- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అందుకు సిద్దమా? భట్టి విక్రమార్కకు కవిత చాలెంజ్
సింగరేణిని కాపాడుకునేందుకు మరో ఉద్యమానికి సిద్ధమని కల్వకుంట్ల కవిత ప్రకటించారు. కార్మికులపై విచారణ విడ్డూరమని, ప్రభుత్వ అవినీతిపై తేల్చాలని డిమాండ్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: సింగరేణిని కాపాడుకునేందుకు మరో ఉద్యమానికి సిద్ధమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. డిపెండెంట్ కార్మికుల నియామకాలపై విజిలెన్స్, ఏసీబీ విచారణ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. కార్మికుల నియామకాలపై కాదు మీ ప్రభుత్వ అవినీతిపై విచారణకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. ఇవాళ బంజారాహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో సేవ్ సింగరేణి రౌండ్ టేబుల్ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రం లోనైనా సహజ వనరులను అక్కడి ప్రజలకు ఉపయోగపడే విధంగా వాడేందుకు ప్రయత్నం చేస్తారు. ప్రకృతి మనకు బొగ్గు వరంగా ఇచ్చింది. దీన్ని ప్రజలకు మేలు చేసే విధంగా వాడేలా ప్రభుత్వం ఉండాలి. కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండేవో...ఇప్పుడు అలాగే పరిస్థితులు ఉన్నాయని ఆరోపించారు.
వాళ్ల మీద కాంగ్రెస్ కన్ను:
అప్పుడు మన తెలంగాణ వాళ్లు దుబాయి, బొంబాయి, బొగ్గు బాయి అంటూ వెళ్లేవారు. మనకు తినటానికి తిండి లేని సమయంలో కార్మికులకు తిండి పెట్టిన సింగరేణిని మనం సిరులవేణి అని తలుచుకుంటాం. కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి సింగరేణితో ఎలాంటి భావోద్వేగం లేదు. అందుకే కార్మికుల సమస్యలు వారికి తెలియటం లేదన్నారు. సింగరేణిలో నుంచి బొగ్గు తీసేందుకు కార్మికులు ప్రాణాలను ఫణంగా పెడుతున్నారని అక్కడి గాలి పీల్చుకుంటే ఊపిరితిత్తుల్లోకి వెళ్లి బ్లాక్ అవుతుంది. కాళ్లు వంకర అయ్యే పరిస్థితి ఉంటుంది. కాలే కడుపుతో పోయి కాలే బొగ్గు తీసుకొచ్చే వాళ్లు మన కార్మికులు. కానీ ఈ విషయం ఏమాత్రం తెలియని ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉండటంతో వారికి మన కష్టాలు తెలియటం లేదన్నారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత మనం కొంతమందికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చుకున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో నష్టపోయాం. అందుకే కొన్ని సడలింపులు ఇచ్చుకొని 20 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చుకున్నాం. దీంతో ఒక 20 వేల మంది భద్రతతో బతుకుతున్నారు. ఇప్పుడు వాళ్ల మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కన్ను పడిందని ఆరోపోంచారు.
ఏ నాయకుడు బాగుపడలేదు:
ఈ ఉద్యోగాలు ఎలా ఇచ్చారన్న దానిపై ఎంక్వైయిరీ వేస్తారంట? వాళ్లకు ఉద్యోగాలు ఎందుకు ఇచ్చామన్న కారణం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలుసుకోవటం లేదు. ఆనాటి గవర్నమెంట్ పాలసీ అది. దానిపై ఎలా ఎంక్వైరీ చేస్తారు? సింగరేణి తో పెట్టుకున్న ఏ నాయకుడు కూడా బాగుపడలేదని సింగరేణి కార్మికులతో పెట్టుకోవద్దని భట్టిని నేను హెచ్చరిస్తున్నానన్నారు. ఓబీ కాంట్రాక్టులు, డీజిల్ కుంభకోణాలు, కరెప్ట్ నాయకులు, అధికారుల మీద ముందు ఎంక్వైయిరీ వేయండి. కష్టపడి చెమటోడ్చే కార్మికుల మీద ఎంక్వైయిరీ లు వేయటం ఏంటీ? సింగరేణి బొగ్గు మింగి అవినీతికి పాల్పడిన వాళ్ల మీద విచారణ జరపాలన్నారు. భట్టి మీద నాకు కొంచెం గౌరవం ఉండేది. కానీ సింగరేణి కార్మికుల మీద మొన్న అసెంబ్లీలో ఆయన మాట్లాడిన మాటలు విన్నాక చాలా బాధ అనిపించిందన్నారు.
ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు:
కార్మికుల గురించి భట్టి మాట్లాడిన అంశాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని కార్మికుల మీద ఎంక్వైయిరీ వేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని హెచ్చరించారు. డీజిల్ కుంభకోణం ద్వారా 250 కోట్లు, నిబంధనల ఉల్లంఘన కారణంగా 74 కోట్లు, లీకేజీ ల కారణంగా 24 కోట్లు, అదనపు వసూళ్లు చేయలేక 1078 కోట్లు సంస్థకు నష్టం చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని కాగ్ చెబుతోందని దీని మీద ముందు ఎంక్వైయిరీ వేయాలన్నారు. మీ చేతగాని తనంతో సింగరేణికి నష్టం చేస్తున్నారని ఆరోపించారు.
కిషన్ రెడ్డి వెళ్లి మాట్లాడగానే మారుతుంది:
కిషన్ రెడ్డి వెళ్లి మాట్లాడగానే సంస్థలో బొగ్గు ప్రొడక్షన్ మారుతుంది. చెమట చిందించి లాభాలు తెస్తున్న కార్మికులకు లాభాల్లో వాటా ఇస్తే అభ్యంతరం ఏంటీ? స్వయంప్రతిపత్తి కలిగిన సింగరేణికి...ప్రభుత్వం పెట్టే రూల్స్ అప్లయ్ కావు. బొగ్గు, కరెంట్ బకాయిలు కలిపి సింగరేణికి ఈ ప్రభుత్వం 47 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. వాటిని చెల్లించకపోవటంతో కార్మికుల సేప్టీకి, వారి జీతాలకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజస్థాన్ తో సోలార్ ఒప్పందం, అదే విధంగా చిన్న కంపెనీతో లిథియం రిఫైనరీ అంటూ ఒప్పందం కుదుర్చుకున్నారు. సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలు యువ కార్మికులకు కూడా తెలియాలి. లిథియం రిఫైనరీ కోసం అల్ట్ మిన్ అనే చిన్న సంస్థతో సింగరేణి 2250 కోట్ల ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థను 2023 లో ఏర్పాటు చేశారు. ఆ సంస్థ మొత్తం ఆదాయం రూ. 27 లక్షలు మాత్రమే. అలాంటి చిన్న కంపెనీతో సింగరేణి 2250 కోట్ల ఒప్పందం ఎలా చేసుకుంటుంది? అని నిలదీశారు.
ఈ ఒప్పందాల విషయం చెప్పండి?
సింగరేణి విషయంలో సిన్సియార్ ఉంటే ముందు ఈ ఒప్పందాల విషయం చెప్పండి? అల్ట్ మిన్ కంపెనీ విషయంలో బ్యాంక్ గ్యారంటీలు ఎవరివీ? సింగరేణి వాటా ఎంత? ఆ సంస్థను ఎందుకు పార్ట్ నర్గా చేశారు? ప్రపంచ వ్యాప్తంగా లిథియం రిపైనరీలు పెట్టిన పెద్ద సంస్థలే నష్టాల్లో ఉన్నాయి. అలాంటి ఊరు, పేరు లేని సంస్థతో ఈ ఒప్పందం ఎందుకు చేసుకున్నారన్నారు. రాజస్థాన్తో 11 వేల కోట్ల ఒప్పందంలో సింగరేణి వాటా 72 వేల కోట్లు అంటున్నారు. ఒక మెగావాట్ ఉత్పత్తికి అయ్యే దాని కన్నా మూడు రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. అవుట్ రైట్గా ఈ ఒప్పందంలో అవినీతి జరిగింది. దీనిపై మేము లెటర్ రాస్తాం. ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న వారి పేర్లు, అవినీతి బయట పెట్టాలన్నారు. మెడికల్ బోర్డును పాత పద్దతిలో నిర్వహించాలని గతంలో మెడికల్ బోర్డు పెట్టి మళ్లీ నిర్వహించటం లేదున్నారు.
జాగృతి మద్దతు:
విజిలెన్స్ కేసుల విచారణను పూర్తి చేయాలి. ఇన్ కం ట్యాక్స్ సింగరేణి కార్మికులు ఉద్యోగులకు ఉండొద్దు. దీనిపై నేను పార్లమెంట్ లో 2015 లోనే మాట్లాడాను. ఇన్ కం ట్యాక్స్ మినహాయింపులు ఇస్తే 12 వేల నుంచి 80 వేల వరకు ఉద్యోగులకు, కార్మికులకు మేలు జరుగుతుంది. ఇది లైఫ్ రిస్క్ సెక్టార్ కావటంతోనే ఇన్ కం ట్యాక్స్ మినహాయింపు అడుగుతున్నాం. వైద్య పరీక్షల్లో పాసైన 350 మంది అభ్యర్థులకు పోస్టులు ఇవ్వాలి. ఖాళీగా ఉన్న క్లర్క్ పోస్టులను నింపాలన్నారు. సంస్థకు ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని అలియాస్ పేర్ల విషయంలో గతంలో ఉన్న విధంగానే నిబంధనలు ఉండాలన్నారు. హెల్త్ విషయంలో నిమ్స్ రేట్లను కాకుండా కేంద్రానికి సంబంధించి సీజీహెచ్ఎంస్ రేట్లు అప్లయ్ చేయాలని సింగరేణి విముక్తి కోసం అవసరమైతే మరో తెలంగాణ ఉద్యమం మాదిరి ఉద్యమం చేస్తామన్నారు. హెచ్ఎంఎస్ చేసే ఉద్యమానికి జాగృతి తరఫున పూర్తి మద్దతు తెలుపుతున్నామన్నారు.






