కేసీఆర్‌ను ఫాలో అవుతున్న కేఏ పాల్!

by Disha Web Desk 2 |
కేసీఆర్‌ను ఫాలో అవుతున్న కేఏ పాల్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మునుగోడు ఉపఎన్నిక ప్రచారంపై ప్రధాన పార్టీలు స్పీడ్ పెంచాయి. గెలుపే లక్ష్యంగా ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక తామేమి తక్కువ కాదన్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సైతం తన ప్రయత్నం కొనసాగిస్తున్నారు. మునుగోడులో పాగా వేసేందుకు ఆయన సరికొత్త స్కీమ్ లను తెరపైకి తీసుకు వస్తున్నారు. ఇదిలా ఉంటే ఓ ముచ్చట మునుగోడు ప్రజలను తెగ ఆకర్షిస్తోంది. కేసీఆర్ పై విమర్శలు గుప్పించే కేఏ పాల్ ఇప్పుడు కేసీఆర్ ను ఫాలో అవుతున్నారనే చర్చ తెరపైకి వస్తోంది. గత ఆదివారం కేఏ పాల్ పుట్టిన రోజు జరుపుకున్నారు. తన 59వ బర్త్ డే సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలోని 59 మంది నిరుద్యోగులకు పాస్ పోర్టు అమెరికా వీసా ఉచితంగా ఇప్పించడంతో పాటు వారికి ఉద్యోగాలు కల్పిస్తానని గతంలోనే ప్రకటించారు. ప్రకటించినట్లుగానే 59 మంది మందికి వీసా లక్కీడ్రా తీశారు. డ్రాలో గెలుపొందిన వారిని అమెరికా పంపిస్తామని కేఏ పాల్ ప్రకటించారు. నిరుద్యోగుల కష్టాలు ఎలా ఉంటాయో తనకు తెలుసని చెబుతూనే వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు కేఏ పాల్. ఇదిలా ఉంటే తన బర్త్ డే వేడుకల సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ మరోసారి చర్చకు దారి తీశాయి.

కేసీఆర్‌ను ఫాలో అవుతున్న కేఏ పాల్:

మునుగోడు విషయంలో ప్రజాశాంతి పార్టీ సీరియస్‌గా వర్క్ చేస్తుందని కేఏ పాల్ ఇదివరకే స్పష్టం చేశారు. ఇక్కడ బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ ఉన్న సంగతి తెలిసిందే. కానీ కేఏ పాల్ మాత్రం తన సత్తా ఏంటో చూపిస్తానని చెబుతున్నారు. గెలుపు కోసం కేసీఆర్ ను ఫాలో అవడం హాట్ టాపిక్ అవుతున్నది. తనను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో మునుగోడు ప్రజలకు రుచి చూపిస్తానంటున్నారు కేఏ పాల్. తమ అభ్యర్థి గనుక మునుగోడులో గెలిస్తే ఆరు మాసాల్లో మునుగోడును అమెరికా చేసి చూపిస్తానని అలాగే నియోజకవర్గంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. అయితే గతంలో సీఎం కేసీఆర్ సైతం ఇదే తరహా హామీలు ఇచ్చారని పొలిటికల్ సర్కిల్స్‌లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను డల్లాస్ చేస్తానని పాతబస్తీనీ ఇస్తాంబుల్, కరీంనగర్ ను లండన్‌లా చేసి వాటి రూపురేఖలు మారుస్తానని గతంలో కేసీఆర్ ప్రకటించారు. అయితే ఆ తర్వాత తన హామీల విషయం కేసీఆర్ మరిచిపోయారని, కేవలం మాటలకే పరిమితం అయ్యారని ప్రతిపక్షాలు ఇప్పటికీ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. తాజాగా కేఏ పాల్ సైతం ఇదే తరహాలో.. తమ అభ్యర్థికి ఒక్క ఛాన్స్ ఇస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో పరిచయం చేస్తానని చెప్పడం ఆసక్తిని రేపుతోంది. పొలిటికల్ వైజ్‌గా కేఏ పాల్ ఏమాత్రం తగ్గడం లేదనే చర్చకు తెరలేస్తుండటంతో రాష్ట్ర రాజకీయాల్లో రోజు రోజుకు ఆసక్తి పెరుగుతోంది. తమ పుట్టిన రోజు ముగియడంతో మునుగోడు యువకులను అమెరికాకు పంపిస్తారా లేక మరేదైనా కారణంతో వారిని ఆపేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed