వసూళ్లపై కసరత్తు.. నాలుగు రోజుల్లో 40 శాతం లక్ష్యం

by Disha Web Desk 12 |
వసూళ్లపై కసరత్తు.. నాలుగు రోజుల్లో 40 శాతం లక్ష్యం
X

రాష్ట్ర రవాణా శాఖ నిర్ధేశిత పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని చేరేందుకు నిజామాబాద్ జిల్లాలో ఆ శాఖాధికారులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండడంతో లక్ష్యాన్ని చేరేందుకు శాయశక్తులా యత్నిస్తున్నారు. మూడు నెలలుగా టార్గెట్ అచీవ్ మెంట్ కోసం అడపాదడపా తనిఖీలు నిర్వహించిన రవాణా శాఖాధికారులు ఈ నెలలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ ఏరియాలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, కామారెడ్డి ప్రాంతాలలో నిత్యం స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు. ఒక ఎంవీఐతో కూడిన టీంలు ప్రతి ఏరియాలో వాహనాలకు పన్నులు చెల్లించని వాటిని గుర్తించడం, ఫిట్ నెస్ లేని వాహనాలను గుర్తించే పనిలో పడ్డారు. ఈ నెల 31 వరకు వంద శాతం పన్నులు వసూళ్లే లక్ష్యంగా పని చేస్తున్నారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని నాలుగు యూనిట్ల పరిధిలో వాహనాల ఫిట్నెస్, ట్యాక్స్ వసూళ్ల కొరకు ఎంవీఐలు స్పెషల్ డ్రైవ్ చేస్తుండగా రవాణా శాఖాధికారులు కార్యాలయాల్లోనూ నిర్ధేశిత లక్ష్యాన్ని చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు 60 శాతం నిర్ధేశిత లక్ష్యాన్ని వసూల్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఫిట్ నెస్ లేని రవాణా శాఖకు పన్నులు చెల్లించని 850 వాహనాలను గుర్తించి కేసులు నమోదు చేశారు. తనిఖీలలో ఫిట్ నెస్ గాని, సంబంధిత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేకపోతే చెక్ లిస్టుల కోసం వస్తున్న వాహనాల సంఖ్య పెరుగుతుంది.

రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్‌లో ఇప్పటి వరకు 850 కేసులు కాగా పోలీసు శాఖ ద్వారా వస్తున్న చెక్ లిస్ట్ లతోనూ రవాణా శాఖ ఆదాయాన్ని పెంచుకునే పనిలో పడింది. జిల్లాలో ఎంవీఐలు తనిఖీలు ఓ వైపు జరుగుతుండగానే అంతర్రాష్ట్ర చెక్ పోస్టులయిన సాలూరా, సలాబత్‌పూర్‌తో పాటు కామారెడ్డిలోని ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద తనిఖీలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఆన్ లైన్ ద్వారా పన్నులు చెల్లించే అవకాశం ఉండడంతో దానిని సద్వినియోగం చేసుకోవాలని రవాణా శాఖాధికారులు చెప్పుకొస్తున్నారు.

రవాణా శాఖ సాధించాల్సిన లక్ష్యం 40 శాతం నాలుగు రోజుల్లో పూర్తవుతుందా అనే సందేహం వ్యక్తమౌతుంది. రవాణా శాఖాధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. నాలుగు రోజుల్లో గడువు ఉండగా లక్ష్యం ఏ మేరకు పూర్తి చేస్తారోననే వాదనలు ఉన్నాయి. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే రవాణా శాఖ కోట్ల రూపాయల పన్నుల వసూళ్లు ఫిట్ నెస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని చేరుకోవడం కష్టమని చెప్పాలి. నాలుగు రోజుల్లో ఉన్న మూడు ప్రత్యేక టీంలు 12 గంటలు కష్టపడిన లక్ష్యాన్ని చేరడం కష్టమే.

గతంలో రవాణా శాఖ పన్నుల వసూళ్లలో ఇతర జిల్లాలకు ఆదర్శంగా ఉండగా ఈసారి అధికారులు మార్చి మాసంలో లక్ష్యం కోసం పని చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. గతంలో రవాణా శాఖ అధికారులు జనవరి మాసం నుంచే టార్గెట్ పెట్టి వసూళ్లను ప్రారంభించేవారు. కానీ ఈసారి ఆలస్యం కావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఈ విషయంపై రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ వెంకటరమణ వాహనాల పన్నుల వసూళ్లు, ఫిట్ నెస్ కోసం ప్రత్యేక తనిఖీల కార్యక్రమం జరుగుతుందని, దాదాపు లక్ష్యాన్ని చేరుతామని తెలిపారు.



Next Story