మావోయిస్టు రామచంద్రా రెడ్డి డెడ్‌బాడీని భద్రపరచండి.. సుప్రీం కోర్టు సెన్సేషనల్ ఆర్డర్స్

by Kema Shiva Kumar |

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌ జిల్లా అబూజ్‌మడ్‌ అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు కట్టా రామచంద్రా రెడ్డి (Katta Ramchandra Reddy)తో పాటు కడారి సత్యానారాయణ రెడ్డి (Kadari Satyanarayana Reddy) మృతి చెందిన విషయం తెలిసిందే.

మావోయిస్టు రామచంద్రా రెడ్డి డెడ్‌బాడీని భద్రపరచండి.. సుప్రీం కోర్టు సెన్సేషనల్ ఆర్డర్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌ జిల్లా అబూజ్‌మడ్‌ అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు కట్టా రామచంద్రా రెడ్డి (Katta Ramchandra Reddy)తో పాటు కడారి సత్యానారాయణ రెడ్డి (Kadari Satyanarayana Reddy) మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ ఎన్‌కౌంటర్‌ పక్కా బూటకమని కట్టా రామచంద్రా రెడ్డి కుమారుడు రవిచంద్ర, కూతురు స్నేహ ఛత్తీస్‌గఢ్ హైకోర్టు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆ పిటిషన్ విచారణ చేపట్టిన ధర్మాసనం హైకోర్టు నిర్ణయం తీసుకునే వరకు రామచంద్రా రెడ్డి డెడ్‌బాడీనీ మార్చురీలో భద్రపరచాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల 6కు వాయిదా వేసింది. విజయదశమి సెలవుల నేపథ్యంలో తక్షణ విచారణకు కోర్టు నిరాకరించింది. దీంతో పిటిషనర్లు తన తండ్రి మృతదేహానికి రీపోస్టు మార్టం చేయాలని, దహనం చేయకూడదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రామచంద్రా రెడ్డిని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నప్పటికీ పోలీసులు ఆయనను చిత్రహింసలు పెట్టి చంపారని వారు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు వారి పిటిషన్‌పై ఇవాళ జస్టిస్ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌, జస్టిస్ ఎన్ కోటీశ్వర సింగ్‌ త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఈ విషయంపై నిర్ణయం తీసుకునే వరకు రామచంద్రా రెడ్డి డెడ్‌బాడీని సంరక్షించాలని ఆదేశించింది. అదేవిధంగా పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలని హైకోర్టుకు సూచించింది. మెరిట్స్‌పై ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయకుండా అన్ని వాదనలను బహిరంగంగా ఉంచినట్లుగా కోర్టు స్పష్టం చేసింది.

విచారణలో భాగంగా పిటిషనర్ తరఫు న్యాయవాది కోలిన్ గోన్సాల్వెస్ మాట్లాడుతూ.. తన క్లయింట్ రామచంద్రా రెడ్డిది బూటకపు ఎన్‌కౌంటర్ అంటూ ఛత్తీస్‌గఢ్ హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు. అయితే, అత్యవసర విచారణకు అనుమతి లభించలేదని, అందుకే ఎక్కడ తన క్లయింట్ తండ్రి మృతదేహాన్ని పోలీసులు దహనం చేసేస్తారనే భయంతోనే కోర్టుకు ఆశ్రయించినట్లుగా ధర్మాసనానికి తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందని బయట అధికారులతో బూటకపు ఎన్‌కౌంటర్‌పై సీబీఐ దర్యాప్తు కోరుతున్నామని తెలిపారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమక్షంలో పోస్ట్‌మార్టం వీడియోగ్రఫీలో నిర్వహించబడిందని తెలిపారు. ఈ ఫైరింగ్‌లో ఇద్దరు వ్యక్తులు మరణించారని గుర్తు చేశారు. కానీ, ప్రతివాదులు డెడ్‌బాడీని మాయం చేసేందుకు యత్నిస్తున్నారని న్యాయవాది చెప్పగా.. జస్టిస్ సూర్యకాంత్ కలుగజేసుకుని ‘వద్దు పర్వాలేదు.. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో తమకు తెలుసని కామెంట్ చేశారు.

చత్తీస్‌గఢ్ రాష్ట్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపిస్తూ.. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు వ్యక్తులు మరణించారని కోర్టుకు తెలిపారు. మావోయిస్టు రామచంద్రా రెడ్డి డెడ్‌బాడీని వారి కుటుంబానికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా నిరాకరిస్తున్నారని తెలిపారు. మృతుడు మావోయిస్టు పార్టీ కమాండర్ అని ఏడు రాష్ట్రాల్లో అతడిపై రూ.2 కోట్ల రివార్డు ఉందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 22న జరిగిన ఎన్‌కౌంటర్‌లో కట్టా రామచంద్రా రెడ్డి, కడారి సత్యనారాయణ రెడ్డి మరణించారని కోర్టుకు తుషార్ మెహతా తెలిపారు.

ఈ కేసులో అడ్వొకేట్ ఆన్ రికార్డ్ సత్యమిత్ర దాఖలు చేయగా. ఇందులో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, నారాయణ్‌పూర్ కలెక్టర్, సీబీఐలను ప్రతివాదులుగా చేర్చారు.

Next Story