అర్బన్ పార్క్ పనులు సకాలంలో పూర్తి చేయాలి: కలెక్టర్ సి. నారాయణ రెడ్డి

by Web Desk |
అర్బన్ పార్క్ పనులు సకాలంలో పూర్తి చేయాలి: కలెక్టర్ సి. నారాయణ రెడ్డి
X

దిశ, మాక్లూర్: ప్రజల ఆహ్లాదం కోసం ఏర్పాటు చేస్తున్న అర్బన్ పార్క్ పనులు సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) చిత్ర మిశ్రా, జిల్లా అటవీ శాఖ అధికారి సునీల్ లతో కలిసి నిజామాబాద్ శివారులోని చిన్నపూర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఏర్పాటు చేస్తున్న అర్బన్ పార్క్‌ను సందర్శించారు. ఇక్కడ చేపడుతున్న పనుల ప్రగతి గురించి డీఎఫ్ఓ కలెక్టర్ కు తెలియజేశారు. అవసరమైన చోట్ల చెక్ డ్యాంలు నిర్మిస్తున్నామని, తొమ్మిది సర్కులేషన్ ట్యాంకుల పనులు చురుగ్గా జరుగుతున్నాయన్నారు. వాటి వద్ద సోలార్ మోటార్ పంపులు ఏర్పాటు చేయిస్తున్నామని తెలిపారు. సందర్శకుల సౌకర్యార్థం 25 లక్షల వ్యయంతో లేక్ వ్యూ నిర్మాణం చేపడుతున్నామని వివరించారు.

పై పనులను కలెక్టర్ స్వయంగా పరిశీలించిన సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. లేక్ వ్యూ పనులు వచ్చే ఏప్రిల్ వరకు పూర్తి చేయాలన్నారు. మిగతా అన్ని పనులు కూడా త్వరితగతిన చేపడుతూ.. జూన్ నెల నాటికి అర్బన్ పార్క్‌ను ప్రారంభోత్సవం కోసం సిద్ధం చేయాలని సూచించారు. ట్యాంకులు, చెక్ డ్యామ్ లలో ఎల్లప్పుడూ నీటి నిల్వలు ఉండేలా చూసుకోవాలని, పార్క్ పచ్చదనంతో అలరారినప్పుడే సందర్శకులకు ఆహ్లదకరంగా ఉంటుందన్నారు. నిధులు అందుబాటులో ఉన్నందున విరామం లేకుండా ఏకబిగిన పనులు జరిపిస్తూ గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. నాణ్యతతో పనులు జరిగేలా చూడాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. ఏదైనా సమస్య వస్తే దానిని పరిష్కరించుకుంటు ముందుకు వెళ్లాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు నిలిచి పోకూడదని అన్నారు.

హరితహారం మొక్కల పరిశీలన

కాగా, 63వ జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన హరితహారం మొక్కలను కలెక్టర్ శనివారం పరిశీలించారు. మామిడిపల్లి, అంకాపూర్, చేపూర్, లక్కోరా, మోర్తాడ్, కమ్మరపల్లి తదితర ప్రాంతాల్లో గతేడాది నాటిన మొక్కలు ఎలా ఉన్నాయి, వాటి నిర్వహణ ఎలా కొనసాగిస్తున్నారన్నది కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపారు. ఒక్క మొక్క కూడా చనిపోకూడదని, ఒకవేళ ఏదైనా కారణం చేత మొక్క పాడైపోతే దాని స్థానంలో కొత్త మొక్కలు నాటాలని సూచించారు. మొక్కల చుట్టూ కనీసం 12 లీటర్ల నీరు పట్టేలా సాసరింగ్ చేయించాలని, నెలకు పది పర్యాయాలు తగ్గకుండా నీటిని అందించాలని ఆదేశించారు. వచ్చే నాలుగు నెలల పాటు మొక్కల పట్ల శ్రద్ధ చూపిస్తూ వాటిని కాపాడు కోగలిగితే పూర్తి స్థాయిలో సంరక్షించబడతాయని పేర్కొన్నారు.

అవెన్యూ ప్లాంటేషన్ సక్రమంగా నిర్వహిస్తే, జాతీయ రహదారి మీదుగా ప్రయాణం సాగించే వారికి ఎంతో ఆహ్లాదం గా కనిపిస్తుందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని మొక్కల నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ అధికారులకు హితవు పలికారు. నాలుగైదు రోజుల్లో పనులను చక్కదిద్దుకోవాలని, తాను మళ్ళీ పరిశీలన కోసం వస్తానని పేర్కొన్నారు. ఆయన వెంట మాక్లూర్ మండల పరిషత్ అధికారి తోఫారం శ్రీనివాస్, తహశీల్దార్ శంకర్, ఫారెస్ట్ ఎస్సై సౌమ్య, ఉపాధి హమీ అధికారులు, మామిడిపల్లి సర్పంచ్ మల్లారెడ్డి, అటవీ, పంచాయతీరాజ్, ఉపాధి హామీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story