TS Secretariat :సెక్రటేరియట్‌ వద్ద సెక్యూరిటీ అత్యుత్సాహం.. అధికారులు, ఎంప్లాయీస్‌లో అసహనం!

by Disha Web Desk 2 |
TS Secretariat :సెక్రటేరియట్‌ వద్ద సెక్యూరిటీ అత్యుత్సాహం.. అధికారులు, ఎంప్లాయీస్‌లో అసహనం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: అడుగడుగునా ఆంక్షలతో సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. సెక్యూరిటీ సిబ్బంది అత్యుత్సాహంతో ఐఏఎస్ లు సైతం తలలు పట్టుకుంటున్నారు. కార్లను లోపలికి అనుమతించకపోవడంతో ఉన్నతాధికారులు సైతం నడుచుకుంటూ సచివాలయంలోని వెళ్తూ కనిపించారు. అంతేకాకుండా ఎంప్లాయీస్ ఒక ఫ్లోర్ నుంచి మరో ఫ్లోర్ లోకి వెళ్లేందుకు అడ్డు చెబుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

సీఎం రాకతో ఆంక్షలు

ఫస్ట్ రోజు సెక్రటేరియట్ కు సీఎం కేసీఆర్ వచ్చారు. దీంతో ఆయన వచ్చే గంట ముందు నుంచి పోలీసులు హడావుడి చేశారు. సీఎం వస్తున్న సమయంలో ఎంప్లాయీస్ ఎంట్రీ గేటును క్లోజ్ చేశారు. ఆయన బయటికి వస్తున్న సమయంలో ఇతర ఫ్లోర్ లోకి వెళ్తున్న వారిని అడ్డుకోవడంతోపాటు ఇష్టమున్నట్లు తిరగొద్దని పోలీసులు వారించినట్టు విమర్శలు వచ్చాయి. లంచ్ కోసం సౌత్ ఈస్ట్ గేటు నుంచి బయటికి వచ్చిన ఎంప్లాయీస్ ను లోనికి వెళ్లేందుకు మాత్రం అక్కడి నుంచి అనుమతించలేదు. దీంతో కిలోమీటర్ నడిచి, నార్త్ ఈస్ట్ గేటు ద్వారా లోనికి వెళ్లారు.

ఎమ్మెల్యేలకూ తప్పని ఇబ్బందులు

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై సీఎం రివ్యూ చేస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను ఆహ్వానించారు. కాని వారు లోనికి వెళ్తున్న సమయంలో పోలీసులు ఇబ్బందిపెట్టారు. ప్రజాప్రతినిధులకు మెయిన్ గేటు నుంచి ఎంట్రీ ఉంటుందని చెప్పిన పోలీసులు తీరా అక్కడికి వచ్చిన తర్వాత సౌత్ ఈస్ట్ గేటు నుంచి లోనికి వెళ్లాలని సూచించారు. దీంతో ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేస్తూ, ఎవరిని ఎక్కడి నుంచో పంపాలో తెలియదా?అని ప్రశ్నించారు.

పార్కింగ్ ఫుల్

సెక్రటేరియట్ లో సోమవారం పార్కింగ్ సమస్య తలెత్తింది. సెక్రటేరియట్ ప్రారంభోత్సవం తర్వాత తొలి పనిదినం కావడంతో ఎవరి వెహికల్స్ ఎక్కడ పార్కింగ్ చేయాలో తెలియక ఇబ్బందులు పడ్డారు. ఉదయం 11 గంటల ప్రాంతంలోనే ఐఏఎస్, సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కు కేటాయించిన నార్త్ ఈస్ట్ ఏరియా పార్కింగ్ ఫుల్ అయింది. అక్కడ మంత్రులు, ఎమ్మెల్యేల అనుచరుల కార్లను పార్కింగ్ చేశారు. దీంతో పోలీసులు ప్రిన్సిపల్ సెక్రటేరీలు సునీల్ శర్మ, శివశంకర్ కార్లను లోనికి అనుమతించపోవడంతో వారు గేటు బయట దిగి లోనికి నడుచుకుంటూ వెళ్లినట్టు ఎంప్లాయీస్ వివరించారు.

సమస్య పరిష్కారం కోసం

తొలిరోజు పోలీసుల తీరుతో ఇబ్బంది పడ్డ ఎంప్లాయీస్ తమ సమస్యలను సెక్రటేరియట్ అసోసియేషన్ నేతల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అసోసియేషన్ లీడర్లు సీఎస్, జీఏడీ పొలిటికల్ సెక్రటరీ, సిటీ పోలీసు కమిషనర్ ఆనంద్ తో మాట్లాడారు. మంగళవారం నుంచి నడుచుకుంటూ లోనికి వచ్చే ఎంప్లాయీస్ ను సౌత్ ఈస్ట్ గేటు నుంచి అనుమతించేందుకు నిర్ణయించారు. అలాగే నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ గేట్ల వద్ద ఉదయం గంటపాటు ఎంప్లాయీస్ ఎంట్రీకి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు జీఏడీ నుంచి ఒకరు, ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి ఒకరు అక్కడ సపోర్ట్ గా ఉండనున్నారు.

Read more:

TS New Secretariat: ఒక్క రాత్రి వర్షానికే బయటపడ్డ కొత్త సెక్రటేరియట్ డొల్లతనం

Next Story

Most Viewed