మహిళలు శక్తివంతంగా ఎదగాలి: గవర్నర్ తమిళిసై

by Dishanational1 |
మహిళలు శక్తివంతంగా ఎదగాలి: గవర్నర్ తమిళిసై
X

దిశ, శంకర్ పల్లి: మహిళా సాధికారికతతోనే దేశాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై తెలిపారు. దొంతాన్ పల్లిలోని ఇక్ఫాయి కళాశాలలో రెండు రోజులపాటు జరిగే మహిళా ఐక్యత : సంఘర్షణలు- సంక్లిష్టతలు అనే సెమినార్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆమె శనివారం హాజరయ్యారు. కళాశాల యాజమాన్యం ఆమెను సాదరంగా ఆహ్వానించి బోకే అందజేసి పూలమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థులను ఉద్దేశించి కీలకోపాన్యాసం చేశారు. సమాజంలో మహిళలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారని, వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని సూచించారు.

ఒకప్పుడు ఇంటికే పరిమితమైన మహిళ, నేడు తనకు ఎదురేలేదని నిరూపిస్తున్నదని గుర్తుచేశారు. మహిళలకు అన్ని రంగాలలో పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాలను, అవకాశాలను కల్పించినప్పుడు వారు ఎంతో ఉన్నతంగా ఎదుగుతారని తెలియజేశారు. మహిళలు అవకాశాలను అందిపుచ్చుకుని విజయాలను సాధించాలని స్పష్టం చేశారు. తాము ఎవరికీ తక్కువ కాదనే మనోధైర్యంతో అవకాశాలను అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు. మానసికంగా కృంగిపోకుండా అపజయాలను విజయాలుగా మలుచుకోవాలని సూచించారు. ఆపద వచ్చినప్పుడు ఆత్మహత్యలు చేసుకోరాదని, ధైర్యంతో మరింత శక్తివంతంగా తయారవ్వాలని తెలిపారు. మహిళలు ఐక్యమత్యంగా ఉంటూ ఒకరికొకరు తోడ్పాటు అందించుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు డెలినా కాంగ్డప్ కళాశాల వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్, డాక్టర్ ఎల్. ఎస్. గణేష్, డైరెక్టర్ ప్రొఫెసర్, ఏవీ నరసింహారావు, లా స్కూల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కేఎస్. రేఖ రాజ్ జైన్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed