Padi Kaushik Reddy: 'కాంగ్రెస్ ఆఫీస్ పై దాడి చేస్తాం'.. పాడి కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు

by Prasad Jukanti |

పాడి కౌశిక్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు

Padi Kaushik Reddy: కాంగ్రెస్  ఆఫీస్ పై దాడి చేస్తాం.. పాడి కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కరీంనగర్ కలెక్టరేట్ లో జరిగిన ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ సమీక్షలో తాను జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ (MLA Sanjay) పై దాడి చేశాననే ప్రచారం అవాస్తవం అని తొలుత తనపై సంజయే దాడి చేశారన్నారు. తనపై మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు సంజయ్, కవ్వంపల్లి సత్యనారాయణ, మక్కన్ సింగ్ ఠాకూర్ లు దాడి చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే సంజయ్ ను ప్రశ్నిస్తే నాపై కేసులా అని నిలదీశారు. బుధవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే (CM Revanth Reddy) గతంలో స్వయంగా చెప్పారని రాబోయో రోజుల్లో గ్రామాలకు వచ్చే పార్టీ మారిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ కార్యకర్తలమంతా బరాబర్ రాళ్లతో కొడతామన్నారు. మాపై దాడులు ఆపకుంటే కాంగ్రెస్ (Congress) ఆఫీసుల మీద దాడులు చేస్తామని, కాంగ్రెస్ నాయకులను రోడ్లమీద తిరగనివ్వమన్నారు. మాపై దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోమని మేము కూడా ప్రతిదాడులు చేస్తామన్నారు. ఈ విషయాన్ని డీజీపీకి మొన్న చెప్పామని మళ్లీ చెబుతున్నానన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు.

కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు:

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపు విచారణకు రావాలని మాసబ్ ట్యాంక్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని గతంలో కౌశిక్ రెడ్డిపై నమోదైన కేసులు ఈ నోటీసులు జారీ చేశారు. అయితే రేపు కరీంనగర్ కోర్టుకు హాజరుకావల్సి ఉందని విచారణకు ఎల్లుండి హాజరవుతానని పోలీసులకు తెలిపారు. ఇటీవలే కరీంనగర్ కలెక్టరేట్ లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తో జరిగిన ఘర్షణ వ్యవహారంలో కౌశిక్ రెడ్డి అరెస్టై బెయిల్ పై బయటకు వచ్చారు. ఇంతరో పోలీసుల నుంచి మరో నోటీసు రావడం సంచలంగా మారింది.

Next Story