'పొంగులేటి' పార్టీ మారితే.. పీకే సర్వేలో ఏం తేలింది?

by Disha Web Desk 2 |
పొంగులేటి పార్టీ మారితే.. పీకే సర్వేలో ఏం తేలింది?
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మంలో వచ్చే ఎన్నికల వరకు కారు పార్టీ ఖాళీ కానుందా..? పొంగులేటి పార్టీ మారితే ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ పని అయిపోయినట్లేనా..? పీకే రిపోర్టులో కూడా ఇదే ఉందా..? ఇప్పుడు ఇదే అంశం ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల పీకీ బృందం చేసిన సర్వేలో ఇవే విషయాలు వెల్లడైనట్లు సోషల్ మీడియా వేదికగా పోస్టులు చక్కర్లు కొడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ కు ఒక్క సీటు రాదని కూడా నివేదించినట్లు అనేక పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే ఇది నిజమా..? కాదా..? ప్రశాంత్ కిషోర్ బృందం సర్వే చేసిందా..? లేదా..? అనేది పక్కకు పెడితే ఉమ్మడి జిల్లాలో మాత్రం పరిస్థితి అలాగే కనిపిస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకవేళ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్‌ను వీడితే ఖమ్మంలో కారు పార్టీ ఖతమే అంటున్నారు.

సోషల్ మీడియాలో పోస్టులు..

ఇటీవల టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సపోర్టు తీసుకుందని, ఆ బృందం సభ్యులు పలు జిల్లాల్లో సీక్రెట్ సర్వే చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మంలో కూడా ఇప్పటికే రెండుసార్లు సర్వే చేసి నివేదికను కేసీఆర్‌కు అందజేసినట్లు వారం రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సర్వేలో కొన్ని నియోజకవర్గాల్లో ఎవరెవరికి సీట్లు ఇస్తే గెలుస్తారో కూడా చెప్పినట్లు ప్రచారం జరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు గెలిచే పరిస్థితులో లేదని నివేదించినట్లు కూడా సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు.

శీనన్న కారు దిగితే..

పీకే నివేదికలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేరు ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. పొంగులేటి పార్టీ మారితే జిల్లాలో టీఆర్ఎస్‌కు గడ్డు పరిస్థితి తప్పదని సీఎం కేసీఆర్‌కు సూచనప్రాయంగా పీకే నివేదిక రూపంలో అందజేసినట్లు ఆయా సామాజిక మాధ్యమాల్లో పలు రకాలైన పోస్టులు దర్శనమిస్తున్నాయి. శీనన్న కారు దిగితే...? రాబోయే కాలంలోనూ ఆ పార్టీకి ఉమ్మడి జిల్లాలో రాజకీయ భవిష్యత్తు ఉండదని కూడా తేల్చిచెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలో పరిస్థితి కూడా టీఆర్ఎస్‌కు ప్రతికూలంగా, పొంగులేటికి అనుకూలంగా ఉందని, ఒకవేళ పీకే రిపోర్టు నిజమే అయ్యుండొచ్చని పలు రాజకీయ పార్టీల్లో చర్చలు మొదలయ్యాయి. పీకే సర్వే అయినా కాకున్నా.. భవిష్యత్‌లో ఆయన చేరే పార్టీ జెండానే ఎగురుతుందని కూడా వారంటున్నారు.

హాట్ టాపిక్‌గా పొంగులేటి..

సర్వే నిజమా? కాదా? అన్నది పక్కన పెడితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటు రాష్ట్ర రాజకీయ వర్గాలతో పాటు ఉమ్మడి జిల్లాలో మళ్లీ హాట్ టాపిక్‌గా నిలిచారు. వాస్తవానికి పొంగులేటికి టీఆర్ఎస్ ఎంపీ సీటివ్వకుండా పదవికి దూరం చేసినప్పటి నుంచి ఆయన ప్రజల్లోనే ఉంటూ తన 'బ్రాండ్'ను మాత్రం ఎప్పటికప్పడు కాపాడుకుంటూనే ఉన్నారు. ఉమ్మడి జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కూడా ఆయనకు అభిమానులు భారీగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు ఎన్నోసార్లు పార్టీ మారాలని టీఆర్ఎస్‌లో ఉంటే ఎప్పటికీ అన్యాయం జరుగుతూనే ఉంటుందంటూ ఒత్తిడి చేశారు. అయినా శ్రీనివాస్ రెడ్డి మాత్రం సంయమనం పాటించుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే సొంత పార్టీ నేతలే ఆయనపై ఇప్పటికీ ఆధిపత్యం చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. పొంగులేటి టీఆర్ఎస్‌లో ఉన్నా.. అయన బలగం అంతా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ క్రమంలో పార్టీతో కొంత గ్యాప్ ఏర్పడినా టీఆర్ఎస్‌లోనే కొనసాగుతున్నారు. ఇప్పుడు పీకే సర్వే రిపోర్టు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తుండడంతో ఆయన వర్గం ఆనందపడుతోంది. పీకే రిపోర్టు నిజమేనా..? భవిష్యత్‌లో పొంగులేటి దారెటో వేచిచూడాల్సిందే మరి.

Next Story

Most Viewed