బాల్కొండ అభివృద్ధిని ఎవరు ఆపలేరు.. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి..

by Disha Web Desk 20 |
బాల్కొండ అభివృద్ధిని ఎవరు ఆపలేరు.. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి..
X

దిశ, భీమ్‌గల్ : తాను ఉండగా బాల్కొండ అభివృద్ధిని ఎవరు ఆపలేరని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. బాల్కొండ మండలంలో శనివారం పలుఅభివృద్ది కార్యక్రమాలు, శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించిన కళ్యాణ మండపం ప్రారంభోత్సవం, నూతనంగా నిర్మించిన కేజీబీవి స్కూల్ ప్రారంభోత్సవం (వన్నెల్ రోడ్), కిసాన్ నగర్ గ్రామంలో బాల్కొండ నుండి ముప్కాల్ వరకు 1.3కోట్ల వ్యయంతో బీటీ రోడ్ పునరుద్ధరణ, నాగాపూర్ నుండి గోదావరి రివర్ వరకు 1.15 కోట్ల వ్యయంతో బీటీ రోడ్ ఫార్మేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సహకారంతో 114 కోట్లతో బాల్కొండ గ్రామం అన్ని విధాల అభివృద్ది చేసుకున్నామని గణాంకాలతో సహా మంత్రి వివరించారు. తాను ఉండగా బాల్కొండ అభివృద్ధిని ఎవరు ఆపలేరని, ఎవరు అడ్డు వచ్చిన అభివృద్ధి ఆగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తాను అభివృద్ది కోసం తాపత్రయ పడుతుంటే బీజేపీ, కాంగ్రెస్ నేతలు కమిషన్లు తింటున్నానని అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ది కోసం కష్టపడుతున్న నన్ను కమిషన్లు తిన్నవని నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. తన తమ్ముడు గంజాయి అమ్ముతున్నరని అడ్డగోలుగా మాట్లాడుతున్నారని గంజాయి అమ్మాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఈ మాటలు వింటుంటే ఒక్కోసారి బాధ అనిపిస్తుందని తన ఆవేదన వ్యక్తం చేశారు.

బాల్కొండ నియోజకవర్గంలోనే అత్యధికంగా గంజాయి కేసులు అయ్యాయని తాను ఆదిలాబాద్ ఎస్పీ, జిల్లా పోలీసు వాళ్ళను పలుమార్లు ఆదేశిస్తే, కఠినంగా వ్యవహరిస్తే గంజాయి వాడకం తగ్గిందని చెప్పారు. గంజాయి నిర్మూలన కోసం తాను పనిచేస్తే మేమే అమ్ముతున్నమని నిరాధార ఆరోపణలు చేస్తూ మా కుటుంబాన్ని బద్నాం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఉన్న ఏకైక క్రషర్ లో 400కోట్లు సంపాదించారని ఆరోపణ చేస్తున్నారు. తానుతన బంధువులకు చెప్పి 10 కోట్లకే ఆ క్రషర్ ఇప్పిస్తానని ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేశారు. వందల కోట్ల కాంట్రాక్టులు కమిషన్లు అని మాట్లాడుతున్నారు. ఇంకా నియోజవర్గంలో 300 నుంచి 400 కోట్ల వర్క్ చేయడానికి రెడీగా ఉన్నది. అందులో 100 నుంచి 150 కోట్లు బీజేపీ నేతలు చెప్పిన వారికే ఇస్తా కాంట్రాక్టుకు ముందుకు రావాలని డిమాండ్ చేశారు.

కాంట్రాక్టులు అన్ని మీకే అప్పజెప్తా, దమ్ముంటే వచ్చి చేయండని సవాల్ విసిరారు. అన్ని బట్ట కాల్చి మీద వేసే మాటలే, ఏ ఒక్కదానికి ఆధారం లేదని అన్నారు. నా మీద ఆరోపణలను వారంలో నిరూపించాలి. లేకుంటే ముక్కునేలకు రాయాలని డిమాండ్ చేశారు. ప్రజలు కూడా అభివృద్ది చేసే వారు ఎవరో, రెచ్చగొట్టే వారెవరో దయచేసి గమనించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ మాయ మాటలు నమ్మితే గోసపడతామని వివరించారు. బీజేపీ నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు పెంచి సామాన్యులను గోస పెడుతున్నారని గుర్తు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అనంతరం భీమ్‌గల్ మండలం పిప్రి‌ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.

5 కోట్ల వ్యయంతో నిర్మించే పిప్రి నుండి ముచ్కూర్ డబుల్ రోడ్ పనులకు శంకుస్థాపన, పిప్రి నుండి లొద్ది రామన్న టెంపుల్ ఫార్మేషన్ 3.2 కోట్ల వ్యయంతో తాండ వద్ద శంకుస్ధాపన, 75 లక్షలతో టెంపుల్ వద్ద స్లాబ్ కల్వర్ట్ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ది పనుల పరంపర కొనసాగుతుందని మంత్రి వేముల చెప్పారు. అందులో భాగంగా భీమ్‌గల్ మండలం పిప్రి గ్రామంలో పలు అభివృద్ది పనులకి ఆహ్లాదకరమైన వాతావరణంలో శంకుస్ధాపన చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆర్మూర్ మహేష్, జెడ్పీటీసీ చౌట్ పల్లి రవి, మండల అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, పిప్రి సర్పంచ్ ప్రవీణ్ కుమార్, ఎంపీటీసీ సరిత స్వామి, గ్రామ అధ్యక్షుడు రాజేశ్వర్, గోలి శ్రీకాంత్, జనార్థన్, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed