నగరానికి చేరుకున్న ప్రధాని మోడీ.. ఘన స్వాగతం పలికిన బీజేపీ నేతలు

by Kema Shiva Kumar |

ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన అరగంట ఆలస్యం. బేగంపేట ఎయిర్‌పోర్ట్, పరేడ్ గ్రౌండ్స్ వద్ద భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు

నగరానికి చేరుకున్న ప్రధాని మోడీ.. ఘన స్వాగతం పలికిన బీజేపీ నేతలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. షెడ్యూల్ కంటే 30 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన ప్రధానికి విమానాశ్రయం వద్ద ఘనస్వాగతం లభించింది. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో శివప్రతాప్ శుక్లా, పలువురు ఉన్నతాధికారులు, బీజేపీ నేతలు ప్రధానికి స్వాగతం పలికారు. అలాగే, భారీ సంఖ్యలో తరలివచ్చిన బీజేపీ అగ్రనేతలు, కార్యకర్తలు ఆయనకు పూలమాలలతో ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ప్రధాని మోదీ నేరుగా మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీ (HICC) కి బయలుదేరారు. ప్రధాని ప్రయాణించే మార్గమంతటా పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన హెచ్‌ఐసీసీ వేదికగా పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

హెచ్‌ఐసీసీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేయనున్నారు. రూ.9,400 కోట్ల విలువైన జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. హైటెక్ సిటీలో నూతనంగా నిర్మించిన సింధు ఆసుపత్రిని రిమోట్ ద్వారా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న ప్రతినిధులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించే అవకాశం ఉంది. ప్రధాని బేగంపేట నుంచి హెచ్‌ఐసీసీకి వెళ్తున్న నేపథ్యంలో గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్నాయి. పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. హెచ్‌ఐసీసీ కార్యక్రమం అనంతరం ప్రధాని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే బహిరంగ సభకు బయలుదేరుతారు.

Next Story