పస్తులుంటున్న పారిశుద్ధ్య కార్మికులు..

by Disha Web Desk 20 |
పస్తులుంటున్న పారిశుద్ధ్య కార్మికులు..
X

దిశ, భిక్కనూరు : పుస్తకాలు పట్టుకొని... ఊళ్లో తిరుగుతూ... పన్నుల రూపేనా వచ్చే డబ్బులను బ్యాంకు ఖాతాలో వేసి లక్షల రూపాయలు జమచేసి ఉంచితే... వాటిని మా జీతాలకు కూడా వాడుకోకుండా ఫీజింగ్ పెట్టడాన్ని నిరసిస్తూ కామారెడ్డి జిల్లా భిక్కనూరులో ఆదివారం మండల కేంద్రంలో పారిశుద్ధ్య కార్మికులు భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. రెండు నెలలు దాటి, నేటికీ 12 రోజులు గడుస్తున్నా... ఇంతవరకు జీతాలు చెల్లించకపోతే మా కుటుంబాలను ఎట్లా పోషించుకునేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాల కోసం రోజూ ఎదురుచూస్తున్నప్పటికీ, అవి రాకపోవడంతో అప్పులు చేసి బతుకు బండి సాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాల విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ ఫీజింగ్ పెట్టారని, మా చేతుల్లో ఏమీ లేదని చెబుతున్నారని, అందువల్లే పూట గడవడం కోసం భిక్షాటనకు దిగామన్నారు.

కార్యదర్శులు, సీనియర్ అసిస్టెంట్లు, బిల్ కలెక్టర్లకు మాత్రమే వేతనాలు చెల్లిస్తున్న ప్రభుత్వం తమకెందుకు చెల్లించడం లేదని వాపోయారు. సచివాలయ అకౌంట్లో లక్షలు జమచేసి ఉంచిన డబ్బులను ఇతర పథకాలకు మల్లిస్తూ తమను పస్తులుంచడం న్యాయమా అంటూ...? భిక్షాటనకు దిగిన పారిశుద్ధ్య కార్మికులు ఆక్రోశాన్ని వెలగకక్కారు. సముద్రాన్ని తలాపుకు పెట్టుకొని గరిటేడు నీళ్లు అవసరానికి పనికిరావన్న చందంగా, లక్షలు జిపి ఖాతాల్లో జమచేసి ఉంచినా జీతాలకు కూడా వాడుకోకుండా, దుర్భర జీవితాలను గడుపుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా తమ పరిస్థితిని అర్థం చేసుకొని అధికారులు పారిశుద్ధ్య కార్మికులు, అటెండర్లు, వాటర్ మెన్ల ట్రాక్టర్ డ్రైవర్ల కుటుంబాలను పస్తులు ఉంచకుండా వెంటనే జీతాలు చెల్లించాలని వేడుకున్నారు.


Next Story

Most Viewed