనైనా చేసేందుకు మేము సిద్దమన్నట్లు అటు అధికారులు వ్యవహారించడం.. అదును చూసి రియల్​ వ్యాపారులకు కావాల్సిన పనిచేసుకుంటున్నారు. అదే పద్ధతిని రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలంలో సాగుతున్న తంతు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.

పచ్చటి పొలాల్లో రియల్​ వ్యాపారులు చిచ్చుపెడుతున్నారు. చేవెళ్ల నుంచి వికారాబాద్​కు వెళ్లే దారికి ఇరువైపులా చూసే భూముల్లో అడ్డగోలుగా కోనుగోలు చేయడం ఫ్రీకాస్ట్​ సిమెంట్​ పలుకలతో ప్రహరీ అమర్చుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ ప్రక్షాళన కోసం తీసుకొచ్చిన ధరణితో పేదవాడికి కష్టాలు ఎదురయ్యాయి. అవసరం కోసం రియల్​ వ్యాపారులకు భూములు విక్రయిస్తున్నారు. అదే రియల్​ వ్యాపారులు గుంటల్లో భూము లను రిజిస్ట్రేషన్ చేసి గజాల్లో ధరను ఖరారు చేసి అమ్ముతున్నారు. ఈ వ్యవహారం రెవెన్యూ చట్టానికి విరుద్ధంగా క్రయ విక్రయాలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. 

ఎన్ని గుంటలైనా రిజిస్ట్రేషన్​ చెయొచ్చా..?

ధరణి వస్తే పేద రైతుల బతుకుల్లో మార్పు వస్తుందని భావిస్తే భూమికే ఎసరు వస్తుందని పసిగట్టలేకపోయారు. ఇప్పటి వరకు ఎలాంటి భూవివాదాలు లేని భూములు కూడా వివాదంగా మార్చిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుంది. ఎలాంటి సమస్యలనే భూములను నిషేధిత జాబితాలో చేర్చి రైతులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. నిషేధిత జాబితా పేరుతో జిల్లాలోని వేల ఎకరాల భూమిని అప్పన్నంగా అధికార పార్టీలోని పెద్దలకు కట్టబెట్టడం జరిగిందనే ప్రచారం లేకపోలేదు. కబ్జాలోనున్న రైతులకు కూడా పాస్‌బుక్ ఇచ్చేందుకు ఆంక్షలు పెడుతున్నారు.

అదే భూమిని తక్కువ ధరలకు కొనుగోలు చేసి వెంచర్లు చేయడం, లేఅవుట్లు చేసి విక్రయాలు జరుపుతున్నారు. ఇష్టానుసారంగా భూ క్రయ విక్రయాలు జరుగుతుండడంతో సామాన్యుడికి రెవెన్యూ వ్యవస్థపై ఆందోళన కలుగుతుంది. అంతేకాకుండా రియల్​ వ్యాపారులు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు వచ్చేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు పోతున్నారు. ఎకరాల్లో భూములను కొనుగోలు చేసి గజాల్లో లెక్కలు వేసుకొని గుంటల్లో అమ్మకాలు జరుపుతున్నారు. దీంతో సామాన్య రైతు తీవ్ర నష్టానికి గురవుతున్నారు. వ్యవసాయ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేయాలన్నా ముందుగా నాలాగా కన్వర్షన్​ చేయాలి.

కానీ ఆ డబ్బులు కట్టడంతో అధిక డబ్బుల అవుతాయనే దురుద్దేశ్యంతో గుంటల్లో భూమిని అమ్ముతున్నారు. రెవెన్యూ అధికారులు కూడా కాసులకు కక్కుర్తి పడి ఎన్ని గుంటల భూమినైనా రిజిస్ట్రేషన్​ చేయాడానికి సిద్ధపడుతున్నారు. రిజిస్ట్రేషన్​ చేయాలంటే తక్కువలో తక్కువ 5 గుంటల భూమి కంటే తక్కువ ఉండొద్దనే నిబంధన అక్కడక్కడ మౌఖిక ఆదేశాల ప్రకారం నడిపిస్తున్నారు. కానీ రెవెన్యూ నిబంధనల ప్రకారం ఇన్ని గుంటల వరకే రిజిస్ట్రేషన్​ చేయాలని ఎక్కడా లేదు. దీంతో రెవెన్యూ యాక్ట్ లేదనే అభిప్రాయంతో కొంత మంది తహశీల్దార్లు ఎన్ని గుంటల భూమినైనా రిజిస్ట్రేషన్​ చేస్తున్నారు.

ప్రహరీకి పర్మిషన్​ ఉందా..?

చేవెళ్ల మండలంలోని ఇబ్రహీంపల్లి, దామేరగిద్ద, మీర్జాగూడ, ఖానాపూర్​, అలూర్​, కౌకుంట్ల, ఆంతారం గ్రామాల్లోని భూము లల్లో ఫ్రీకాస్ట్​ సిమెంట్​ పలుకలతో ప్రహారీ గోడలు నిర్మిస్తున్నారు. సాగు చేసుకునే భూముల్లో ఇష్టానుసారంగా ప్రహారీ గోడలు నిర్మించుకునే అనుమతులు ఎవరు ఇస్తున్నారో అర్ధం కావడంలేదు. చేవెళ్ల మండలం కేంద్రం నుంచి వికారాబాద్​ వైపు వెళ్లే రోడ్డుకు ఇరువైపుల గుంటల్లో భూములను కోనుగోలు చేసుకోని హద్దులు పెడుతున్నారు. సహాజవనరులను నాశనం చేసే అధికారం ఎవరికి ఉందనే ప్రశ్నలు వస్తునన్నాయి.

సహజ వనరులను కాపాడేదెవరు..?

జిల్లాలోని సాగు భూములన్నీ రియల్​ వ్యాపారుల చేతిలో బంధీయై సహజ వనరులన్నీ దెబ్బతీస్తున్నారు. వీటిపై ప్రశ్నించే సామాన్యులను లెక్కచేయలేకపోతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేస్తే రియల్​ వ్యాపారితో కుమ్మక్కై బేరాలు నడిపిస్తున్నారనే ప్రచారం ఉంది. దీంతో సాగుకు యోగమైన భూములను విధ్వంసం చేసే హక్కు ఎవరికి లేదు. ఒక వేళ నిర్మాణాలు చేయాల్సి వస్తే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వెళ్లాల్సి ఉంటుంది. దాంతో అటు ప్రభుత్వానికి, ఇటు సహాజవనరులకు ఇబ్బంది ఉండదనే అభిప్రాయం కలుగుతుంది. ఇష్టానుసారంగా నిబంధనలు పరిశీలించకుండానే అధికారులు కూర్చిల్లో కూర్చోని పనులు కానిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

కేజ్రీవాల్‌కు సీబీఐ నోటీసులు.. ఎమ్మెల్సీ కవిత బిజినెస్ లింకులపై ఫోకస్



Next Story