మరోసారి గవర్నర్ వర్సెస్ బీఆర్ఎస్ ట్విట్టర్ వార్

by Disha Web Desk 2 |
మరోసారి గవర్నర్ వర్సెస్ బీఆర్ఎస్ ట్విట్టర్ వార్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మరోసారి గవర్నర్‌ తమిళిసై, బీఆర్‌ఎస్‌ నేతల మధ్య ట్విట్టర్ వార్ హాట్‌టాపిక్‌గా మారింది. తెలంగాణకు మెడికల్‌ కాలేజీల కేటాయింపులపై ట్వీట్లు, కౌంటర్లు కలకలం రేపుతున్నాయి. ఆదివారం తెలంగాణ మెడికల్ కాలేజీలపై గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ సెటైరికల్ ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం గత 8 సంవత్సరాలలో దేశంలో దాదాపు 300 నుండి 700 కాలేజీలను నిర్మించిందని..పీఎంఎస్‌ఎస్‌వై పథకంపై తమిళిసై ప్రశంసలు కురింపించారు. ఈ నేపథ్యంలో తమిళిసై ట్వీట్‌కి ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ మరి తెలంగాణకు ఎన్ని మెడికల్ కాలేజీలు ఇచ్చారు? అని ప్రశ్నించాడు. దీనికి తమిళిసై స్పందిస్తూ పీఎంఎస్‌ఎస్‌వై పథకం కింద ప్రతి రాష్ట్రం కొత్త మెడ్ కాలేజీల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు..కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని పిలిందన్నారు.

కానీ, కేంద్ర ఆరోగ్య మంత్రి చెప్పినట్టుగా సకాలంలో దరఖాస్తు చేసుకోవడంలో తెలంగాణ విఫలమైందని గవర్నర్ విమర్శించారు. తెలంగాణకు ఒకే ఏడాదిలో 11 మెడికల్ కాలేజీలు వచ్చాయని...కానీ, వారు ఆలస్యంగా నిద్రలేస్తే ఎలా అంటూ గవర్నర్ ఎద్దేవా చేశారు. దీనికి స్పందించిన బీఆర్‌ఎస్‌ అంతే స్థాయిలో స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చింది. గవర్నర్ వ్యాఖ్యలపై రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గవర్నర్ ట్వీట్లు ప్రచారం తప్ప మరేమీ కాదని, అలాంటి గౌరవనీయమైన పదవిని చేపట్టే హక్కు ఆమెకు లేదన్నారు. దీంతో, మరోసారి గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

కాగా, ఇటీవల పెండింగ్ బిల్లుల అంశంలోనూ గవర్నర్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడిచింది. పెండింగ్‌ బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా...ఈ అంశంపై స్పందించిన గవర్నర్, సీఎస్‌కి చురకలంటిస్తూ ట్వీట్లు చేశారు. ఢిల్లీ కంటే రాజ్‌భవన్ దూరమా? అంటూ కామెంట్స్ చేశారు. సరైన పద్ధతిలో వచ్చి మాట్లాడి సెటిల్ చేసుకుంటే సరిపోయేది కదా అని అన్నారు. ఈ విషయంలో గవర్నర్ తీరుపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. గవర్నర్‌కు బానిసలు ఎవరూ లేరని, బిల్లుల ఆమోదానికి ఫైరవీలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

Next Story

Most Viewed