పొంగులేటి, జూపల్లి బాటలోనే ఈటల, విజయశాంతి?

by Disha Web Desk 2 |
పొంగులేటి, జూపల్లి బాటలోనే ఈటల, విజయశాంతి?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో గత కొంత కాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. వివిధ పార్టీల్లో అసంతృప్తులు, ఆశావాహులు తమకు కలిసివచ్చే అనువైన వేదికల కోసం అన్వేషణను ముమ్మరం చేశారంటూ జరుగుతున్న ప్రచారం హాట్ హాట్‌గా సాగుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి సస్పెండైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు తీసుకోబోయే నిర్ణయం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో వీరితో పాటు కలిసి నడవబోతున్న నేతలెవరంటూ రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పొంగులేటి, జూపల్లి ద్వయానికి గాలం వేసేందుకు ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.

పొంగులేటి, జూపల్లి బాటలో ఈటల?:

కర్ణాటక ఫలితాలతో తెలంగాణ రాజకీయం మరింత వేడెక్కింది. ఎన్నికలకు మరో ఐదు నెలలే గడువే ఉండటంతో రాజకీయ నేతలంతా తమ స్థానాలను సర్దుబాటు చేసుకునే ప్రయత్నాలు స్పీడప్ చేశారు. ఈ క్రమంలో తమ లక్ష్యాలు, ప్రాధాన్యతలకు ప్రయార్టీ ఇస్తున్నారు. దీంతో కేసీఆర్ టార్గెట్‌గా ఉన్న నేతలంతా ఏకం అయ్యే ప్రయత్నాలు జరుగుతున్నాయనే చర్చ ఇటీవల ప్రధానంగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్ పేరు మళ్లీ మళ్లీ తెరపైకి వస్తోంది. జూపల్లి, పొంగులేటి బాటలోనే ఈటల వెళ్తారనే టాక్ వినిపిస్తోంది. బీజేపీ విషయంలో అసంతృప్తితో ఉన్న ఈటల త్వరలో పార్టీ మారడం ఖాయం అనే చర్చ వినిపిస్తూనే ఉంది. ఇదిలా ఉంటే ఒక వేళ ఈటల బీజేపీని వీడితో ఆయన ఒక్కరే వెళ్తారా లేక ఆయన వెనుక వెంట నడిచే నేతలెవరు అనేది ఇటు బీజేపీతో పాటు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.

ఈటల వెంట ఆ ఫైర్ బ్రాండ్?

కేసీఆర్‌ను ఓడించడమే టార్గెట్‌తో బీజేపీలో చేరిన వారి లిస్ట్ పెద్దదే. అలాంటి వారిలో ఈటల, విజయశాంతి ప్రధానమైన వారు. గతంలో కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న ఈటల, విజయశాంతి ఆ తర్వాత కేసీఆర్ తమను మోసం చేశాడని ఆరోపిస్తూ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించేందుకు పొంగులేటి, జూపల్లి, కోదండరామ్ వంటి నేతలు ప్రయత్నాలు చేస్తుంటే వారి వెంటే ఈటల వెళ్లబోతున్నారనే, ఈటల బాటలోనే విజయశాంతి కూడా వెళ్తున్నారనే టాక్ పొలిటికల్ కారిడార్‌లో గుప్పుమంటోంది. ఏ మాత్రం ఛాన్స్ లభించినా కేసీఆర్‌పై విరుచుకుపడే విజయశాంతి గత కొంత కాలంగా బీజేపీలో అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ సందర్భంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై ఆమె బహిరంగంగానే అసంతృప్తిని వెల్లగక్కడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ టార్గెట్‌గా నేతలంతా ఏకమైతే ఆ టీమ్‌లో చేరేందుకు విజయశాంతి సిద్ధంగా ఉన్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Also Read..

పొంగులేటి-జూపల్లి-ఈటల చర్చలపై సస్పెన్స్!



Next Story

Most Viewed