నష్టం కోట్లలో... బిస్కెట్ కంపెనీలో అగ్ని ప్రమాద ఘటనలో భారీ నష్టం

by Disha Web Desk 15 |
నష్టం కోట్లలో... బిస్కెట్ కంపెనీలో అగ్ని ప్రమాద ఘటనలో భారీ నష్టం
X

దిశ, రాజేంద్రనగర్ : అగ్ని ప్రమాద ఘటనలో భారీ నష్టం జరిగింది. కాటేదాన్లోని పారిశ్రామిక వాడలోని పహల్ బిస్కెట్ కంపెనీలో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. ఫైర్ సిబ్బంది 15 ఫైరింజన్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నా సాయంత్రం వరకు పూర్తిగా అదుపులోకి రాలేదు. భారీ అగ్గిప్రమాదం జరగడంతో నష్టం కోట్లలో జరిగి ఉంటుందని నిర్వాహకులు, పోలీసులు, అధికారులు అంచనా వేస్తున్నారు. రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్, ఏసీపీ టి.శ్రీనివాస్ ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.

ప్రమాదం జరిగినప్పుడు కంపెనీలో కూలీలు లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని డీసీపీ శ్రీనివాస్ స్పష్టం చేశారు. షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం సంభవించి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేశారు. కంపెనీలోని బిస్కెట్ తయారీకి వినియోగించే ముడి పదార్థాలు, అట్టలు, అదే విధంగా భారీ మిషనరీ అగ్నికి ఆహుతైందని పోలీసులు, అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోట్లలో నష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. బిస్కెట్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరగడంతో మంటలు వ్యాపిస్తాయేమోనని చుట్టుపక్కల కంపెనీల నిర్వాహకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.


Next Story

Most Viewed