ఎలక్షన్లప్పుడే మేమున్నాం అంటూ బరిలో.. ఆ తర్వత గాయాబ్?

by Dishanational2 |
ఎలక్షన్లప్పుడే  మేమున్నాం అంటూ బరిలో.. ఆ తర్వత  గాయాబ్?
X

దిశ, మియాపూర్: రాష్ట్రంలో శేరిలింగంపల్లి నియోజక వర్గానిది ఒక ప్రత్యేక స్థానం. ఐటీకి కేంద్ర బిందువుగా ఉండి ప్రపంచ మేటి బహుళ జాతి సంస్థలు కొలువుదీరిన ప్రాంతంగా గుర్తింపు ఉన్నది. ఇక్కడ అన్ని రాష్ట్రాల వారు జీవనం సాగిస్తుండడంతో ఒక మినీ ఇండియా గా అత్యధిక ఓటర్లు ఉన్న ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నట్లు పోటీ చేసే అభ్యర్థుల విషయంలోను అనేక సారుప్యతలు ఉన్నాయి. గతంలో ఇక్కడినుంచి పోటీ చేసి తెరమరుగై మళ్ళీ ఈసారి కూడా మళ్ళీ దిగేందుకు ఉవ్విళ్లరుతున్న వారి గురించి ఒకసారి అవలోకనం చేసుకోవచ్చు. గత ఎలక్షన్ లో ప్రధాన పార్టీ అభ్యర్గి ఒకరు పెద్ద వ్యాపార వేత్త కేవలం ఎలక్షన్ ల ముందు రంగంలోకి దిగి గట్టి పోటీ ఇచ్చిన విషయం విదితమే. ఎలక్షన్ ల అనంతరం ఎక్కడా పార్టీ కార్యక్రమాలలో పాలుపంచుకోకపోగా పూర్తిగా తెరమరుగు కావడం కొసమెరుపు. పోయిన ఎలక్షన్లలో కనిపించిన పాత ముఖాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మళ్ళీ వస్తున్నట్లు ఊహాగానాలు దండిగా వినిపిస్తున్నాయి. ఇలా ఉన్నట్టుండి నేనున్నా అని బరిలో దిగితే కొన్నెండ్లుగా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తున్న వారి పరిస్థితి ఏమిటోనని కార్యకర్తలు అనుకుంటున్నారు. అయితే ఇలా చుట్టపు చూపుగా వచ్చిన వారిని అప్పటికప్పుడు అందలం ఎక్కిస్తే మిగతావారు పూర్తిగా సహకరిస్తారా లేదా అనేది శేష ప్రశ్నే..

అయారాం.. గయారాం..

కొంతమంది ఎలక్షన్లప్పుడే అయారామ్ గయారాంలాగా ఎక్కడినుంచో మెరుపు తీగలాగవచ్చి ఆ తర్వాత కనుమరుగు అవుతున్నారు. గత ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం 2018 శాసన సభ ఎన్నికల్లో కొంతమంది ఇలాగే తెరపైకి వచ్చి కనుమరుగు అయ్యారు. టీడీపీ నుంచి పోటీ చేసిన భవ్యఆనంద ప్రసాద్ ఇలాగే వచ్చి గట్టిపోటీ ఇచ్చి రెండవ స్థానంతో సరిపెట్టుకున్నారు. అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకరు 3 వేల పైచిలుకు ఓట్లు సాధించాడు. టీడీపీ నుంచి ప్రస్తుత పరిస్థితిలో చెప్పుకోదగ్గ నాయకులు ఎవరు లేకపోవడంతో మరోసారి ఆయనే పోటిచేయనున్నారని ప్రచారం జోరుగా వినిపిస్తున్నది.అయితే మరోపక్క పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు , ఇటీవల బీ ఆర్ ఎస్ పార్టీని వీడిన మాజీ ఎమ్మెల్యే ఒకరు టిడిపి నుంచి టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణలో భాగంగా పాతవారికే ఇస్తారా లేదంటే అదే సామాజిక వర్గానికి చెందిన మరో కొత్త వ్యక్తికి అవకాశం ఇస్తారా అనేది సస్పెన్స్.. ఈసారీ ఎలక్షన్ లలో మరిన్ని కొత్త పార్టీలు వైస్ ఆర్ టి పీ, జనసేన , ఆమ్ఆద్మీ, ఎం ఐ ఎంఎల తరపున మరిన్నీ కొత్త ముఖాలు సైతం తెరపైకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇలా గడిచిన ఐదేళ్లలో నియోజక వర్గంతో అంటి ముట్టనట్లు ఉండి లేదా చివరి క్షణంలో టికెట్ దక్కించుకున్నవారి అవకాశాలు ఎలా ఉండబోతున్నది ఏ మేరకు ఇతరులను ప్రభావితం చేయనున్నారో ప్రధాన పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. . అయితే ఏది ఏమైనా అలాంటి కొత్త ముఖాలను ప్రజలు ఎలా ఆదరిస్తారో వేచి చూడాల్సిందే మరీ. అయితే మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఆయా పార్టీ నుంచి పోటీ చేసే కొత్త ముఖాలు ఈసారి ఎవరి గెలుపును ప్రభావితం చేయనున్నారో వేచి చూడాల్సిందే...

Next Story

Most Viewed