అభివృద్ధి సంక్షేమాలే మా నినాదాలు : సబితా ఇంద్రారెడ్డి

by Disha Web Desk 11 |
అభివృద్ధి సంక్షేమాలే మా నినాదాలు : సబితా ఇంద్రారెడ్డి
X

దిశ,మహేశ్వరం: అభివృద్ధి సంక్షేమాలే మా నినాదాలు,విధానాలు అని విద్యాశాఖ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మహేశ్వరం మండలం హర్షగూడ తండాలో గడప గడప ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ... కరోనా వస్తే కనిపించనోళ్ళు ,వరదలు వస్తే ఆదుకోనోళ్లు వస్తున్నారని ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండే వారిని గుర్తుంచుకోవాలన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎన్నికలు రాగానే గ్యాస్, పెట్రోల్ ,డీజిల్ ధరలు తగ్గించి ఎన్నిక ఫలితాలు రాగానే పెంచుతారన్నారు. సీఎం కేసీఆర్ మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు వందలకే గ్యాస్ అందిస్తామన్నారు.

మహిళలకు ప్రతినెల సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా మూడు వేలు అందిస్తామన్నారు. 93 లక్షల తెల్ల రేషన్ కార్డు దారులకు బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో రైతుబంధు పథకం ద్వారా ఇప్పటివరకు 389 కోట్లు, రైతు బీమా ద్వారా 24 కోట్లు, రుణమాఫీ కింద 87 కోట్లు, ఆసరా పెన్షన్లు 576 కోట్లు, కల్యాణలక్ష్మి పథకం కింద 108 కోట్లు, షాది ముబారక్ పథకంతో కింద 51 కోట్లు, సీఎం రిలీఫ్ ఫండ్ కింద 15 కోట్ల సహాయం చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజు నాయక్,తుక్కుగూడ మున్సిపాలిటీ కౌన్సిలర్ రవి నాయక్ ,పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story