మునుగోడుపై నర్సుల నజర్.. టీఆర్ఎస్‌కు షాకిచ్చేలా పక్కా ప్లాన్!

by Disha Web Desk |
మునుగోడుపై నర్సుల నజర్.. టీఆర్ఎస్‌కు షాకిచ్చేలా పక్కా ప్లాన్!
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని నర్సులంతా ప్రభుత్వంపై తిరుగుబాటును ప్రారంభించారు. గతంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చకపోవడంతో నర్సులు రగిలిపోతున్నారు. గత ఏడేళ్ల నుంచి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నా.. సర్కార్​నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో టీఆర్ఎస్​ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని నర్సులంతా ఏకమయ్యారు. మునుగోడు ఉప ఎన్నిక నుంచే టీఆర్ఎస్​పతనానికి కృషి చేయాలని తీర్మానించారు. ప్రతీ ఇంటికి తిరిగి సర్కార్ చేస్తున్న మోసాలను వివరించాలని నర్సులు ప్లాన్​చేయబోతున్నారు. ఆశాలు, ఏఎన్ఎంలు, స్టాఫ్​నర్సులు, ఇతర నర్సింగ్ అనుబంధ స్టాఫ్​అంతా ఏకమై సర్కార్​పై యుద్ధం చేసేందుకు రెడీ అయ్యారు. అన్ని నర్సింగ్​యూనియన్లంతా నగరంలో రహస్య మీటింగ్‌ను కూడా ఏర్పాటు చేశారు. మునుగోడులో సుమారు రౌండ్‌కు 2 వేల మంది నర్సులు ప్రచారం చేయనున్నారు. దీంతో దాదాపు పది వేల ఓట్లపై ప్రభావం పడే ఛాన్స్​ఉన్నదని స్థానిక లీడర్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సర్కార్‌కు గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని, అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని నర్సింగ్ అసోసియేషన్​యూనియన్​నేతల్లో ఒకరు తెలిపారు. ఈ ప్రభుత్వానికి నర్సుల ఉసురు కచ్చితంగా తగులుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నర్సుల సమస్యలు తీరేదెన్నడూ..?

రాష్ట్రంలో ఆసుపత్రులు, బెడ్లు పెంచుతున్నా, అందుకు అనుగుణంగా అవసరమైన నర్సింగ్​స్టాఫ్‌ను ప్రభుత్వం నియమించడం లేదు. దీంతో రెండు మూడు వార్డులకు ఒకే స్టాఫ్​నర్సు మానిటరింగ్​చేయాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక ప్రమోషన్ల అంశాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసింది. సుమారు 20 నుంచి 25 ఏళ్లు పనిచేసినా హెడ్​నర్సులకు పదోన్నతులు కలగడం లేదు. ఇక ఆసుపత్రుల్లో నర్సింగ్​స్టేషన్లు, మౌలిక వసతులు, క్వాలిటీ యూనిఫామ్, జీతాలు పెంపు వంటి విషయాలను ప్రభుత్వం మరిచిపోయింది. ఇక ఆర్థిక పరమైన అంశాలతో సంబంధం లేని సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించలేకపోతున్నది. వివిధ కేటగిరీల్లో ఉన్న నర్సులను, నర్సింగ్​ఆఫీసర్లుగా హోదాను మార్చాలని 2016లోనే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వుల్లో తేల్చి చెప్పింది. దీంతో నర్సులను చిన్నచూపు చూడటం కొంత వరకు తగ్గుతుందని కేంద్రం అభిప్రాయాన్ని వ్యక్త పరిచింది. ఇప్పటికే కేంద్రం ఆధీనంలో ఉన్న ఈఎస్ఐ, రైల్వే, ఆర్మీ తదితర ఆసుపత్రుల్లో దీన్ని సమర్ధవంతంగా అమలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న ఆసుపత్రుల్లోనూ హోదాను మార్చాలని కేంద్రం నొక్కి చెప్పింది. కానీ ఇప్పటి వరకు ఆ ఉత్తర్వులు అమల్లోకి రాలేదు. స్టాఫ్ నర్స్ నుండి నర్సింగ్ ఆఫీసర్‌గా హోదా మారిస్తే రాష్ట్ర ఖజానా మీద నయా పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని కేంద్రం ఆ మార్గదర్శకాల్లో స్పష్టంగా చెప్పింది. కానీ అధికారులు ఆ దిశగా అడుగులు వేయడం లేదని నర్సులు మండిపడుతున్నారు.

డాక్టర్లకు ఒకలా.. నర్సులకు మరోలా..!

డాక్టర్లతో పాటు కలసి పనిచేస్తున్నా ఆసుపత్రుల్లో తమకు అన్యాయం జరుగుతుందని నర్సులు గోడును వెల్లబోసుకుంటున్నారు. ఆసుపత్రుల్లో డాక్టర్లకు ఇచ్చినట్టు తమకు ప్రత్యేక గదులు, సౌకర్యాలను కల్పించడం లేదని మండిపడుతున్నారు. కనీసం డ్రెస్‌లు మార్చుకోవడానికి కూడా సరైన రూమ్‌లు లేక ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించారు. ఆసుపత్రి అధికారులకు కూడా నర్సులపై వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇవన్నీ పరిష్కారం కావాలంటే నర్సింగ్ డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదని నర్సులు నొక్కి చెబుతున్నారు. ఆ తర్వాత కౌన్సిల్​ఎన్నికలు నిర్వహించాలంటున్నారు. అప్పుడే నర్సుల తమ గొంతు వినిపించేందుకు సులువుగా ఉంటుందని నర్సింగ్​అసోసియేషన్లు స్పష్టం చేస్తున్నాయి.

Also Read : సారూ.. జీతం రాలే.. ఉద్యోగులకు ఇంకా జమ కాని వేతనాలు

Next Story