బిగ్ న్యూస్: ఆ 35 మంది BRS సిట్టింగ్‌లకు ‘‘నో టికెట్’’.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌లో భారీ మార్పులు?!

by Disha Web Desk 19 |
బిగ్ న్యూస్: ఆ 35 మంది BRS సిట్టింగ్‌లకు ‘‘నో టికెట్’’.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌లో భారీ మార్పులు?!
X

రెండు రోజుల క్రితం నిర్వహించిన బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ ఆపార్టీ సిట్టింగుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వబోమని గులాబీ బాస్ స్పష్టం చేయడంతో సిట్టింగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. కేసీఆర్ వద్ద ఉన్న జాబితాలో ఎవరెవరి పేర్లు ఉన్నాయన్నది సస్పెన్స్‌గా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వచ్చే ఎన్నికల్లో భారీగా మార్పులు చోటుచేసుకుంటాయని టాక్. సీఎం సొంత జిల్లాలోనూ పలువురి పేర్లు ఆ జాబితాలో ఉన్నట్టు సమాచారం. మొత్తంగా ఆ లిస్టులో బహుజన నేతలే అధికంగా ఉన్నారని తెలుస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: పని తీరు సరిగా లేని ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చేదిలేదని రెండు రోజుల క్రితం సీఎం కేసీఆర్ స్పష్టం చేయడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు గుబులు పట్టుకున్నది. ఇప్పటికిప్పుడు ఆ లిస్టును బహిర్గతం చేయకుండా కొంత కాలం పాటు రహస్యంగా ఉంచాలని సీఎం భావిస్తున్నారు. టికెట్ రాదని ముందస్తుగా తెలిస్తే వారు ఇతర పార్టీలో చేరే చాన్స్ ఉన్నదని ఆలోచిస్తున్న సీఎం.. ఎన్నికల సమయానికి దానికి బహిర్గత పరచాలని అనుకుంటున్నట్టు తెలుస్తున్నది. ఆ లిస్టులో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి అత్యధిక మంది ఉన్నట్టు సమాచారం. సీఎం సొంత జిల్లాల్లోనూ పలువురికి ఈ సారి భంగపాటు తప్పదనే టికెట్లు దక్కకపోవచ్చనే ప్రచారం జరుగుతున్నది. సీఎం సొంత జిల్లా నుంచీ ముగ్గురు ఎమ్మెల్యేలకు ఈసారి మొండిచేయే దక్కనున్నదనే టాక్ ఉన్నది.

ఎస్సీ, ఎస్టీలే ఎక్కువ

తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎస్టీ, 18 మంది ఎస్సీ ఎమ్మెల్యేలున్నారు. రాబోయే ఎన్నికల్లో వీరిలో 45 శాతం మంది ఎమ్మెల్యేలను మార్చాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు తెలిసింది. వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేయడంతో పాటు, రానున్న ఎన్నికలకు సిద్ధం కావాలని వారికి ఇప్పటికే సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలోని ఎస్టీ ఎమ్మెల్యేలపై పలు ఫిర్యాదులు వచ్చాయని, వారికి తిరిగి టికెట్లు కట్టబెడితే ఓటమి ఖాయమని సీఎం సర్వేలో తేలినట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

10 మంది బీసీలకు చుక్కెదురు

ఈ సారి సుమారు 10 మంది బీసీ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వరని తెలుస్తున్నది. అయితే అదే సామాజిక వర్గానికి చెందిన వారికి తిరిగి టిక్కెట్లు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఇద్దరు బీసీ ఎమ్మెల్యేలకు ఆరోగ్యం సహకరించడం లేదు. ఈ సారి వారిని పక్కన పెట్టి, ఎమ్మెల్సీ పదవులు ఇస్తారని ప్రచారం సాగుతున్నది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఇద్దరు బీసీ ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేకపోవడంతో వారిని కొనసాగించడమా? లేక కొత్త వారికి అవకాశం ఇవ్వడమా? అనే విషయంపై సీఎం ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.

వెలమలో ముగ్గురు అవుట్

అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి 10 మంది వెలమ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ముగ్గురిని తప్పించే చాన్స్ ఉన్నట్టు సమాచారం. వేములవాడ నుంచి చెన్నంనేని రమేశ్ వారసత్వంపై కోర్టులో వివాదం నడుస్తున్నది. మరోసారి ఆయనకే టికెట్ ఇస్తారా? లేదా? అనేది ఆసక్తిగా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే వయోభారంతో రానున్న ఎన్నికల్లో పోటీ చేయలేనని, తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నట్టు తెలిసింది. అదే ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు ఈ సారి తిరిగి టికెట్ ఇస్తే.. విపక్ష అభ్యర్థికి గట్టి పోటీ ఇవ్వడం కష్టమని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తున్నది. అందుకని ఆ స్థానంలో అదే సామాజిక వర్గం నుంచి మరో అభ్యర్థిని బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తున్నది.

‘రెడ్డీస్‌’లో 6 నుంచి 7 మందికు నో టికెట్

బీఆర్ఎస్‌కు 36 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ఆరేడు మందిని ఈ సారి తప్పిస్తారని తెలుస్తున్నది. కొందరిపై అవినీతి ఆరోపణలు ఉండటం ప్రధాన కారణమని సమాచారం. ఇందులో ఇద్దరు ఎమ్మెల్యేలకు ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల వారి స్థానాల్లో కొత్త వారిని ఎంపిక చేసే ప్రయత్నాల్లో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తున్నది.

వరంగల్ నుంచే ఎక్కువ మంది

కేసీఆర్ తయారు చేసిన బ్లాక్ లిస్టులో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తున్నది. అక్కడి నుంచి అత్యధిక మందికి ఈ సారి టికెట్లు దక్కకపోవచ్చనే ప్రచారం జరుగుతున్నది. సీఎం సొంత జిల్లా నుంచీ ముగ్గురు ఎమ్మెల్యేలకు ఈసారి మొండిచేయే దక్కనున్నదనే టాక్ ఉన్నది.

ఇప్పుడే బహిర్గతం చేయొద్దని సీఎం భావన

తాను తయారు చేసిన లిస్టును ఇప్పుడే బహిర్గతం చేయొద్దని సీఎం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ముందస్తుగా టిక్కెట్లు రావని తెలిస్తే సదరు ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం ఉంటుందని ఆయనలో భయం పట్టుకున్నట్టు తెలుస్తున్నది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పని తీరు సరిగా లేని వారిని పిలిచి రానున్న ఎలక్షన్స్‌లో ఎందుకు టిక్కెట్ ఇవ్వడం లేదనే విషయాన్ని చెబుతారనే టాక్ వినిపిస్తున్నది.

పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేల స్థానాలు (అంచనా)

ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యే స్థానాలు

వరంగల్ 4 నుంచి 5 స్థానాలు

ఖమ్మం 3 స్థానాలు

అదిలాబాద్ 3 స్థానాలు

నల్లగొండ 4 స్థానాలు

రంగారెడ్డి 3 స్థానాలు

గ్రేటర్ హైదరాబాద్ 3 స్థానాలు

మహబూబ్‌నగర్ 2 నుంచి 3 స్థానాలు

మెదక్ 3 స్థానాలు

నిజామాబాద్ 2 స్థానాలు

కరీంనగర్ 4 స్థానాలు

Also Read..

ఒకే టర్ములో మూడు సార్లు.. మంత్రులకు వింత అనుభవం

బిగ్ న్యూస్: ‘‘గులాబీ’’ పండుగలా నూతన సెక్రటేరియట్ ఓపెనింగ్.. ప్రతిపక్షాల హాజరుపై తీవ్ర ఉత్కంఠ!

Next Story