మ‌త్తు ప‌దార్థాలను నిరోధించాలి : అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్

by Ratna Kumari |

మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధానికి విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు.

మ‌త్తు ప‌దార్థాలను నిరోధించాలి :  అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధానికి విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం అదనపు కలెక్టర్ అధ్యక్షతన మత్తు పదార్థాల నిరోధక కమిటీ జిల్లా స్థాయి సమావేశం జ‌ర‌గ్గా సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. మత్తు పదార్థాల నియంత్రణకు చేపట్టిన చర్యలపై చర్చించి అవలంభించాల్సిన విధానాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ప్రజలలో అవగాహన పెంపొందించేందుకు సామాజిక మాద్య‌మాలతో పాటు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. కల్తీ కల్లు తయారీ కోసం వినియోగించే అల్ఫ్రాజోలంను కట్టడి చేసేందుకు గట్టి నిఘా ఉంచాలన్నారు. క్లోరోఫాం, డైజోఫాం, ఆల్ఫ్రాజోలం వంటి వాటిని వినియోగిస్తూ తయారు చేసిన కల్తీ కల్లు సేవిస్తుండడం వల్ల అనేక మంది అనారోగ్యాల బారిన పడుతున్నారని, దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఎవరు కూడా కల్తీ కల్లు బారిన పడకుండా గ్రామగ్రామాన అవగాహన కల్పించాలని సూచించారు.

నిరంతర దాడులు కొనసాగిస్తూనే, మత్తు పదార్థాల పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ వారిని చైతన్యపర్చాల్సిన అవసరం ఉందని అన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధక కమిటీలను బలోపేతం చేస్తూ పూర్తి స్థాయిలో అవి పని చేసేలా చూడాలని విద్యా శాఖ అధికారులకు సూచించారు. మత్తు పదార్థాల నిర్మూలన కోసం ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ అనేక చర్యలు చేపడుతోందని కలెక్టర్ గుర్తు చేశారు. ఎక్కడైనా గంజాయి, క్లోరల్ హైడ్రేట్, డైజోఫామ్, అల్ఫ్రాజోలం వంటి వాటి రవాణా, విక్రయాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే సంబంధిత శాఖల అధికారులకు సమాచారం అందించాలని, టోల్ ఫ్రీ నెంబర్ 1908 కు కూడా ఫోన్ చేసి సమాచారం తెలియజేయవచ్చని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని అన్నారు. ఈ సమావేశంలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నిజామాబాద్ జోన్ ఏసీపీ సోమనాథం, ఏసీపీ ప్రకాష్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, జిల్లా ఔషధ నియంత్రణ అధికారిణి శ్రీలత, డీఐఈఓ రవికుమార్, ఎం.వీ.ఐ శ్రీనివాస్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ భాస్కర్, సైకియాట్రిస్ట్ డాక్టర్ రవితేజ తదితరులు పాల్గొన్నారు.

Next Story