TPCC Chief : తెలంగాణ తల్లి రూపశిల్పి రమణా రెడ్డిని సన్మానించిన పీసీసీ చీఫ్

by Y. Venkata Narasimha Reddy |

రేపు రాష్ట్ర సచివాలయంలో ఆవిష్కరణ చేయనున్న తెలంగాణ తల్లి(Telangana Thalli) విగ్రహం సహా తెలంగాణ అమరవీరుల జ్యోతి రూప శిల్పి రమణా రెడ్డి(Sculptor Ramana Reddy)ని టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(TPCC Chief Mahesh Kumar Goud) సన్మినించి సత్కరించారు.

TPCC Chief : తెలంగాణ తల్లి రూపశిల్పి రమణా రెడ్డిని సన్మానించిన పీసీసీ చీఫ్
X

దిశ, వెబ్ డెస్క్ : రేపు రాష్ట్ర సచివాలయంలో ఆవిష్కరణ చేయనున్న తెలంగాణ తల్లి(Telangana Thalli) విగ్రహం సహా తెలంగాణ అమరవీరుల జ్యోతి రూప శిల్పి రమణా రెడ్డి(Sculptor Ramana Reddy)ని టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(TPCC Chief Mahesh Kumar Goud) సన్మినించి సత్కరించారు. మహేష్ కుమార్ గౌడ్ స్వగృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో రమణారెడ్డి కళాత్మకతని అభినందిస్తూ, శాలువలు, జ్ఞాపికలతో సన్మానించారు. తెలంగాణ తల్లి విగ్రహంలో అమర వీరుల పిడికిళ్లని జోడించడం ఉద్యమ స్ఫూర్తికి నిదర్శనంగా, స్ఫర్తిదాయకంగా ఉందని ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు. కాగా తెలంగాణ తల్లి విగ్రహం రూపకర్త ప్రొఫెసర్ తోపారపు గంగాధర్‌ ను ప్రభుత్వం నిన్ననే జవహర్ లాల్ నెహ్రు ఆర్ట్స్ జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (JNAFAU) ఇంచార్జి వైస్ ఛాన్సలర్‌గా నియమించడం ద్వారా గౌరవించుకుంది.

సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి రేపు ప్రతిష్టించనున్న తెలంగాణ తల్లి విగ్రహం బీఆర్ఎస్ పాలకులు ఇప్పటిదాక అనధికారికంగా ప్రాచుర్యంలోకి తెచ్చిన తెలంగాణ తల్లికి భిన్నంగా ఉంది. దీనిపై వచ్చిన అభ్యంతరాలపై ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్త గంగాధర్, రూపశిల్పి రమణారెడ్డిలు వివరణ ఇచ్చారు. తెలంగాణ తల్లి చేయి కాంగ్రెస్ చేయి గుర్తు కాదని..అది అభయహస్తమని స్పష్టం చేశారు. చేతులు ఉన్న వాళ్లంతా కాంగ్రెస్ వాళ్లా?. సైకిల్ తొక్కుతున్న వాళ్లంతా ఒక పార్టీకి సంబంధించిన వాళ్లా?. తెలంగాణలో అనేక ప్రత్యేక పండగలు ఉన్నాయని, బతుకమ్మతోపాటు బోనాలు, సదర్, సమ్మక్క సారక్క లాంటి అనేక పండగలు తెలంగాణకి ప్రత్యేకమేనని స్పష్టం చేశారు. అందుకే బతుకమ్మను విగ్రహంలో పొందుపరుచలేదన్నారు. తెలంగాణ తల్లి సాధారణ మహిళగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని.. పోరాట స్ఫూర్తి కనిపించేలా విగ్రహాన్ని తయారు చేయాలని ఆయన సూచించారని తెలిపారు. దేవతలు గుడిలో ఉండాలి, తల్లి ఇంట్లో ఉండాలంటూ తెలంగాణ తల్లి విషయంలో కేసీఆర్, రేవంత్ ఆలోచనలు వేర్వురుగా ఉన్నాయన్నారు. తెలంగాణ తల్లి రూపం కోసం అనేక స్కెచ్‌లు తయారు చేశామని.. ప్రజలు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారనే అర్థం వచ్చేలా విగ్రహాన్ని తయారు చేశామని వారు వివరించారు. తెలంగాణ సమాజమంతా కొత్త తెలంగాణ తల్లి రూపాన్నే ఇష్టపడుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా మొదటి తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన చేసింది కూడా ఫ్రొఫెసర్ గంగాధర్ కావడం గమనార్హం.

సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్న తెలంగాణ తల్లి విగ్రహం ఆకుపచ్చచీరలో నిలబడి ఉన్నట్లుగా తయారు చేశారు. కుడి చేతితో తెలంగాణ ప్రజలకు అభయహస్తం చూపుతూ.. ఎడమ చేతిలో తెలంగాణలో పండించే ముఖ్యమైన పంటలు వరి, మొక్కజొన్న, సజ్జ కంకులున్నాయి. వీటి ద్వారా గ్రామీణ జీవన విధానం, వ్యవసాయానికి గల ప్రాధాన్యాన్ని చాటిచెబుతుంది. మెడలో తెలంగాణ ఆడపడుచులు ధరించే తీగ, చేతికి ఆకుపచ్చ గాజులు,బంగారు అంచు కలిగిన ఆకుపచ్చ చీరకట్టుకుని తెలంగాణ తల్లి విగ్రహం కనిపిస్తుంది. వస్త్రధారణలోని ఆకుపచ్చని రంగు పచ్చని పంటలను, ఎరుపు రంగు చాకలి ఐలమ్మ లాంటి తెలంగాణ ధీరవనితల పోరాటాన్ని ప్రతిబింబిస్తాయి. తెలంగాణ పోరాట స్పూర్తిని తెలిపేలా విగ్రహ పీఠంలో బిగించిన పిడికిళ్లు రూపొందించారు. తెలంగాణ తల్లికి దాస్య విముక్తి కల్పించిన ఇక్కడి బిడ్డల పోరాటాలకు ప్రతీకగా బిగిసిన పిడికిళ్లు రూపొందించారు.

Next Story