దుర్గా మాత నిమజ్జనానికి ఏర్పాట్లు శూన్యం..

by Disha Web Desk 20 |
దుర్గా మాత నిమజ్జనానికి ఏర్పాట్లు శూన్యం..
X

దిశ, నవీపేట్ : దుర్గా మాత నిమజ్జనాన్ని నిర్మల్, నిజామాబాద్ జిల్లా అధికారులు లైట్ తీసుకున్నారు. గణేష్ నిమజ్జన సమయంలో గోదావరి బ్రిడ్జిని పరిశీలించి భారీ ఏర్పాట్లు చేసే అధికారులు దేవి నిమజ్జనాన్ని పట్టించుకోలేదని, బాసర బ్రిడ్జి పై లైటింగ్, క్రేన్, లాంటి ఏర్పాట్లు చేయలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరోనా మహమ్మారితో గత రెండు సంవత్సరాల నుండి ఉత్సవాలకు దూరంగా ఉన్న భక్తులు ఈ సంవత్సరం దేవి నవరాత్రులను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తొమ్మిది రోజులు పూజలు నిర్వహించిన అనంతరం దసరా మరుసటిరోజు నిమజ్జనానికి ఏర్పాట్లు చేసుకుంటారు. నిమజ్జనం రోజు శోభాయాత్రను శోభాయమానంగా నిర్వహించి పుర విధుల గుండా కోలాటాలు, భజనలు, నృత్యాలతో తిప్పి గోదావరిలో నిమజ్జనం చేస్తారు. జిల్లాలో గురువారం శోభాయాత్ర ముగిసిన అనంతరం నిమజ్జనానికి దేవి విగ్రహాలను బాసర గోదావరికి తీసుకువచ్చారు.

గురువారం సాయంత్రం నుండి శుక్రవారం తెల్లవారుజామున వరకు వందకు పైగా విగ్రహాలు నిమజ్జనానికి తరలివచ్చాయని స్థానికులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం నుండే కాకుండా వివిధ మండలాల నుండి దేవి మాత విగ్రహాలు నిమజ్జనానికి తరలివచ్చాయి. ఇంతగా వచ్చిన ఇరు జిల్లా అధికారుల నుండి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విస్మయం చెందుతున్నారు. బాసర గోదావరి వద్ద ఒక ఘాట్ ల వద్ద లైటింగ్ మాత్రమే ఏర్పరచి చేతులు దులుపుకున్నారు. మిగతా ఘాట్ ల వద్ద లైటింగ్ లేకపోవడంతో టార్చి లైట్ వెలుగులో పూజలు నిర్వహించి నిమజ్జన కార్యక్రమం ముగించారు.

పెరిగిన దేవి మండపాలు...

గతంలో కన్నా ఈ సంవత్సరం దేవి మండపాలు జిల్లాలో గణనీయంగా పెరిగినాయి. పదుల సంఖ్యలో ఎక్కువగా దుర్గా దేవిలను ప్రతిష్టించారు. ఈ సమాచారం తెలిసి అధికారులు ఏర్పాట్లు చేయకపోవడాన్ని హిందూ సంఘాలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నాయి.

మహిళా భక్తులు అనేకం...

దేవి నవరాత్రులను మహిళా భక్తులు తొమ్మిది రోజులు ఉపవాసాలతో పూజలు నిర్వహిస్తారు. అనంతరం దుర్గా శోభాయాత్రలో కోలాటాలు ఆడుతూ భవాని మాతను సాగనంపుతారు. ఈ క్రమంలో నిమజ్జనానికి సహితం అధిక సంఖ్యలో హాజరవుతారు. మహిళ భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే ఈ వేడుకలకు పోలీస్ బందోబస్తు, మహిళ పోలీసులు బాసర బ్రిడ్జి, గోదావరి పుష్కర ఘాట్ లపై లేకపోవడం నిర్మల్, నిజామాబాద్ జిల్లా అధికారుల తీరుపై మహిళా భక్తులు సహితం అసహనం వ్యక్తం చేస్తున్నారు.

భారీ విగ్రహాలను నిమిజ్జనం చేసే ఘాట్ ల వద్ద, బ్రిడ్జి పై క్రేన్ లేకపోవడం, పోలీసు భద్రత లేకపోవడంతో భక్తులు ఇష్టారాజ్యంగా నిమజ్జనం చేయడంతో గోదావరి బ్రిడ్జి పై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. వందకు పైగా దుర్గా దేవి విగ్రహాలు నిమజ్జనం జరిగాయని, ప్రభుత్వ ఏర్పాట్లు లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా జిల్లా అధికారులు వచ్చే యేడాది ముందస్తు ఏర్పాట్లు చేయాలని హిందూ సంఘాలు కోరుతున్నాయి.


Next Story

Most Viewed