మంచాల మండలంలో రసవత్తరంగా మారిన రాజకీయం..

by Disha Web Desk 20 |
మంచాల మండలంలో రసవత్తరంగా మారిన రాజకీయం..
X

దిశ, యాచారం : మంచాల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్‌) చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు పీఏసీఎస్ పాలక వర్గం సభ్యులు సోమవారం జిల్లా కో-ఆపరేటివ్ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. దీంతో మంచాల మండలంలో రాజకీయం రసవత్తరంగా మారింది. మంచాల పీఏసీఎస్‌ పరిధిలో మొత్తం 13 మంది డైరెక్టర్ లు ఉండగా 8 మంది చైర్మన్ బుస్సు పుల్లారెడ్డి, వైస్ చైర్మన్ బోద్రమోని యాదయ్యకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేసి అవిశ్వాసం కోసం నోటీసులు అందజేశారు.

చైర్మన్, వైస్ చైర్మన్ పదవి నుంచి తప్పించాలని కొంతమంది డైరెక్టర్ లు ఏకమై సంతకాల సేకరణతో అవిశ్వాస తీర్మాణానికి తెరలేపారు. ఐదేళ్ల పదవి పూర్తి గడువుకు ముందే నువ్వా, నేనా అన్నట్లుగా సొసైటీలో పోరు కొనసాగుతోంది. డైరెక్టర్లు ప్రతిపాదనలో తెలిపిన వివరాల్లోకి వెళితే పీఏసీఎస్ చైర్మన్ బుస్సు పుల్లారెడ్డి సహకారం సంఘం నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపణలు చేశారు. పాలక వర్గ తీర్మాణాలకు వ్యతిరేఖంగా తీసుకొంటున్న నిర్ణయాలు, ధాన్యం సేకరణలో అవకతవకలు చేశారని ఆయనపై విమర్శలు గుప్పమన్నాయని వివరించారు.

వీటికి తోడు చైర్మన్ అవీనీతికి సహకరిస్తూ సంఘం పరువు ప్రతిష్టలు కోల్పొవడానికి సహకరిస్తున్నందుకు వైస్ చైర్మన్ పై కూడా అవిశ్వాసం పెడుతున్నామని డైరెక్టర్ లు జిల్లా సహకార సంఘం శాఖ అధికారికి ఇచ్చిన వినతిపత్రంలో తెలిపారు. విశ్వాసం కోల్పొయినందున చైర్మన్, వైస్ చైర్మన్ పదవి నుండి తొలగించుటకు తీర్మాణం ప్రతిపాదిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ లు అరుణమ్మ, వింజమూరి రాంచంద్రారెడ్డి, జెనిగే వెంకటేష్, వెదిరె హన్మంత్ రెడ్డి, కొంగర జనార్ధన్ రెడ్డి, వేణుగోపాల్ రావు, రమేష్, మణెమ్మ పాల్గొన్నారు.



Next Story