KCR : పీవీ భారతదేశ ఆణిముత్యం : కేసీఆర్

by Muthe.Rajitha |   (  Updated:2025-06-27 15:52:53  IST  )

భారతరత్న పీవీ నరసింహారావు(PV Narasimha Rao) జయంతి(Birth Anniversary) సందర్భంగా వారి కృషిని బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) స్మరించుకున్నారు.

KCR : పీవీ భారతదేశ ఆణిముత్యం : కేసీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : భారతరత్న పీవీ నరసింహారావు(PV Narasimha Rao) జయంతి(Birth Anniversary) సందర్భంగా వారి కృషిని బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) స్మరించుకున్నారు. బహుభాషాకోవిదుడుగా, సాహితీవేత్తగా, రాజకీయ దురంధరుడు, దేశ ఆర్థిక సంస్కరణలకు పితామహుడిగా పీవీ నరసింహారావు పాత్ర అజరామరమన్నారు. కొద్దికాలమే పనిచేసినా.. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వారు చేసిన సంస్కరణవాద పరిపాలన నేటికీ ఆదర్శనీయమని కొనియాడారు. వారి కృషికి సరియైన గౌరవం దక్కలేదనే బాధను వారి కీర్తిని విశ్వవ్యాప్తం చేయాలనే తెలంగాణ ప్రజాకాంక్షను పరిగణలోకి తీసుకుని ‘పీవిని తెలంగాణ ఠీవి’ గా ప్రపంచానికి చాటిన ఘనత నాటి బిఆర్ఎస్ ప్రభుత్వానిదేనని కేసీఆర్ గుర్తు చేశారు.

పివి శతజయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడమే కాకుండా...భవిష్యత్తు తరాలు వారి కృషినుంచి స్పూర్తి పొందే విధంగా పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు. నెక్లెస్ రోడ్డుకు పీవీ మార్గ్ గా నామకరణం చేయడమే కాకుండా... పీవీ 16 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసామని తెలిపారు. పీవీ జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పీవీ రాజకీయ వారసత్వం కొనసాగింపుగా తన వారసురాలు సురభి వాణీదేవికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిందని తెలిపారు. పీవీకి భారతరత్న కోసం తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి పలుమార్లు కేంద్ర ప్రభుత్వం మీద వత్తిడి తెచ్చామన్నారు.

పీవీ కృషికి గుర్తింపుగా వంగర, లక్నెపల్లి లను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడంతో పాటు, వరంగల్‌, కరీంనగర్‌, వంగర, ఢిల్లీ తెలంగాణా భవన్‌లో పీవీ కాంస్య విగ్రహాలను ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. పీవీ ఘనకీర్తిని స్మరించుకోవడం అంటే తెలంగాణ బిడ్డలు తమ గొప్పతనాన్ని తాము గుర్తు చేసుకోవడమేనని కేసీఆర్ వివరించారు. ఈ దిశగా వారి కీర్తిని చాటుకుంటూ ప్రజా సంక్షేమం దిశగా స్పూర్తివంతమైన పాలనను అందించడం ద్వారామాత్రమే పీవీ నరసింహారావు మనం ఘన నివాళి అర్పించిన వారమౌతామని కేసీఆర్ స్పష్టం చేశారు.

Next Story