కర్ణాటక ఫలితాల ఎఫెక్ట్: కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు?

by Disha Web Desk 2 |
కర్ణాటక ఫలితాల ఎఫెక్ట్: కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు?
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్/వనపర్తి ప్రతినిధి: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరడం ఇక లాంఛనమేనే ప్రచారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ నుంచి సస్పెండైన జూపల్లి ఏ పార్టీలో చేరుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీలోకి వెళ్తారని.. లేదంటే కాంగ్రెస్‌లో చేరుతారని, ఎందులోకి వెళ్లకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉంటారనే ప్రచారం జరిగింది. కొద్ది రోజుల కిందట బీజేపీ అగ్రనేతలు కూడా పొంగులేటి, జూపల్లితో చర్చించడంతో ఆ పార్టీలోకి వెళ్తారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ, ఇరువురు నేతలు తమ జిల్లాలోని నియోజకవర్గాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోలేదు.

కర్ణాటక ఎన్నికల తర్వాతనే ఉంటాయని అనుచరులు చెబుతూ వచ్చారు. ఇక ఫలితాలు వెలువడటం.. కాంగ్రెస్ విజయం సాధించడంతో.. పొంగులేటి, జూపల్లి ఆ పార్టీలోనే చేరతారని దాదాపు ఖాయమైందని ఉమ్మడి జిల్లాలో ప్రచారం ఊపు అందుకుంది. ఇందులో భాగంగా ఆదివారం బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, పెద్దమందడి ఎంపీపీ మెగా రెడ్డి, వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి తదితరుల ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఆత్మీయ సమ్మేళనానికి జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరవుతున్నారు. అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించడంతోపాటు, భవిష్యత్‌లో ఏ పార్టీలో చేరాలనే అంశంపైనా ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తుంది.

Next Story