Rama Rajyam : వెలుగులోకి వస్తున్న రామరాజ్యం ఆర్మీ వ్యవహారాలు!

by Y. Venkata Narasimha Reddy |

చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధానార్చకుడిపై దాడికి పాల్పడిన రామరాజ్యం ఆర్మీ(Rama Rajyam Army Affairs)కి సంబంధించిన ఆసక్తికర అంశాలు ఒక్కోటి వెలుగులోకి వస్తున్నాయి.

Rama Rajyam : వెలుగులోకి వస్తున్న రామరాజ్యం ఆర్మీ వ్యవహారాలు!
X

దిశ, వెబ్ డెస్క్ : చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధానార్చకుడిపై దాడికి పాల్పడిన రామరాజ్యం ఆర్మీ(Rama Rajyam Army Affairs)కి సంబంధించిన ఆసక్తికర అంశాలు ఒక్కోటి వెలుగులోకి వస్తున్నాయి. రామరాజ్యం ఆర్మీ వ్యవస్థపకుడు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన కొవ్వూరి వీరరాఘవరెడ్డి(Veera Raghava Reddy) తాను ఇక్ష్వాకు వంశీయుడిగా చెప్పుకుంటూ రామరాజ్య స్థాపన ధ్యేయంగా కోసలేంద్ర ట్రస్టు పేరుతో రామరాజ్యం ఆర్మీని ఏర్పాటు చేశారు.

తొలుత 5వేల మందిని తన రామరాజ్యం ప్రైవేటు ఆర్మీలో నియమించుకోవాలని నిర్ణయించుకున్న వీర రాఘవరెడ్డి 20నుంచి 50ఏళ్ల లోపువారిని మాత్రమే రామరాజ్యం ఆర్మీలో తీసుకుంటామని.చెప్పి వారికి నెలకు రూ.20వేల జీతం, వసతి సదుపాయం కల్పిస్తామని ప్రచారం చేశాడు. కనీస విద్యార్హత పదవ తరగతిగా నిర్ణయించాడు. 5కిలోమీటర్లు నడిచే సామర్ధ్యం, రెండు కిలోమీటర్ల పరిగెత్తే సామర్ధం ఉన్న వారిని నియమించుకుంటామని తెలిపాడు. గత ఏడాది సెప్టెంబర్ 1నుంచి డిసెంబర్ వరకు తొలి విడత నియామక ప్రక్రియ కోసం డిసెంబర్ 31వరకు రిజిస్ట్రేషన్లు చేపట్టారు. రామరాజ్యం ఆర్మీ నియామకం కోసం విరాళాలను సైతం సేకరించగా..తెలుగు రాష్ట్రాల నుంచి రూ.1,20,599 విరాళాలు సైతం సంస్థకు అందాయి. ఇప్పటిదాకా 30మంది వరకు తన రామరాజ్యం ఆర్మీలో సభ్యులుగా నియమించుకున్నాడని పోలీసులు విచారణలో గుర్తించారు.

తన ప్రైవేటు సైన్యంతో తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాల్లో వీరరాఘవరెడ్డి అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు. న్యాయశాస్త్రంపై మంచి పట్టున్న వీరరాఘవరెడ్డి రామరాజ్యం పేరుతో తనకు ప్రత్యేక చట్టం ఉందని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటున్నట్లు గుర్తించారు. వీరరాఘవ రెడ్డిపై 2015లోనే హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి చేసారంటూ ఆరోపణలు,కేసులు ఎదుర్కొంటున్న "రామరాజ్యం" వీర రాఘవరెడ్డి గతంలో చేసిన వీడియోలన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

వాటిలో చిన్న జీయర్ స్వామిని కూడా టార్గెట్ చేస్తూ వీరరాఘవ రెడ్డి మాట్లాడిన వీడియో ఇప్పుడు తెరపైకి వచ్చింది. " గోత్రాలను సంకరం చేస్తారా చిన్న జీయర్ "అంటూ వీడియో చేసిన వీర రాఘవ రెడ్డి అతిపెద్ద రామానుజ స్వామి విగ్రహాన్ని తెలంగాణలో ఏర్పాటు చేసిన చిన్న జీయర్ గోత్రాలను కలిపేస్తున్నారనేది "రామరాజ్యం" వీర రాఘవరెడ్డి ఆరోపణ. తన దగ్గరకు వచ్చే వారిని "రామానుజ " గోత్రీకులుగా చిన్న జీయర్ పిలుస్తారని దానివల్ల గోత్రాలన్నీ మారిపోతున్నాయని రాఘవ రెడ్డి వీడియో చేశారు. "మహిపాల" గోత్రానికి చెందిన తాము వివాహాలు చేసుకోవడానికి కొన్ని గ్రోత్రాలు ఉన్నాయని అలాంటిది చిన్న జీయర్ గోత్రాలన్నీ కలిపేస్తే ఎలా " అనేది రాఘవరెడ్డి వాదన. మూడు నెలల క్రితం చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

" రామరాజ్యం "అంటే ఇది కాదు : చిన్న జీయర్

చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి వివాదంపై చిన్న జీయర్ స్వామి కూడా స్పందించారు. రంగరాజన్‌పై జరిగిన దాడి యోగ్య మైన కాదన్నారు. ప్రస్తుతం సమాజంలో దేవాలయాల అర్చకుల పరిస్థితి బాగా లేదన్న ఆయన, వారి ఆర్ధిక పరిస్థితి విద్యా అవకాశాలు లేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయన్నారు. రంగరాజన్ పై జరిగిన దాడి విషయం నాకు తెలిసిందని, హింస ద్వారా రామరాజ్యం స్థాపన అనేది అసాధ్యమన్నారు. సమాజంలో హింసకు తావు లేదన్న ఆయన, తీవ్రవాదంతోను ఉగ్రవాదంతోను సాధించేది ఏమీ లేదన్నారు. కేవలం తాత్కాలిక లాభాలు చేకూరావచ్చు, కానీ అది శాశ్వతం కాదన్నారు. రామరాజ్య స్థాపన రాజ్యాంగబద్ధంగా జరగాలని చిన్నజీయర్ స్వామి ఆకాంక్షించారు. అది ఏ ఒక్కరితో సాధ్యం కాదు. సమాజంలోని ప్రజలందరూ అనుకుంటేనే రామ రాజ్య స్థాపన జరుగుతుందన్నారు. మరోవైపు ఈ దాడిని దేవాలయ, అర్చక వ్యవస్థపై జరిగిన దాడిగా గుర్తించాలన్న వీహెచ్‌పీ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్‌..ఘటనకు పాల్పడ్డ విద్రోహ శక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

Next Story