రైతుల భూమిపై డేగ కన్ను.. రెవెన్యూ అధికారులతో కుమ్మక్కైన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ!

by Disha Web Desk 1 |
రైతుల భూమిపై డేగ కన్ను.. రెవెన్యూ అధికారులతో కుమ్మక్కైన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ!
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, ప్రజాప్రతినిధుల దృష్టిలో పడిన విలువైన భూములు మాయం అవుతున్నాయి. రికార్డులను సైతం మార్పించేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తునాయి. అధికారులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, ప్రజాప్రతినిధులతో కుమ్మకై పేద రైతుల భూములను అప్పనంగా నొక్కేస్తున్నారు. భూ బాధితులు నెత్తినోరు కొట్టుకున్నా ఫలితం లేకుండాపోతోంది. ఏళ్ల కొద్ది సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న భూమి కోల్పోతున్నామన్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తప్పడు డాక్యుమెంట్లతో భూమిని కాజేసే కుట్ర..

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధి తుక్కుగూడ రెవెన్యూ పరిధిలో సర్వే నం.777లో 19 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి ఎన్నో ఏళ్లుగా రైతులు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇందులో 10 ఎకరాల భూమిని కొంత మంది రైతులు ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీకి అమ్మారు. ఆ కంపెనీ కొనుగోలు చేసిన భూమి 10 ఎకరాలు.. కానీ, సుమారు 13 ఎకరాల భూమిని కబ్జాలోకి తీసుకుంది. కొనుగోలు చేసిన భూమి కంటే మూడు ఎకరాలు అదనంగా కబ్జా పెట్టింది. దీనికి తోడు గత ప్రభుత్వంలో ఉన్న ప్రజా ప్రతినిధుల అండతో 8 మంది రైతుల పేరు మీద ఉన్న 5.12 గుంటల భూమిని ‘డిలేషన్‌’ పెట్టి అక్కడి నుంచి రైతులను తప్పించేందుకు కుట్రలు చేశారు. దీనికి రెవెన్యూ అధికారులు సైతం చేతులు కలిపి ఉన్నతాధికారులకు తప్పుడు రిపోర్టులు పంపి రైతుల భూములు కొల్లగొట్టేందుకు యత్నం చేశారు. దీనిపై రైతులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు.

రెవెన్యూ అధికారుల అండతోనే..

రైతుల భూములు కాజేసేందుకు చేసిన కుట్రలో భాగంగా స్థానిక రెవెన్యూ అధికారులు చేతులు కలపడంతో తమకు దిక్కుతోచడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతుల భూములు కాపాడాల్సిన రెవెన్యూ అధికారులే రియల్‌ వ్యాపారులు పంచన చేరి రికార్డులు మార్చేందుకు కుట్రలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో రైతులు తమ భూములు కాపాడే నాథుడే లేకుండాపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 19 ఎకరాల భూమిలో 10 ఎకరాలు కొనుగోలు చేయగా.. 9 ఎకరాల భూమి స్థానిక రైతులకు ఉండాల్సి ఉంది. కానీ ఆ భూమిని కూడా కంపెనీ లాక్కోడానికి కుట్రలు చేస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులను రైతులు ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. అయితే సదరు కంపెనీకి రికార్డు ప్రకారం ఉన్న భూమిని సర్వే చేసి మిగతాది రైతులకు ఇవ్వాల్సిన రెవెన్యూ అధికారులు ఆ పని చేయడం లేదు.


Next Story

Most Viewed