Ponnam Prabhakar: బీసీ నేత ఈటలను బయటకి ఎందుకు పంపారు? బీఆర్ఎస్ పై మంత్రి పొన్నం ఆగ్రహం

by Prasad Jukanti |

కులగణన సర్వేపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు.

Ponnam Prabhakar: బీసీ నేత ఈటలను బయటకి ఎందుకు పంపారు? బీఆర్ఎస్ పై మంత్రి పొన్నం ఆగ్రహం
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే (Caste Census)పై మీకు విమర్శలు చేసే హక్కు బీఆర్ఎస్ కు ఎక్కడ ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో తొలిసారి సర్వే చేసిన వారిపై విమర్శలు చేస్తారా అని మండిపడ్డారు. బుధవారం గాంధీ భవన్ (Gandhi Bhavan) లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కుల గణన ప్లాప్ చేయాలని కుట్ర చేశారని ఆరోపించారు. హక్కులు అడిగితే ఈటల రాజేందర్ (Eatala Rajender) ను పార్టీ నుండి గెంటేశారు. బీఆర్ఎస్ నుండి బీసీ నేత ఈటలను బయటకి ఎందుకు పంపారని నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీలో మూడు కీలక పదవులు ఒకరికే ఉంటే అడిగే దమ్ముందా? కుల గణనలో పాల్గొనని వారికి ఏం నైతికత ఉందని అడుగుతున్నారని దుయ్యబట్టారు. కుల గణనలో ఏం పోరపాటు జరిగిందో చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలపై చిత్తశుద్ధి చాటుకుంది.బలహీన వర్గాలకు ఒక రోడ్ మ్యాప్ తయారైంది. ఆధారాలు లేకుండా అనుమానాలు రేపే కుట్రదారుల ట్రాప్ లో బీసీలు పడవద్దని సూచించారు. ఏవైనా పొరపాట్లు జరిగితే వాటిని బాధ్యతగా సరిచేస్తామన్నారు. పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు ఏం చేశారో చర్చించడానికి రెడీ అని పొన్నం అన్నారు. చర్చకు అసెంబ్లీకి రమ్మంటారా? చార్మినార్ కి రమ్మంటారా? బల్కం పేట ఎల్లమ్మ గుడి దగ్గర చర్చ చేద్దామా? అని సవాల్ విసిరారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారమే అన్ని హామీలు అమలు చేస్తామన్నారు.

పార్టీ లైన్ తప్పితే చర్యలు తప్పవు: పీసీసీ చీఫ్

పార్టీ లైన్ దాటి మాట్లాడిన వారిపై పార్టీ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ అయినా ఎంపీ అయినా క్రమశిక్షణకు లోబడే ఉండాలి. క్రమశిక్షణ తప్పినప్పుడు ఏం చేయాలో క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందన్నారు. బీసీ కులగణనపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతున్న వేళ పీసీసీ చీఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక కులగణనపై స్పందిస్తూ తెలంగాణ చరిత్రలో నిన్న ఒక కొత్త అధ్యాయం మొదలైందన్నారు. కులగణన సర్వే శాస్త్రీయంగా, చాలా పకడ్బందీగా జరిగిందిని చెప్పారు. ఒక యజ్ఞంలాంటి కార్యక్రమాన్ని చూసి కొందరు ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

Next Story