రైతులకు పూర్తి స్థాయి రుణమాఫీ చేయండి : మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్​రెడ్డి

by Muthe.Rajitha |

రాష్ట్రంలో పెండింగ్​లో ఉన్న రూ. 2 లక్షల రుణ మాఫీని వెంటనే పూర్తి స్థాయిలో అమలు చేయండని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుకు సీపీఐ మాజీ ఎంఎల్​ఏ చాడ వెంకట్​రెడ్డి విజ్ఞప్తి చేశారు.

రైతులకు పూర్తి స్థాయి రుణమాఫీ చేయండి :  మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్​రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పెండింగ్​లో ఉన్న రూ. 2 లక్షల రుణ మాఫీని వెంటనే పూర్తి స్థాయిలో అమలు చేయండని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుకు సీపీఐ మాజీ ఎంఎల్​ఏ చాడ వెంకట్​రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంఎల్​ఏ చాడ వెంకట్​రెడ్డి సోమవారం సచివాలయంలోని మంత్రి ఛాంబర్​లో తుమ్మలను కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు 2 లక్షల రుణమాఫీ అమలుకు చర్యలు తీసుకోండని కోరారు. గతంలో కూడా బీఆర్​ఎస్​సర్కారు రూ. లక్ష రుణమాఫీ అమలను విడతల వారీగా చేసినందుకు రైతులపై వడ్డీ భారం పడిందని మాజీ ఎంఎల్​ఏ చాడ గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం విధించిన షరతుల ప్రకారం కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకోవడం వలన యజమాని, ఆయన భార్య, కుమారుడు, కోడలు కూడా పంట రుణం బ్యాంక్‌ నుండి తీసుకున్నారని, అయితే అవి మొత్తం కల్పితే రెండు లక్షలకుపైబడి ఉంటాయన్నారు. ఇలా కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకున్నందున దాదాపు 40 శాతం పైబడి రైతులకు రుణమాఫీ కాలేదన్నారు.

ఉదాహరణకు కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలంలో 2 లక్షల రుణమాఫీకి అర్హులైనవారు 9,588 మంది ఉండగా అందులో 5, 864 మందికే రుణమాఫీ అయ్యిందని, ఇంకా మిగిలిన రైతులు 3724 మందికి రుణమాఫీ పెండింగ్​లోనే ఉండటంలో రైతులు ప్రతి రోజూ బ్యాంకులు, వ్యవసాయ అధికారుల చుట్టు తిరిగి విసిగి వేసారి పోతున్నారన్నారు. మరికొందరు రైతులకు అసలు, వడ్డీ కలుపడం వల్ల రూ. 2 లక్షలకు పైబడి బాకి ఉన్నట్లు చూపించడంతో వారికి కూడా రైతు రుణ మాఫీ కావడం లేదన్నారు. మరో వైపు జూన్‌లో పంటలకు క్రాప్​ లోన్‌లు రెన్యూవల్‌ చేసుకోకపోతే ప్రభుత్వ నిబంధనలు అనుసరించి వడ్డీ మాఫీ కాదని, రెన్యువల్‌ చేసుకుంటే రుణమాఫీ అయ్యే అవకాశం ఉండేదేనెమో అనే అనుమానాలు ఉన్నాయన్నారు. కావున రైతులకు ఈ విషయంలో స్పష్టమైన మార్గం చూపించి రుణ సమస్యలను పరిష్కరించాలని ప్రత్యేకంగా కోరుతున్నామని మాజీ ఎంఎల్​ఏ చాడ వెంకట్​రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Next Story