మా ప్రభుత్వం వరంగల్‌ను రెండో రాజధానిగా చూస్తోంది: మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

వరంగల్‌ను తమ ప్రభుత్వం రాష్ట్రానికి రెండో రాజధానిగా చూస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

మా ప్రభుత్వం వరంగల్‌ను రెండో రాజధానిగా చూస్తోంది: మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: వరంగల్‌ను తమ ప్రభుత్వం రాష్ట్రానికి రెండో రాజధానిగా చూస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. ఇవాళ ఆయన మంత్రి సీతక్క (Seethakka)తో కలిసి హనుమకొండలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉమ్మడి వరంగల్ జిల్లాలో అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నామని పేర్కొన్నారు. భద్రకాళి ఆలయ పునరుద్ధరణ, మాడవీధుల పనులు త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. ఇక కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను అభివృద్ధి చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. వరంగల్‌లో నాలుగు, డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.4 వేల కోట్ల నిధుల విడుదలకు అనుమతినిచ్చిందని తెలిపారు.

మామునూరు ఎయిర్‌పోర్టుకు సంబంధించి భూసేకరణ కార్యక్రమం రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి కలెక్టర్ చేసిన వర్కవుట్ పూర్తి అయిందని, అందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని అన్నారు. వరంగల్ పట్టణంలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కార్పొరేట్‌కు ధీటుగా ఆసుపత్రి నిర్మాణాన్ని ఎలా పూర్తి చేయాలనే అంశంపై ఇవాళ సమావేశంలో చర్చించామని అన్నారు. నాటి ప్రభుత్వం అప్పగించిన మొండి గోడలతో ఉన్న ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు అందజేస్తామని తెలిపారు. వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ నిలిచిపోయిందని, త్వరలోనే ఆ విషయంపై కూడా చర్చిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

Next Story