కాంగ్రెస్ టార్గెట్ యూత్.. ఆసక్తిగా మారిన రేపటి ప్రియాంక గాంధీ సభ!

by Disha Web Desk 2 |
కాంగ్రెస్ టార్గెట్ యూత్.. ఆసక్తిగా మారిన రేపటి ప్రియాంక గాంధీ సభ!
X

యువతే టార్గెట్‌గా హామీలు ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధమవుతున్నది. ఇందుకోసం యూత్ డిక్లరేషన్‌ను తయారు చేసింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.93 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించడంతోపాటు, అప్పటి వరకు రూ.3501 నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇవ్వనున్నది. ఈ హామీలను ఈ నెల 8న సరూర్‌నగర్‌లో కాంగ్రెస్ నిర్వహించే సభలో ఏఐసీసీ నేత ప్రియాంక గాంధీ ప్రకటించే అవకాశమున్నది. అంతేకాకుండా రైతులు, కొత్త జిల్లాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సైతం హామీ ఇచ్చే చాన్స్ ఉన్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: యువతను ఆకర్షించేలా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ డిక్లరేషన్‌ను తయారు చేసింది. అధికారంలోకి వస్తే ప్రతి నెల రూ. 3501 నిరుద్యోగ భృతి హామీని ఇందులో పొందుపర్చినట్లు తెలిసింది. జాబ్ వచ్చే వరకు వీటిని పంపిణీ చేయాలని ఇంటర్నల్గా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రత్యేక విధి, విధానాలను తీసుకువచ్చి నిరుద్యోగులకు నష్టం జరగకుండా చూడాలనేదే కాంగ్రెస్ లక్ష్యమని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన టీపీసీసీ కార్యవర్గంలోనూ నిరుద్యోగ భృతిపై నేతలంతా గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఏఐసీసీ కూడా ఎలాంటి ఆబ్జెక్షన్ చేయలేదని ఓ నేత తెలిపారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని యువత, నిరుద్యోగులను కాంగ్రెస్ కు మరింత దగ్గర చేసే అవకాశమున్నదని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. నిరుద్యోగులకు రూ. 3016 ఇస్తామని బీఆర్ఎస్ గతంలోనే హామీ ఇచ్చినా, దాన్ని ఇప్పటి వరకు అమలు చేయలేదు. దీంతో బీఆర్ఎస్ కంటే అదనంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకొని, దాన్ని రూ. 3501గా డిసైడ్ చేసినట్లు తెలిసింది. కాగా, కాంగ్రెస్ పార్టీకి ‘9’ నెంబర్ సెంటిమెంట్ ఉందని ఆ పార్టీ లీడర్లు చెబుతున్నారు. దాని ఆధారంగానే నిరుద్యోగ భృతిని రూ. 3501గా ఫిక్స్ చేసినట్లు చెబుతున్నారు.

సరూర్ నగర్ సభలో..

ఈ నెల 8న ప్రియాంక గాంధీ హైదరాబాద్ కు రానున్నారు. సరూర్ నగర్ లో నిర్వహించే నిరుద్యోగ నిరసన సభలో పాల్గొననున్నారు. ఈ సభలో యువత, నిరుద్యోగుల కోసం పలు హామీలను ప్రకటించే అవకాశమున్నది. బీఆర్ఎస్ నేరవేర్చని హామీలతో పాటు కొన్ని కొత్త నిర్ణయాలు కూడా ఉన్నట్లు పార్టీ నేతలు ఆఫ్ ది రికార్డులో చెబుతున్నారు. రైతు, యువత రాజ్యం దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తున్నదని, ఆ దిశగానే యూత్ డిక్లరేషన్ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేతల్లో ఒకరు తెలిపారు.

1.93 లక్షల జాబ్స్ టార్గెట్

రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో సుమారు 1.93 లక్షల జాబ్స్ ఖాళీగా ఉన్నట్లు కాంగ్రెస్ గుర్తించింది. అధికారంలోకి రాగానే విడతల వారీగా భర్తీ చేస్తామని ప్రకటించే అవకాశమున్నది. వార్షిక జాబ్స్ క్యాలెండర్ ప్రకటించి, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు లేకుండా ప్రత్యేక సిస్టం ద్వారా జాబ్ రిక్రూట్ మెంట్ చేస్తామని పార్టీ హామీ ఇవ్వనున్నది. దీంతోపాటు ఉద్యోగ నియామకాల పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, ఆన్ లైన్, ఆఫ్ లైన్లో విధానాల్లో ఎక్కడా ఎగ్జామ్స్ కు డిస్టర్బ్ కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పే అవకాశమున్నది. రిక్రూట్మెంట్ కోసం ప్రత్యేక బోర్డు, డైరెక్టరేట్ ను కూడా తీసుకువచ్చే ప్లాన్ లో కాంగ్రెస్ ఉన్నదని నేతలు చెబుతున్నారు. టీఎస్పీఎస్సీపై మానిటరింగ్ లేక నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని కాంగ్రెస్ వాదన. టీఎస్పీఎస్సీ పోర్టల్ లో సుమారు 25 లక్షల మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్లు చేసుకోగా, ఆ సంఖ్య 35 నుంచి 40 లక్షల వరకు ఉంటుందని కాంగ్రెస్ భావిస్తున్నది.

కొత్త జిల్లాల్లో సమస్యలు

తెలంగాణలో జిల్లాల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం 33కు పెంచినా, ఆయా చోట్ల మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. స్టాఫ్ కొరతతో ఉన్న ఉద్యోగులపై భారం పడుతున్నదని పేర్కొంటున్నారు. కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశామని సర్కార్ గొప్పగా చెబుతున్నా, పాలన అస్తవ్యస్తంగా మారిందని చెబుతున్నారు. నోటిఫికేషన్లు వేగంగా వేసి, ఉద్యోగాలు భర్తీ చేస్తే ఇలాంటి సమస్యలను పరిష్కరించవచ్చని కాంగ్రెస్ పార్టీ పేర్కొంటున్నది. కొత్త జిల్లాల్లో సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఐఏఎస్ల కమిటీని వేయాలని కాంగ్రెస్ అంతర్గతంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

కాంగ్రెస్ లాభ పడేలా..

వరంగల్ లోని రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ ను క్రోడీకరిస్తే కాంగ్రెస్కు మేలు జరుగుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. రూ.2 లక్షల రుణ మాఫీ, కౌలు రైతులకూ ఏడాదికి రూ.15వేల పెట్టుబడి సాయం, ఉపాధి హామీలో నమోదు చేసుకున్న రైతు కూలీలకు రూ.12వేల ఆర్థిక సాయం వంటివి ఇంప్లిమెంట్ చేస్తామని ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించింది. దీంతోపాటు మద్ధతు ధర, తెలంగాణలో మూతపడిన చెరుకు కర్మాగారాలను తెరిపించడం, పసుపు బోర్డు ఏర్పాటు చేసి ఆయా రంగాల రైతులను ఆదుకోవడం కోసం పార్టీ తీసుకునే యాక్షన్ప్లాన్ను ప్రియాంక గాంధీ వివరించనున్నారు. ఉపాధి హామీ వ్యవసాయానికి అనుసంధానం, ధరణి పోర్టల్ను రద్దు చేసి సరికొత్త రెవెన్యూ వ్యవస్థను తీసుకురావడం, రైతు సమస్యల పరిష్కారానికి ‘రైతు కమిషన్’ ఏర్పాటు గురించి కూడా చెప్పనున్నారు. ఈ అంశాలను జనాల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ప్రియాంక పార్టీ నేతలకు సూచించనున్నట్లు తెలిసింది.

యువతతోనే మార్పు: మెట్టు సాయి కుమార్, కాంగ్రెస్ ఫిషర్ మెన్ చైర్మెన్

రాబోయే ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పడిపోతాయి. కాంగ్రెస్ పార్టీ యువత‌పై ఫోకస్ పెంచింది. నిరుద్యోగుల‌ను ఆదుకునేందుకు కంకణం కట్టుకున్నది. అధికారంలోకి రాగానే నిరుద్యోగ భృతి అమలు చేస్తాం. ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తాం. యువ, రైతు రాజ్యం తీసుకువస్తాం..


ఇవి కూడా చదవండి:

సచివాలయంపై గరుడ సంచారం.. శుభమా?.. అరిష్టమా?

Next Story