రేపు ఆర్మూర్ కి పైడి రాకేష్ రెడ్డి రాక

by Disha Web Desk 1 |
రేపు ఆర్మూర్ కి పైడి రాకేష్ రెడ్డి రాక
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పైడి రాకేష్ రెడ్డి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సమక్షంలో ఇటీవల ఢిల్లీలో బీజేపీ జాతీయ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అంకాపూర్ కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పైడి రాకేష్ రెడ్డి భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకొని తొలిసారిగా ఆర్మూర్ నియోజకవర్గానికి మంగళవారం రానున్నారు.ఈ సందర్భంగా డిచ్ పల్లిలోని ఇందల్వాయి టోల్ ప్లాజా నుంచి ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రాకేష్ రెడ్డి అభిమానులు భారీ ర్యాలీతో ఆర్మూర్ మున్సిపల్, ఆర్మూర్, ఆలూర్, డొంకేశ్వర్, నందిపేట్, మాక్లూర్ ల మీదుగా అంకాపూర్ కు రానున్నారు.

పైడి రాకేష్ రెడ్డి బీజేపీలో చేరిన తర్వాత ఆర్మూర్ నియోజకవర్గానికి మొదటి సారి రానున్న నేపథ్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి ఆర్మూర్ కి వచ్చే జాతీయ రహదారి వెంట టోల్ ప్లాజాల వద్ద, ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్, అన్ని మండలాల్లోని అన్ని గ్రామాల్లో భారీ సంఖ్యలో ఆయనకు స్వాగతం పలుకుతూ అభిమానులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆర్మూర్ నియోజకవర్గానికి వస్తున్న అభిమాన నేత రాకేష్ రెడ్డి స్వాగత ర్యాలీలో పాల్గొని ఆర్మూర్ నియోజకవర్గ వ్యాప్తంగా గల బీజేపీ మద్దతుదారులు, రాకేష్ రెడ్డి అభిమానులు అత్యంత ఉత్సాహంతో విజయవంతం చేసేందుకు ఉరకలేస్తున్నారు.

Next Story