పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి: టీఎస్‌యూటీఎఫ్ డిమాండ్

by Disha Web Desk 19 |
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి: టీఎస్‌యూటీఎఫ్ డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యోగుల సామాజిక భద్రతకు ముప్పుగా ఉన్న సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్దరించాల్సిందేనని ఎస్టీఎఫ్ఐ ఉపాధ్యక్షుడు, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి డిమాండ్ చేశారు. యూటీఎఫ్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అప్పారి వెంకటస్వామి 22వ వర్ధంతి సభ మంగళవారం సంఘం రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు కె జంగయ్య అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా చావ రవి మాట్లాడుతూ.. పాత పెన్షన్ విధానం సాధన కోరుతూ జరిగే నిరసన ప్రదర్శనల్లో ఉద్యోగులు పాల్గొంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం బెదిరించడాన్ని టీఎస్ యూటీఎఫ్ తీవ్రంగా ఖండించిందన్నారు. సమస్యలపై నిరసన తెలపడం, ప్రజాస్వామ్యయుతంగా పోరాడటం ఉద్యోగుల న్యాయమైన హక్కని, దానిని కాలరాచే అధికారం కేంద్రానికి లేదని స్పష్టం చేశారు.

పాత పెన్షన్​ విధానాన్ని(ఓపీఎస్​) పునరుద్ధరించాలంటూ జరగుతున్న నిరసనల్లో ఉద్యోగులు పాల్గొనకూడదని కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, శిక్షణా విభాగం ఆదేశాలు ఇవ్వడం పైగా ఈ ఆదేశాలను అతిక్రమిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించడం అప్రజాస్వామికమన్నారు. కేంద్ర ప్రభుత్వ బెదిరిపులకు భయపడకుండా పాత పెన్షన్ సాధనే లక్ష్యంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు.

ఉద్యోగుల ఉద్యమానికి తలొగ్గి ఇప్పటికే నాలుగు రాష్ట్రాలు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాయని, పీఎఫ్ ఆర్డీఏను రద్దు చేసి దేశవ్యాప్తంగా పాత పెన్షన్ పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. తొలుత వెంకట స్వామి చిత్రపటానికి పూలమాల అలంకరించి నివాళులర్పించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ఏ సింహాచలం, రాష్ట్ర కమిటీ సభ్యులు శారద, రాజారావు, శ్యామ్ సుందర్, సైదులు, నరసింహారెడ్డి, జిల్లా నాయకులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed