ఆఫీస్ లో తహసీల్దార్.. ఇంట్లో సిబ్బంది...

by Disha Web Desk 20 |
ఆఫీస్ లో తహసీల్దార్.. ఇంట్లో సిబ్బంది...
X

దిశ, మాచారెడ్డి : తహసీల్దార్ ఉదయం 10 గంటలకు ఆఫీసులో కూర్చుండి సమయపాలన పాటిస్తే, సిబ్బంది మాత్రం 11:30 గంటలకు కార్యాలయానికి చేరుకున్నారు. అది కూడా పలుమార్లు తహసీల్దార్ ఫోన్లు చేస్తే గాని ఆ సమయానికి చేరుకోలేరు. ఏ ప్రభుత్వ కార్యాలయంలో నైనా సిబ్బంది పై ఆఫీసర్ కు భయపడతారు. కానీ, కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల తహసీల్దార్ కార్యాలయంలో మాత్రం సిబ్బందికే పై ఆఫీసర్ భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది సమయపాలన పాటించకుండా తమ ఇష్టానుసారంగా విధులు నిర్వర్తించడం పట్ల మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేతివృత్తుల వారికి లక్ష సహాయం అందిస్తాం అన్న ప్రభుత్వ ప్రకటనతో దరఖాస్తుల వెల్లువ కొనసాగుతుంది. ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకోవాలంటే రాబడి ధృవపత్రం కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరి.

వాటిని పొందడానికి దరఖాస్తు చేసుకున్న మండల ప్రజలు గత ఆరు రోజులుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది సమయపాలన పాటించకపోవడం పట్ల దరఖాస్తుదారులు ఆమె అడ్మినిస్ట్రేషన్ పై మండిపడుతున్నారు. సిబ్బందికి ఎన్నిసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా పద్ధతి మారడం లేదంటూ మాచారెడ్డి తహసీల్దార్ సునీత వివరణ ఇచ్చారు. సిబ్బంది సమయపాలన పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని దరఖాస్తుదారులు డిమాండ్ చేస్తున్నారు. సమయపాలన పాటించడం లేదని నిలదీస్తే ఆందోళన వ్యక్తం చేశారు. ఆలస్యంగా ఆఫీసుకు రావడం పై బండి చెడిపోయిందని బస్సు లేట్ అయిందని కుంటి సాకులు చెబుతున్నారని దరఖాస్తుదారులు వివరించారు. స్థానిక ప్రజాప్రతినియులైనా ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది సమయపాలన పై సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Next Story

Most Viewed