మూడోసారి ప్రధానిగా మోదీ కావొద్దని కోరుకుంటాం : MIM chief, MP Asaduddin Owaisi

by Disha Web Desk 1 |
మూడోసారి ప్రధానిగా మోదీ కావొద్దని కోరుకుంటాం : MIM chief, MP Asaduddin Owaisi
X

పాట్నాలో జరిగిన ప్రతిపక్షాల సమావేశాలకు ఎంఐఎంను ఆహ్వానించ లేదు

తెలంగాణలో ఎంఐఎం కూడా ప్రత్యామ్నాయమే

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో ప్రజల జీవన ప్రమాణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ప్రధానంగా దళితులు, మైనార్టీలపై దాడులు పెరిగాయని, మరోసారి ప్రధానిగా మోదీ కావొద్దని కోరుకుంటామని ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అసురుద్దీన్ ఓవైసీ మీడియాతో మాట్లాడుతూ.. బిజెపి గెలుస్తుందని ప్రతిసారి ఎంఐఎంను దానిపై బూచిగా చూపుతున్నారని ఆయన ఆరోపించారు.

2019 ఎన్నికల్లో బీజేపీ 51 శాతం ఓట్లను మెజార్టీని సాధించిందని దానికి ఎవరు కారణమని ప్రశ్నించారు. దేశంలో మోదీని గద్దె దించేందకు గాను పాట్నాలో జరిగిన ప్రతిపక్షాల సమావేశానికి తమ పార్టీకి ఆహ్వానం అందలేదని అసదుద్దీన్ తెలిపారు. తమ పార్టీకి ఆహ్వానం అందితే ఖచ్చితంగా మోదీ వ్యతిరేక శక్తులతో కలిసి పని చేసే విషయంపై క్లారిటీ ఇచ్చేవాళ్లమని ఆయన స్పష్టం చేశారు. 2014 వరకు యూపీఏతో కలిసి పని చేశామని, నాటి చివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తీరు వల్లే తాము యూపీఏ నుంచి బయటకు వచ్చామని గుర్తు చేశారు.

బీఆర్ఎస్ అధినేతగా సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడైనా పోటీ చేసే హక్కును ప్రజాస్వామ్యం కల్పించిందన్నారు. హైదరాబాద్ లో గులాబీ పార్టీ పోటీ చేస్తే ఆహ్వానిస్తామని అడ్డుకొనడానికి తాము ఎవరమని అన్నారు. ఎంఐఎం పార్టీ దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ పోటీ చేస్తుందని, ఇటీవల ఉత్తరప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరట్, బులంద్ షహర్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లోనూ గెలిచి తమ సత్తా చాటామని తెలిపారు. మహారాష్ట్రలోను తమ పార్టీకి ఎమ్మెల్యేతో పాటు ఓ ఎంపీ కూడా ఉన్నారని గుర్తు చేశారు.

తెలంగాణలో రాబోయే ఎన్నికలు చాలా క్లిష్టంగా ఉంటాయని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో హంగ్ వస్తుందన్న ప్రశ్నపై అసదుద్దీన్ ఓవైసీ బ్యాలెట్ ఓట్లతో ఆ తీర్పును ప్రజలే చెబుతారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ బీజేపీలే కాదు తాము కూడా ప్రత్యామ్నాయమేనని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ ఎవరితో కలిసి పని చేస్తుంది.. ప్రభుత్వ ఏర్పాటులో ఏ పార్టీకి ఎవరికి మద్దతిస్తుందని ప్రశ్నించగా.. తమ బ్యాటింగ్ తామే చేసుకుంటామని, గెలిచిన తర్వాత ఎవరిని అవుట్ చేయాలో అప్పుడే నిర్ణయిస్తామని ఓవైసీ తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో పోటీ విషయంపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నామన్నారు. అందుకే ఇటీవలే మహారాష్ట్రలో కూడా పర్యటించట్లుగా ఆయన తెలిపారు. తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు ఎంఐఎం కారణమంటే ఒప్పుకోమని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, సికింద్రాబాద్ లో గెలవడానికి ఎవరు కారణమో ప్రజలకు తెలుసని ఆయన స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో పోటీ విషయంపై లీడర్లతో కార్యకర్తలతో చర్చలు జరుపుతున్నామని అన్నారు. సీఎం కేసీఆర్ హయాంలోనూ ముస్లింలకు రావాల్సిన సంక్షేమ ఫలాల నిధులు గత రెండేళ్లుగా రూ.4వేల కోట్లు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో రూ.2వేల కోట్లతో దేవాలయాలను నిర్మించిన కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, అదేవిధంగా సచివాలయంలో మసీదుల నిర్మాణంతో పాటు, సీఎం కేసీఆర్ ప్రకటించిన మైనార్టీ ఎక్సలెన్స్ సెంటర్ నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని కోరారు. రాష్ట్రంలో ఎనిమిది లక్షల మైనార్టీల కుటుంబాలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నాయని వారికి మైనార్టీ బంధు ఇవ్వాలని అని అన్నారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ తమ పార్టీ కౌన్సిలర్ల పై నమోదు చేయించిన కేసులు అన్నీ నిరాధారమని ఆరోపించారు.

2014-2019 ఎన్నికల్లో ఎంపీగా కల్వకుంట్ల కవిత, బోధన్ ఎమ్మెల్యే గా షకీల్ ఆమెర్ గెలుపుకు ఎంఐఎం కృషి చేసిందని తెలిపారు.అందులో కౌన్సిలర్లు, కార్యకర్తల పాత్ర కూడా ఉందని బీఆర్ఎస్ నాయకులు మర్చిపోవొద్దన్నారు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా వార్డుల్లో పర్యటించిన ఎమ్మెల్యేను నిధులు అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే హత్యాయత్నం కేసులు పెట్టడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. బోధన్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బ్యాలెట్ ఓటు ద్వారా ఎమ్మెల్యే వైఖరికి సమాధానం చెబుతామన్నారు.



Next Story