ట్యాపింగ్ కేసు విచారణలో ఏ1 ట్విస్ట్! ఎస్ఐబీ మాజీ చీఫ్ కొత్త పల్లవి వెనుక మర్మమేంటి?

by Prasad Jukanti |

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఊహించని మలుపు తిరుగుతోంది.

ట్యాపింగ్ కేసు విచారణలో ఏ1 ట్విస్ట్! ఎస్ఐబీ మాజీ చీఫ్ కొత్త పల్లవి వెనుక మర్మమేంటి?
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ (Phone tapping case) కేసులో రోజుకో కొత్త ట్విస్ట్ తెరపైకి వస్తోంది. ఇన్నాళ్లు పొంతనలేని సమాధానాలు చెబుతూ వచ్చిన ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు (Prabhakar Rao) అనూహ్యంగా కొత్త పల్లవి అందుకోవడం రాజకీయ వర్గాలను ఒక్కసారిగా షాక్‌కు గురిచేస్తోంది. విచారణలో భాగంగా తన చేత నాటి ప్రభుత్వ పెద్దలు ఫోన్ ట్యాప్ చేయించారని ఆయన వెల్లడిస్తారని పొలిటికల్ కారిడార్‌లో చర్చ వినిపించింది. కానీ అనూహ్యంగా నాటి డీజీపీ మహేందర్‌రెడ్డి చెబితే ఫోన్ ట్యాపింగ్ చేశానని నిన్నటి విచారణ సందర్భంగా ప్రభాకర్‌రావు సిట్‌కు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. మాజీ డీజీపీ పేరును ప్రస్తావించడం వెనుక మతలబు ఏంటి? ఈ కేసులో ఏం జరగబోతున్నది అనేది ఆసక్తిగా మారింది. (Prabhakar Rao)

మహేందర్‌రెడ్డికి రేవంత్ కీలక పదవి..

కేసీఆర్ ప్రభుత్వంలో మహేందర్‌రెడ్డి (EX DGP Mahender Reddy) కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కేసీఆర్ ఆయనను డీజీపీగా నియమించారు. ఆయన ఆ హోదాలో అప్పట్లో రివ్యూ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఆయనతో పాటు శాంతికుమారి, రవిగుప్తా, అనిల్ కుమార్ రివ్యూ కమిటీలో ఉండగా తాజాగా ప్రభాకర్ రావు మహేందర్‌రెడ్డి పేరును ప్రస్తావించారు. అంతటితో ఆగకుండా తాను పదవీ విరమణ చేసిన తర్వాత అప్పటి డీజీపీ మహేందర్‌రెడ్డి తన ఎక్స్‌టెన్షన్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించారని, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన సొంత నిర్ణయం ఏమీ లేదని, కేసీఆర్‌తో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. మహేందర్‌రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ ప్రభుత్వం టీజీపీఎస్సీకి చైర్మన్‌గా నియమించింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి మహేందర్‌రెడ్డికి మంచి సంబంధాలు ఏర్పడ్డాయనే టాక్ ఉంది. అటువంటిది సిట్ ముందు ప్రభాకర్ రావు ఆయన పేరు ప్రస్తావిస్తూ, కేసీఆర్‌తో సంబంధం లేదని చెప్పడం వెనుక రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లోకి నెట్టే ఎత్తుగడ వేశారా? అనే చర్చ సాగుతోంది.

మాజీ డీజీపీ స్టేట్‌మెంట్‌లో ఏముంది?..

మహేందర్‌రెడ్డితోపాటు అప్పటి రివ్యూ కమిటీ సభ్యుల నుంచి దర్యాప్తు అధికారులు వాంగ్మూలాలు సేకరించినట్లు తెలుస్తోంది. దీంతో మహేందర్‌రెడ్డి సిట్‌కు ఏం చెప్పారు? ఫోన్ ట్యాపింగ్ ఆదేశాల వెనుక ఉన్నదెవరో వివరించారా? అనేది ఆసక్తిగా మారింది. నిజానికి ఏ ముఖ్యమంత్రికైనా చెవులు, కళ్లు అంతా స్టేట్ ఇంటలిజెన్స్ విభాగమే. కేసీఆర్ హయాంలో ప్రభాకర్‌రావు నేతృత్వంలోని ఇంటలిజెన్స్ విభాగాన్ని విచ్చలవిడిగా ఉపయోగించారనే విషయాన్ని సిట్ గుర్తించింది. ఈ కేసులో ప్రభాకర్ రావు తెలివిగా రాజకీయ ప్రముఖుల పేర్లకు బదులుగా ఉన్నతాధికారుల పేర్లు చెప్పినా.. తిరిగి అది గత ప్రభుత్వ పెద్దల మెడకే చుట్టుకోక తప్పదా? అనే చర్చ జరుగుతోంది.

Next Story